Sheikh Hasina : బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధాని (Former Prime Minister) షేక్ హసీనా (Sheik Hasina) పై అక్కడి ప్రాసిక్యూటర్లు మరో నేరాభియోగం మోపారు. సామాన్య పౌరులపై క్రూరత్వం ప్రదర్శించినట్లు ఆరోపణలు చేశారు. 2024లో విద్యార్థుల ఉద్యమాన్ని ఆమె క్రూరంగా అణచివేయాలని చూసినట్లు అభియోగంలో పేర్కొన్నారు. భద్రతా దళాలు, తన పార్టీ సభ్యులు ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు చర్యలు తీసుకోవాలని హసీనా నేరుగా ఆదేశించినట్లు గుర్తించామని చెప్పారు.
ఇందుకు సంబంధించిన ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్లు, వీడియో ఆధారాలు ఉన్నాయని చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ ఇస్లాం ఆదివారం తెలిపారు. దీనికి 81 మందిని సాక్షులుగా పేర్కొన్నారు. దేశంలో సంక్షోభ సమయంలో భద్రతాదళాలు తీసుకున్న చర్యలకు నాటి దేశాధినేత హసీనాదే బాధ్యత అని తాజుల్ చెప్పారు. ఆమె చేపట్టిన అణచివేత కార్యక్రమంలో దాదాపు 1500 మంది మరణించగా 25,000 మంది గాయపడ్డారు.
గత ఏడాది బంగ్లాదేశ్లో అల్లర్లు చెలరేగడంతో ఆ దేశ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. దాదాపు 15 ఏళ్లపాటు ఆమె దేశాన్ని పరిపాలించారు. గత ఆగస్టులో ఆమె ఢాకాను వీడి న్యూఢిల్లీకి చేరుకున్నారు. నాటి నుంచి ఆమె అక్కడే ఆశ్రయం పొందారు. బంగ్లాదేశ్లో యూనస్ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం వరుసగా హసీనాపై కేసులను బనాయిస్తోంది. ఆమె కుటుంబ సభ్యులపై పలు ఆరోపణలు వచ్చాయి.
మరోవైపు ఆమెపై ఇప్పటికే 100కు పైగా కేసులున్నాయి. ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ ఆమెపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.