కొవిడ్ నియంత్రణపై సీఎం కేసీఆర్ దృష్టి
ఆక్సిజన్ సరఫరా కోసం అద్దెకు యుద్ధ విమానాలు
ఏ జిల్లా రోగులకు ఆ జిల్లాలోనే వైద్యం
24 గంటలూ పని చేస్తున్నాం
మందులను బ్లాక్ చేస్తే కఠిన చర్యలు
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్
మంత్రి గంగులతో కలిసి సర్కారు దవాఖానలో ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ ప్లాంట్, ఆర్టీపీసీఆర్ ల్యాబ్ ప్రారంభం
ఉమ్మడి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష
హాజరైన మరో మంత్రి కొప్పుల
కరీంనగర్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్: ‘రోజురోజుకూ కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి.. నిబంధనలు పాటిస్తూ వైరస్ కట్టడికి సహకరించాలి’ అని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. ఏ జిల్లాలోని రోగులకు ఆ జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లోనే మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఉమ్మడి జిల్లా పరిధిలోని కలెక్టర్లు, జడ్పీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, జిల్లా వైద్యా ఆరోగ్య శాఖాధికారులతో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్తో కలిసి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకుముందు కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానలో ఆర్టీపీసీఆర్ ల్యాబొరేటరీ, ఆక్సిజన్ కాన్సెంట్రెటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఆయాచోట్ల మంత్రి ఈటల మాట్లాడారు. వైరస్ నియంత్రణకు అధికార యంత్రాంగం 24 గంటలు కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తోందన్నారు. గతేడాది లాక్డౌన్ విధిస్తే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, ఉపాధి దెబ్బతిన్న నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా నిబంధనలు పాటించాలని కోరారు.
మహారాష్ట్ర నుంచి రాకపోకలు అధికంగా ఉన్నందునే జగిత్యాల జిల్లాలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని విశ్లేషించారు. కరోనా రోగుల చికిత్సకు ప్రభుత్వ దవాఖానాలకు కావాల్సిన ఇంజెక్షన్లు, మందులు, ఆక్సిజన్, బెడ్స్ సమకూర్చామన్నారు. అవసరం మేరకు డాక్టర్లు, వైద్య సిబ్బందిని తాతాలికంగా నియమించుకునేందుకు కలెక్టర్లకు అధికారులు ఇచ్చామన్నారు. దవాఖానల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులను చూసుకునేందుకు అనుమతించామన్నారు. హోం ఐసోలేషన్లో ఉన్న వారు పల్స్ ఆక్సి, టెంపరేచర్ మీటర్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. పల్స్ తగ్గితే దవాఖానలో చేరాలన్నారు. ప్రతిమ, చల్మెడ వైద్య కళాశాలలో డిపాజిట్ లేకుండా కరోనా పేషెంట్లకు వైద్య సేవలందించాలని సూచించారు. ఈ నెల 30 లోగా 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ చేయించాలన్నారు. రెండు రోజుల్లో రెమ్డెసివిర్ కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానల్లో కనీస అవసరాలు, మ్యాన్ పవర్ కొరత లేకుండా చూడాలన్నారు. రెమిడెసివిర్ తదితర మందులు బ్లాక్ చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. కరీంనగర్ ప్రభుత్వ దవాఖానాలో ఏర్పాటు చేసిన ఆర్టీపీసీఆర్ ల్యాబ్తో రోజుకు 400 నమూనాలను పరీక్షించవచ్చన్నారు. ఆటోమెటిక్ మిషన్ను జత చేస్తే వెయ్యి నుంచి 2 వేల శాంపిల్స్ పరీక్షలు నిర్వహించవచ్చన్నారు.
ఆక్సిజన్ కాన్ సెంట్రెటర్ ప్లాంటుతో ఇక్కడే ఆక్సిజన్ ఉత్పత్తి చేసి రోగులకు అందించే అవకాశం ఉంటుందన్నారు. కరోనాకు భయపడవద్దని, అదే సమయంలో నిర్లక్ష్యం కూడా వద్దన్నారు. లక్షణాలు ఉన్నా పరీక్షలు చేయించుకోకుండా, చికిత్స పొందని వారే ఎక్కువగా మరణిస్తున్నారని, ఏ మాత్రం అనుమానం ఉన్నా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ప్రభుత్వ దవాఖానాల్లో ఆక్సిజన్ కొరత లేదని, ప్రైవేట్లో ఉన్నట్లు తెలుస్తోందని, వారం రోజుల్లో ఎక్కడా కూడా ఆక్సిజన్ లేదనే వార్త రాదన్నారు. ఆక్సిజన్ సరఫరాకు సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారని, యుద్ధ విమానాలను అద్దెకు తీసుకుని ఆక్సిజన్ తెప్పిస్తున్నారని అన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న విశాఖ, బల్లారి నుంచి కాకుండా 1,300 కిలో మీటర్ల దూరంలోని ప్లాంట్ల ద్వారా కేంద్రం మన రాష్ర్టానికి ఆక్సిజన్ కేటాయిస్తోందని అన్నారు. రైల్లు, ట్యాంకర్ల ద్వారా రావాలంటే నాలుగైదు రోజుల నుంచి వారం పడుతోందన్నారు. ఈ కారణంగానే సీఎం కేసీఆర్ యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజన్ తెప్పిస్తున్నారన్నారు. రెమిడెసివిఆర్ మందు కోసం కలెక్టర్లు, పోలీసు అధికారులు వీటిని పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు.
మంత్రి గంగుల మాట్లాడుతూ రెమిడెసివర్, ఆక్సిజన్ పంపిణీపై ప్రత్యేక నిఘా పెట్టాలని అన్నారు. రాష్ట్రస్థాయిలో రిసీవర్ పంపిణీపై ప్రత్యేక లైజనింగ్ అధికారిని నియమించాలని అధికారులకు సూచించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ రెమిడెసివిర్ ఇంజెక్షన్లు, మందుల ప్రతిరోజూ దవాఖానాలకు ఎన్ని వచ్చాయి. ఎన్ని వాడారు అనే రిపోర్ట్ ఆసుపత్రులు కచ్చితంగా సమర్పించాలన్నారు. టెస్టింగ్ కిట్లు ఎకువ ఇవ్వాలని, ఆక్సిజన్ సిలిండర్లు పెంచాలన్నారు. దవాఖానలకు అవసరమున్న పరికరాలను డీఎంఎఫ్టీ నిధుల నుంచి కొనుగోలు చేయాలన్నారు. ఈ సమావేశంలో కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ, వసంత, పుట్ట మధుకర్, కలెక్టర్లు కే శశాంక, బి రవి, డాక్టర్ సంగీత సత్యనారాయణ, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, అదనపు కలెక్టర్లు, జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానాల సూపరింటెండెంట్ రత్నమాల, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
కరోనా వల్ల జాబ్ పోయింది.. ఇప్పుడదే కరోనా మృతుల అంత్యక్రియలు నిర్వహిస్తూ..
ఇన్ని సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా