Sandwich | ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్లో వెజ్ శాంచ్విచ్ ఆర్డర్ చేసిన మహిళలకు నాన్వెజ్ శాండ్విచ్ డెలివరీ అయ్యింది. దీంతో ఆ మహిళ శాండ్విచ్ పంపిన రెస్టారెంట్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదు చేయగా.. రూ.5వేల జరిమానా విధించారు. జరిమానా ఏమాత్రం సరిపోదని.. రెస్టారెంట్ నుంచి రూ.50లక్షల పరిహారం కరుతూ కేసు వేసేందుకు సిద్ధమైంది. ఈ ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్లో చోటు చేసుకున్నది. నిరాలీ అనే మహిళ ఇటీవల అహ్మదాబాద్ సైన్స్ సిటీలోని తన కార్యాలయంలో ఉండగా.. ‘పిక్ అప్ మీల్స్ బై టెర్రా’ నుంచి పనీర్ టిక్కా శాండ్విచ్ ఆర్డర్ చేసింది.
ఆర్డర్ వచ్చాక ఆ శాండ్విచ్ను కొంచెం తినగానే ఆమెకు అనుమానం వచ్చింది. శాండ్విచ్లో ఉన్న పనీర్ ముక్కలు కాస్త గట్టిగా కనిపించాయి. మొదట అవి సోయాగా భావించింది. ఆ తర్వాత పరిశీలించి చూడగా చికెన్ ముక్కలుగా తేలింది. అయితే, నీరాలి వెజిటేరియన్ కాగా.. నాన్వెజ్ శాండ్విచ్కు బదులుగా.. చికెన్ శాండ్విచ్ పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఆమె అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ హెల్త్ ఆఫీసర్కు లేఖ రాశారు. దాంతో రెస్టారెంట్కు అధికారులు రూ.5వేల జరిమానా విధించారు. ఈ ఘటన భయంకరమైందని.. దాన్ని మార్చలేమని మహిళ మీడియాకు తెలిపింది. రెస్టారెంట్కు రూ.5వేల జరిమానా సరిపోదని.. వినియోగదారుల ఫోరంను ఆశ్రయించనున్నట్లు ఆమె తెలిపారు. రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టులో కేసు వేయనున్నట్లు నీరాలి పేర్కొన్నారు.
తమ హక్కులు ఏంటో తెలియని వినియోగదారుల కోసం ఈ పోరాటం చేస్తున్నట్టు నిరాలీ చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పటి వరకు రెస్టారెంట్ స్పందించలేదు. అయితే, గత నెలలో ఆకాశ్ గుప్తా అనే వ్యక్తికి వెజ్కి బదులుగా నాన్వెజ్ సమోసాలను డెలివరీ చేశారు. చైత్ర నవరాత్రుల సమయంలో ఈ సంఘటన జరిగింది. తప్పుడు ఆర్డర్లు ఎలా పంపుతారంటూ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటోపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారంపై జొమాటో విచారం వ్యక్తం చేసింది. అలాగే, గతేడాది ఇదే తరహా ఘటనలో డెలివరీ ప్లాట్ఫారమ్, జొమాటో, రెస్టారెంట్ పార్టనర్ మెక్డోనాల్డ్స్కి రూ.లక్ష జరిమానా విధించింది.