Utkoor MRO office | ఊట్కూర్, ఆగస్టు 13 : ఊట్కూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పట్టాదారు పాసు పుస్తకం కాపీల కోసం వచ్చిన రైతుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లుగా కనిపిస్తున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. పాసు పుస్తకం కాపీల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ కార్యాలయంలో ఫైళ్లు ముందుకు కదలడం లేదని, డబ్బులు చెల్లిస్తేనే పనులు జరుగుతున్నాయని బాధితుడు ఆరోపించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను వీడియోలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. రెవెన్యూ కార్యాలయంలో రికార్డ్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తున్న అధికారిని రేణుక లంచం డిమాండ్ చేస్తున్నట్లుగా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
తన వద్ద ఉన్న వీడియో, ఫొటోలను జిల్లా కలెక్టర్తో పాటు అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు అందజేయనున్నట్లు బాధితుడు వెల్లడించాడు. వీడియోలోని దృశ్యాల వాస్తవికత, అందులో ఉన్న వ్యక్తులు, లావాదేవీ వివరాలపై సమగ్ర విచారణ జరిపితే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాల్సిన అధికారులు లంచాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు రావడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ ఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ చేపట్టి, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి రెవెన్యూ కార్యాలయాల్లో పారదర్శక పాలనకు భరోసా కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై తాసిల్దార్ అశోక్ కుమార్ను వివరణ కోరగా.. సోషల్ మీడియాలో వస్తున్న వీడియో ఆధారంగా రికార్డ్ అసిస్టెంట్పై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Sukumar | సుకుమార్ కూతురు అరుదైన ఘనత.. సింగర్స్ విభాగంలో ఏకైక విద్యార్థిని!
Earth Quake | లడఖ్లో గంటల వ్యవధిలో రెండు భూప్రకంపనలు