కరీంనగర్, మే 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆయనకు పదవి ఉన్నా, లేకపోయినా నిరంతరం ప్రజల కోసం పనిచేసే నాయకుడు. ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా.. అభివృద్ధే శ్వాసగా ముందుకు సాగే కృషీవలుడు. కరీంనగర్ నుంచి 16వ లోక్సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకయ్యారు. ఐదేళ్ల కాలంలో 553 ప్రశ్నలు సంధించి దేశంలోనే ఎక్కువ ప్రశ్నలు అడిగిన ఎంపీగా నిలిచి ఈ ప్రాంతానికే వన్నెతెచ్చారు. నాడు ఉద్యమ నేత కేసీఆర్కు అడులో అడుగై, ఆ తర్వాత పార్లమెంట్లో ప్రశ్నించే నేతగా పేరుగాంచారు. క్రమశిక్షణకు మారుపేరుగా వివాద రహితుడిగా, విజ్ఞానవంతుడిగా అందరి మనస్సుల్లో ముద్రవేసుకున్న ఆయన ఎవరోకాదు.. ప్రస్తుత బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్కుమార్! అప్పుడే కాదు, ఇప్పుడూ ఒక లక్ష్యంతో ఆయన బరిలో దిగారు. అందరికంటే ముందుగానే జనంలోకి వెళ్లి.. ఎంపీగా తనను గెలిపిస్తే కరీంనగర్కు ఏమి సాధిస్తారో..? స్పష్టం చేయడమే కాదు, కరపత్రంలోనూ ముద్రించి అందరి మన్ననలు పొందారు.
కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్, ఆది నుంచీ ప్రజల పక్షానే నిలిచారు. కరీంనగర్ నుంచి 16వ లోక్సభ సభ్యుడిగా గెలిచి, పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకయ్యారు. తెలంగాణపై పూర్తి పట్టున్న ఆయన, రాష్ర్టానికి జరుగుతున్న ఎన్నో అన్యాయాలపై పార్లమెంట్ సాక్షిగా కేంద్రాన్ని నిలదీశారు. అక్కడితో ఆగకుండా ఎంపీగా తన పదవీ కాలంలో 106 చర్చల్లో పాల్గొన్నారు. అంతేకాదు, చర్చల్లో చురుగ్గా పాల్గొన్న మొదటి వ్యక్తిగా నిలిచారు. ఒకటి రెండు కాదు 2014 నుంచి 2019 వరకు ఐదేళ్ల కాలంలో వివిధ అంశాలపై 553 ప్రశ్నలు సంధించి ఎక్కువ ప్రశ్నలు అడిగిన ఎంపీగా మొదటి స్థానంలో నిలిచారు. సిరిసిల్లలో అప్పారెల్ పార్క్కు కోసం, శాసనభలో సీట్ల పెంపు, తెలంగాణలో ఏఐఐఎంఎస్ ఏర్పాటు వంటి అనేక అంశాలపై కేంద్రాన్ని నిలదీశారు. పదవిలో ఉన్నా లేకపోయినా, ఆయన కరీంనగర్ అభివృద్ధే శ్వాసగా పనిచేశారు. కేంద్రం దేశంలోని అనేక ప్రాంతాలకు మెడికల్ కళాశాలలు మంజూరు చేసిన సమయంలో కరీంనగర్కు కూడా ఇవ్వాలంటూ కేంద్ర మంత్రులకు లేఖలు రాశా రు. కేంద్ర చట్టం ప్రకారం జిల్లాకో నవోదయ పాఠశాల ఇవ్వాల్సి ఉందంటూ దానిపై పోరాటం చేస్తూనే ఉన్నా రు. తెలంగాణలో ప్రజల సౌకర్యార్థం సీఎం కేసీఆర్ 2016 అక్టోబర్ 11న చిన్న జిల్లాలను ఏర్పాటు చేయగా, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు నవోదయ పాఠశాలలు ఇవ్వాలంటూ ఆయన అనేకసార్లు కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. కరీంనగర్కు రావాల్సిన ట్రిపుల్ ఐటీ కర్నాటక రాష్ట్రం తన్నుకొని పోతే కేంద్రాన్ని ప్రశ్ని స్తూ, కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు.
నిబంధనలు అడ్డువచ్చినా స్మార్ట్సిటీ సాధించి..
నిజానికి పది లక్షల జనాభా ఉంటేనే స్మార్ట్ సిటీ ఇస్తామని కేంద్రం నిబంధనలు పెట్టింది. అందులో భాగంగానే ముందుగా హైదరాబాద్, వరంగల్ నగరాలను ఎంపిక చేసింది. దీనిపై దూరదృష్టితో ఆలోచన చేసిన వినోద్కుమార్, నిబంధనలు సహకరించకపోయినా కరీంనగర్కు స్మార్ట్సిటీ సాధించారు. దీని కోసం ఆనాడు హైదరాబాద్కు బదులు కరీంనగర్కు ఆ జాబితాలో చోటు కల్పించేలా కేసీఆర్ను ఒప్పించి, కేంద్రానికి లేఖ రాయించారు. అలాగే ఆనాటి రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్తో కలిసి 2016 ఫిబ్రవరి, మార్చిలో ఢిల్లీకి వెళ్లిన సమయంలో స్మార్ట్సిటీ జాబితాలో కరీంనగర్కు చోటు కల్పించాలని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడికి లిఖితపూర్వకంగా లేఖ ఇచ్చారు. వాటి ఆధారంగా స్మార్ట్ సిటీ జాబితాలో, 2016 జూన్లో కరీంనగర్ను చేర్చేలా వినోద్కుమార్ పట్టుబట్టి సాధించారు. ప్రస్తుతం నగరంలో మెరుస్తున్న రోడ్లు, పుట్పాత్లు, అందమైన లైట్లు, పార్కుల నిర్మాణాలకు కారణం వినోద్కుమార్ కృషి ఫలితమే. ఎంపీగా ఉన్నప్పుడు ఉత్తర తెలంగాణలోనే కరీంనగర్ను జాతీయ రహదారుల జంక్షన్ చేయాలన్న లక్ష్యంతో పనిచేశారు. ఆ మేరకు అనేక జాతీయ రహదారులకు కేంద్రం అంగీకారం వచ్చేలా కృషి చేశారు. ఉమ్మడి జిల్లాలో నాలుగు జాతీయ రహదారుల పనుల పర్యవేక్షణ కోసం 2016 జూన్ 24న ఎస్ఈ కార్యాలయాన్ని పట్టుబట్టి ఏర్పాటు చేయించారు. ఇదేకాదు, కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వేలైన్ పట్టుబట్టి సాధించారు. ఈ విషయంలో కేంద్ర అనేక కొర్రీలు పెట్టినా.. అప్పటి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సహకారంతో అధిగమిస్తూ, చివరకు రైల్వే లైన్ను ట్రాక్ ఎక్కించారు. తాను ఎంపీగా లేకపోయినా రాష్ట ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా భూసేకరణ విషయంలో నాలుగైదు సార్లు అధికారులతో మీటింగ్లు పెట్టి, లైన్ త్వరితగతిన పూర్తికి చర్యలు తీసుకున్నారు.
గెలిపిస్తే ప్రజాగొంతుకలా..
తనకు ఈ ఎంపీ ఎన్నికల్లో అవకాశం కల్పిస్తే పార్లమెంట్లో ప్రజాగొంతుకగా మారుతానని వినోద్ కుమార్ చెబుతున్నారు. కరీంనగర్ను ఎడ్యుకేషన్ హబ్గా మార్చి చూపిస్తానని స్పష్టం చేస్తున్నారు. ఐఐటీ, ఐఎస్ఈఆర్, ఐఐఎం వంటి కేంద్ర విద్యాసంస్థలను కరీంనగర్కు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తామంటున్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలకు నవోదయ పాఠశాలలు, ముఖ్యంగా యూత్ ఎంప్లాయిమెంట్ కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు, పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, జిన్నింగ్ మిల్లులు, ఐటీ విస్తరణ, ఉమ్మడి జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాల అభివృద్ధి, ఇంకా నియోజకవర్గ ప్రగతి కోసం అనేక పనులు సాధిస్తామని వినోద్ కుమార్ స్పష్టం చేస్తున్నారు.