వడోదరా: కరోనా ఎంతోమందిని బలి తీసుకుంది. మరెంతో మంది దీని కారణంగా ఉద్యోగాలను కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇలాగే గుజరాత్లోనూ ఓ కుటుంబం తమ జీవనోపాధిని కోల్పోయింది. అయితే ఈ భార్యాభర్తలు మాత్రం కుంగిపోలేదు. పైగా పెద్ద మనసు చేసుకున్నారు. కరోనా కారణంగా మృతి చెందిన వారి అంత్యక్రియలు చేస్తూ అందులోనే జీవనోపాధిని వెతుక్కున్నారు. ఏడాది కాలంగా వడోదరలోని శ్మశాన వాటికనే వారి ఇల్లుగా మలచుకున్నారు. కరోనా కారణంగా మృత్యువాత పడిన వారికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
మహారాష్ట్రకు చెందిన కన్హయ్యలాల్ షిర్కే వడోదరలో పెయింట్ షాప్లో ఉద్యోగం చేస్తుండేవాడు. అయితే గతేడాది లాక్డౌన్ సందర్భంగా అతడు తన ఉద్యోగం కోల్పోయాడు. తప్పనిసరి పరిస్థితుల్లో శ్మశాన వాటిక దగ్గరే ఉండాల్సి వచ్చింది. భార్యా, పిల్లలతో ఏడాదిగా అక్కడే ఉంటున్నాడు. కరోనా కారణంగా మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు వారి అంత్యక్రియలు చేయడంలో సాయం చేస్తూ మెల్లగా అందులోనే జీవనోపాధిని వెతుక్కున్నారు.
కరోనా కారణంగా కొంతమంది అయితే మృతదేహాన్ని ముట్టుకోవడానికి కూడా భయపడ్డారని ఈ సందర్భంగా కన్హయ్యలాల్ చెప్పాడు.
ఒక్కోసారి ఎవరూ ముందుకు రాకపోతే సొంత ఖర్చులతోనూ వీళ్లు అంత్యక్రియలు జరిపిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న కొన్ని ఎన్జీవోలు ముందుకు వచ్చి షిర్కేకు సాయం చేయడం ప్రారంభించాయి. అలా కరోనా మృతుల అంత్యక్రియలు చేస్తూ ఎంతోకొంత సంపాదించడం మొదలుపెట్టారు. మామూలు వ్యక్తులు కనీసం శ్మశానంలోకి అడుగుపెట్టడానికి కూడా భయపడుతున్న సమయంలో తమ కుటుంబం అక్కడే నివాసం ఉంటుండటంపై కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారని షిర్కే చెప్పాడు.