సుల్తానాబాద్/జూలపల్లి మే 8: పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త నాటకానికి తెరతీశాడని, ప్రజలను నమ్మించేందుకు దేవుళ్లపై ఒట్లు పెడుతున్నాడని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ నిప్పులు చెరిగారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రె స్ నాలుగు నెలల పాలనలో ప్రజలను నిలువున ముంచిందని ధ్వజమెత్తారు. ఆ పార్టీని నమ్మితే మరోసారి మోసపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పార్లమెంట్లో తెలంగాణ గళం వినబడాలంటే, మన హక్కులు మనకు దక్కాలంటే బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలన్నారు. ప్రజలు ఆలోచించి ఈ నెల 13న కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. బుధవారం సుల్తానాబాద్, జూలపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలకు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల ఆయన మాట్లాడారు. కేసీఆర్ తెచ్చిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్ల పథకాలను ఎత్తేసేందుకు కాంగ్రెస్ సర్కారు యత్నిస్తున్నదని విమర్శించారు. ఆడబిడ్డల పెండ్లిళ్లకు ఇస్తామన్న తులం బంగారానికి తూట్లు పొడిచిందని, క్వింటాల్ వడ్లకు 500 బోనస్ ఇస్తామని చెప్పి బోగస్ చేసిందని, విద్యార్థినుల స్కూటీలకు మంగళంపాడిందని మండిపడ్డారు. వాయిదాలు పెడుతూ రైతురుణమాఫీని ఎగ్గొట్టేందుకు యత్నిస్తున్నదన్నారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో నిరుపేదలకు మేలు జరిగిందని, అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ సర్కారు దమననీతిని ఎండగట్టేందుకు కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ మాయలో పడి మరోసారి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. విజ్ఞతతో వ్యహరించి ఓటేసి కార్మికుడి బిడ్డ కొప్పులను గెలిపించాలని కోరారు. పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ మాట్లాడుతూ, ప్రజలు నమ్మడంలేదని సీఎం రేవంత్రెడ్డి ఓట్లకోసం దేవుళ్లపై ఒట్లు పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణను సాధించి పదేండ్ల పాటు ప్రజారంజక పాలన అందించిన కేసీఆర్ను పరుషపదజాలంతో దూషించడం బాధాకరమన్నారు. సంస్కారహీనంగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధిచెప్పాలని ప్రజలను కోరారు. కార్యక్రమాల్లో సుల్తానాబాద్ ఎంపీపీ పొన్నమనేని బాలాజీ రావు, విండో చైర్మన్లు, జూపల్లి సందీప్రావు, గడ్డం మహిపాల్రెడ్డి, పాల రామారావు, బుర్ర శ్రీనివాస్గౌడ్, కౌన్సిలర్ పారుపల్లి జ్ఞానేశ్వరి, గుణపతి, జూలపల్లి ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్సింగ్, వైస్ ఎంపీపీ మొగురం రమేశ్, ఎంపీటీసీలు తమ్మడవేని మల్లేశం, కత్తెర్ల శ్రీనివాస్, కంది చొక్కారెడ్డి, లోక రవీందర్రెడ్డి, విశారపు వెంకటేశం ఉన్నారు.