ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి గ్రామాల్లోని అనేక దీర్ఘకాలిక సమస్యలను తరిమేసింది. తుప్పు పట్టిన, విరిగిన విద్యుత్ స్తంభాలను నామరూపాల్లేకుండా చేసింది. కొత్త స్తంభాలు, థర్డ్ వైరు ఏర్పాటుతో వాడవాడనా వీధి దీపాలు వెలుగులు విరజిమ్ముతున్నాయి. శిథిలమైన ఇండ్లు లేకుండా పోయాయి. ప్రధానంగా మృత్యుకుహరాలుగా ఉన్న పాడుబడ్డ బావులు, పనిచేయని బోర్లు కనుమరుగయ్యాయి. కొన్ని దశబ్దాలుగా ప్రజలను ఆందోళనకు గురిచేసిన బావులు, బోర్లను పల్లె ప్రగతి ద్వారా ప్రభుత్వం పూడ్చివేసింది. ఇప్పటికీ పలు గ్రామాల్లో పాత బావుల పూడ్చివేత కొనసాగుతున్నది. పంచాయతీ పాలకులు, సిబ్బంది, ప్రజలు కలిసికట్టుగా శ్రమదానం చేస్తూ తమ గ్రామాల్లోని దీర్ఘకాలిక సమస్యలకు చరమగీతం పాడుతున్నారు.
గతంలో లెక్క లేనన్ని ప్రమాదాలు
ముందుగా పల్లె ప్రగతి ద్వారా అధికారులు, సర్పంచ్లు, కార్యదర్శులు, స్థానిక ప్రజలతో కలిసి సమస్యలను గుర్తించారు. దశాబ్దాలుగా ప్రమాదకర ప్రాంతాలుగా ఉన్న పాడుబడ్డ బావులు, వినియోగంలో లేని బోరు బావులను పూడ్చాలని సంకల్పించారు. గతంలో పలు గ్రామాల్లోని పాత బావులు, వాడి వదిలేసిన బోరు బావులు ఎంతో మందిని బలి తీసుకున్నాయి. ముఖ్యంగా పాడుబడ్డ బావులు గ్రామాల్లో రహదారుల పక్కనే ఉండడంతో కొందరు ప్రమాదవశాత్తు వాటిలో పడి చనిపోయారు. మరికొందరు గాయాల పాలయ్యారు. బావుల పక్కన ప్రయాణమంటేనే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వచ్చేది. పల్లె ప్రగతి ద్వారా ఇలాంటి నిరుపయోగంగా ఉన్న బోర్లను గుర్తించి పూడ్చివేయడంతో దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించినట్లయింది.
పూడ్చివేతతో మైదానాలుగా..
పంచాయతీల సర్పంచ్లు, వార్డు సభ్యులు, కార్యదర్శులు, అధికారులు ప్రజల సహకారంతో బావుల పూడ్చివేతను పూర్తి చేశారు. లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా మట్టి తెచ్చి బావులను పూడ్చివేశారు. కొన్ని గ్రామాల్లో ఏడెనిమిది బావులను పూడ్చివేసి లెవలింగ్ చేసి మైదానాలను రూపొందించారు. కొన్ని చోట్ల పూడ్చిన బావుల మీదుగా రోడ్లు సైతం వేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో పల్లె ప్రగతి ద్వారా ఇప్పటి వరకు 1,688 పంచాయతీల పరిధిలో 1,011 పాత బావులను, వినియోగంలో లేని 354 బోరు బావులను పూడ్చివేశారు. వరంగల్ అర్బన్లో 154, వరంగల్ రూరల్లో 101, మహబూబాబాద్లో 283, జనగామ లో 142, జయశంకర్ భూపాలపల్లిలో 216, ములుగులో 115 పూడ్చివేశారు. అర్బన్లో 55 బోరుబావులను, రూరల్లో 11, మహబూబాబాద్లో 131, జనగామలో 8, జయశంకర్ భూపాలపల్లిలో 94, ములుగులో 55 పూడ్చివేశారు. కొన్ని గ్రామాల్లో పూడ్చివేత పనులు కొనసాగుతున్నాయి.
రక్షణ చర్యలు చేపట్టాలి
పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో పాడువడ్డ బావులు, బోర్ల పూడ్చివేత పూర్తికావచ్చింది. రోడ్ల పక్కన ఉన్న రైతుల బావుల వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. ఈ బావులకు రిటెయినింగ్ వాల్ పెట్టాలి. లేదా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి.