బయ్యారం, మే 8 : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బయ్యారం శివారులో బుధవారం సాయంత్రం నిర్వహించిన కాంగ్రెస్ శంఖారావ సభ జనం లేక ఖాళీ కుర్చీలతో వెలవెలబోయింది. ఈ సభకు రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ హాజరుకావాల్సి ఉంది. మంత్రి రాక ఆలస్యమవుతుండడంతో ముందుగా వామపక్ష నాయకులు, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థి సభను ప్రారంభించారు. కొద్దిసేపటికే జనం ఒక్కొక్కరుగా బయటికి వెళ్లిపోవడం కనిపించింది. దీంతో కాంగ్రెస్ నాయకులు వారిని అడ్డగించి మరీ సభా ప్రాంగణానికి రావాలని ప్రాధేయపడినప్పటికీ వారు వెళ్లిపోయారు. దీంతో మైదానంలో అన్నీ ఖాళీ కుర్చీలే కనిపించాయి. అనంతరం అక్కడకు చేరుకున్న మంత్రి తుమ్మల సైతం అరకొర జనం, ఖాళీ కుర్చీలు దర్శనమిస్తుండగానే ప్రసంగించారు. సభ పూర్తి కాకుండానే జనం వెనుదిరిగిపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నిరుత్సాహానికి గురయ్యారు.