వరంగల్, మే 8 (నమస్తే తెలంగాణ) : అవినీతి కాంగ్రెస్ నైజం అని, అధికారంలో ఉన్నప్పుడు దేశంలో జరిగిన వేల కోట్ల కుంభకోణాలు బయటకు వచ్చిన విషయం ప్రజలకు తెలుసని, ఇప్పుడు ఆ పార్టీ మళ్లీ వస్తే సమస్యలు వస్తాయని, తెలంగాణ అభివృద్ధి ఆగిపోతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, రైతు రుణమాఫీ, మహిళలకు రూ.2500 వచ్చాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ లేదా ఇండియా కూటమి ఏ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆ రాష్ర్టాలు వాటికి ఏటీఎంలుగా మారిపోతున్నాయని, ఇప్పటికే తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రజలను దోచుకొంటున్నదని ఆరోపించారు. ఆర్ఆర్ అంటే ఒక ఆర్ రాహుల్గాంధీ, రెండో ఆర్ రేవంత్రెడ్డి అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని లూటీ చేసిన సొమ్ములో కొంత భాగం ఢిల్లీలోని కాంగ్రెస్ నేతలకు, మరికొంత భాగం హైదరాబాద్ కాంగ్రెస్ నేతలకు వెళ్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వరంగల్లోని తిమ్మాపూర్-లక్ష్మీపురం వద్ద బీజేపీ జనభేరి సభకు ఆయన హాజరై ప్రసంగించారు.
ఇప్పటికే మూడో దశ పోలింగ్ పూర్తయిన రాష్ర్టాల్లో ఎన్డీఏ విజయపథంలో దూసుకెళ్తున్నదని, ప్రస్తుతం ఆ రాష్ర్టాల్లో కాంగ్రెస్ గెలిచే సీట్లు భూతద్దంతో వెతికినా కనిపించే పరిస్థితి లేదని మోదీ అన్నారు. ఇక నాలుగో దశ పోలింగ్ జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచే స్థానాలు వెతకడానికి భూతద్దం కాదు మైక్రోస్కోప్ కావాల్సి ఉంటుందని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ గెలిస్తే ఏడాదికో పార్టీ నుంచి ప్రధాని అవుతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ను అబద్ధాలకోరు పార్టీగా అభివర్ణించిన మోదీ.. కాంగ్రెస్ అగ్రనేత పుట్టినరోజు రైతుల రుణమాఫీ అని ఇప్పుడు మళ్లీ ఆగస్టు 15 అంటూ దేవుళ్లపై ఒట్టేస్తున్నారని అది అయ్యే పనేనా అని దుయ్యబట్టారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే అమరుల కుటుంబాలకు పెన్షన్, 200 గజాల స్థలం ఇస్తామని చెప్పి ఏదీ చేయలేదని నెలనెలా మహిళలకు రూ.2500, ఇందిరమ్మ ఇండ్లు రాలేదని మోదీ విమర్శించారు. సనాతన ధర్మాన్ని తిట్టే కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కొత్తగా దేవుళ్లపై ఒట్లు వేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వస్తే తెలంగాణ అభివృద్ధి ఆగిపోతుందని, కేంద్ర ప్రభుత్వం ఇక్కడ అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ములుగులో సమ్మక్క-సారలమ్మ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని, వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్దీ అదే పరిస్థితి అని మోదీ మండిపడ్డారు. రైతులు, యువతకు బీజేపీ ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఇచ్చిన హామీని అమలు చేస్తామని ప్రధాని చెప్పారు. 40 ఏండ్ల క్రితం బీజేపీ దేశంలో గెలిచిన రెండు సీట్లలో హనుమకొండ ఒకటని ఆయన గుర్తుచేశారు. గుజ్జుల ప్రేమేందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో వరంగల్, మహబూబాబాద్ లోక్సభ అభ్యర్థులు అరూరి రమేశ్, అజ్మీరా సీతారాంనాయక్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, బీజేపీ నేతలు ఎం ధర్మారావు, గంట రవికుమార్, రావు పద్మారెడ్డి, కొండేటి శ్రీధర్ పాల్గొన్నారు.