హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో వేలాది మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతున్నది. ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామని ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తున్నా, జీవోలు జారీచేస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం అది అమలుకావడం లేదు. నెలల తరబడి జీతాలు అందక చిరు ఉద్యోగులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. రాష్ట్రంలో వీబీజీ రామ్జీ పథకంలో భాగంగా పనిచేస్తున్న సుమారు 13 వేల మంది చిరు ఉద్యోగులకు 2 నెలలుగా వేతనాలు అందడం లేదు. ప్రతినెలా వేతనాలు చెల్లించాలని ప్రభుత్వ జీవోలు ఉన్నప్పటికీ వాటి అమలు మాత్రం శూన్యంగా మారిందని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇటీవల వేతనాల కోసం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపినా రూపాయి కూడా విడుదల కాలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,579 మంది ఈ-పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ల పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది. ఏప్రిల్ నెల నుంచి వరుసగా నాలుగు నెలలుగా వారికి జీతాలు అందలేదు. సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల పరిస్థితి కూడా అదే పరిస్థితి. ఆగస్టు ఎనిమిదో తారీఖు వచ్చినా జూలై నెల వేతనం అందలేదు. కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలు, అర్బన్ రెసిడెన్షియల్ సూళ్లు, బోధన బోధనేతర సిబ్బంది, రిసోర్స్పర్సన్లు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కార్యాలయ ఉద్యోగులు కలిపి సుమారు 18 వేల మందికిపైగా వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి, వేతనాలు పెంచుతామని స్వయంగా రేవంత్రెడ్డి హామీ ఇచ్చారని ఉద్యోగులు గుర్తుచేస్తున్నారు. సచివాలయానికి పిలిపించి గౌరవంగా మాట్లాడిన సీఎం, ఒక రూపాయి కూడా వేతనం పెంచలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినా, జూన్ నెల జీతాలు కూడా పదో తేదీ తర్వాతే ఖాతాల్లో జమయ్యాయని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి మరింత దిగజారి నెలల తరబడి వేతనాలు పెండింగ్ ఉండటం ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. వెంటనే పెండింగ్ వేతనాలు విడుదల చేసి, ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.