లింగాలఘనపురం, మే 8 : మోసాలకు, నయవంచనకు మారుపేరైన కడి యం శ్రీహరి అధికార దాహంతో కాంగ్రెస్లో చేరారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. కారు గుర్తు పై గెలిచిన శ్రీహరికి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరారు. బుధవారం లింగాలఘనపురం మండలకేంద్రంలో బీఆర్ఎస్ స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ కడియం శ్రీహరికి బీఆర్ఎస్లో కేసీఆర్ ఎన్నో పదవులను ఇచ్చారని కానీ ఆయన అవన్నీ మరిచి కూతురిని ఎంపీగా చేసుకునేందుకు అధికార దాహంతో కాంగ్రెస్లో చేరారని, దీనిని ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ప్రపంచంలో కడియం శ్రీహరి అంత నీచుడు, నమ్మద్రోహి మరొకరు లేరని ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు డిపాజిట్ దక్కకుండా పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బస్వగాని శ్రీనివాస్గౌడ్, ఎంపీపీ చిట్ల జయశ్రీఉపేందర్రెడ్డి, కొమురవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్ సేవెల్లి సంపత్, నాయకులు దుంబాల భాస్కర్రెడ్డి, రాపోలు శ్రీనివాస్, ఏదునూరి వీరన్న, మబ్బు కరుణాకర్, ఉడుగుల భాగ్యలక్ష్మి, గట్టగల శ్రీహరి పాల్గొన్నారు.