చెన్నారావుపేట, జూలై 13: రూర్బన్ పథకం కింద రూ. 30 కోట్ల నిధులతో పర్వతగిరి మండలంలో వివిధ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎం హరిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో మంగళవారం ఆమె రూర్బన్ పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఇప్పటివరకు ప్రారంభించిన పనులను త్వరగా గ్రౌండింగ్ చేయడమే కాకుండా పనులకు సంబంధించిన బిల్లులను త్వరగా నమోదు చేయాలన్నారు. ఏనుగల్, కొంకపాకలో రెండు గోదాములు మంజూరు కాగా, ఏనుగల్లో మాత్రమే పనులు ప్రారంభమయ్యాయని, కొంకపాకలో నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. 60 రకాల కూరగాయల పందిళ్ల నిర్మాణాలకు 18 మాత్రమే పూర్తయ్యాయని, తృణధాన్యాలు, పప్పు ధాన్యాల మిల్లు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. కల్లెడలో ఏర్పాటు చేయనున్న పాల డెయిరీ నిర్మాణం, పర్వతగిరిలో నిర్మించనున్న మినీ స్టేడియం, కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు, 19 గ్రామ పంచాయతీల్లో కంప్యూటర్లు, ప్రింటర్ ఇన్స్టాలేషన్ పనులు, వెటర్నరీ శాఖకు సంబంధించిన ట్రివిసెస్ బిగింపు పనులన్నీ నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సమీక్షలో డీఆర్డీవో పీడీ సంపత్రావు, ఆర్డీవో మహేందర్జీ, అగ్రికల్చర్ జేడీ ఉషాదయాళ్, హార్టికల్చర్ అధికారి శ్రీనివాసరావు, విజయ డెయిరీ డీడీ, ఆర్అండ్బీ ఈఈ, ఇరిగేషన్, టూరిజం శాఖల అధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులను వినియోగంలోకి తేవాలి
వైకుంఠధామాలు, డంపింగ్యార్డులను త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లో ఆమె సంబంధిత అధికారులతో సమీక్షించారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని, యార్డుల్లో సేంద్రియ ఎరువు తయారు చేసినప్పుడే లక్ష్యం నెరవేరుతుందని గుర్తుచేశారు. హరితహారంలో భాగంగా గుంతలు తీసిన చోట మొక్కలు నాటించాలని అధికారులను ఆదేశించారు. బృహత్ పల్లెప్రకృతి వనాలకు సంబంధించిన పనులను ప్రారంభించాలని కోరారు. వైకుంఠధామాలు, డంపింగ్యార్డుల చుట్టూ బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్ భూక్యా హరిసింగ్, డీఆర్డీవో పీడీ సంపత్రావు, డీఎల్పీవోలు, ఏపీడీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు తదితరులు పాల్గొన్నారు.
10లోగా అభ్యంతరాలు తెలుపాలి
వరంగల్, హన్మకొండ జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, మార్పులు చేర్పులపై అభ్యంతరాలు, అభిప్రాయాలు ఉంటే ప్రజలు రాతపూర్వకంగా తెలుపాలని కలెక్టర్ కోరారు. ఆంగ్లం లేదా తెలుగు లేదా ఉర్దూ భాషల్లో ఆగస్టు 10వ తేదీలోగా కలెక్టరేట్ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు.