Supreme Court | న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ప్రైవేటు ఆస్తిలో ప్రభుత్వ జోక్యం చేసుకోవద్దని చెప్పడం సరికాదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమాజ వనరులు అంటే కేవలం ప్రభుత్వ ఆస్తులు మాత్రమేనని, ప్రైవేటు ఆస్తులను సమాజ వనరులుగా చూడొద్దని చెప్పడం ప్రమాదకరమని పేర్కొన్నది. మహారాష్ట్ర ప్రభుత్వం 1986లో మహారాష్ట్ర గృహ నిర్మాణ, ప్రాంత అభివృద్ధి చట్టం-1976కు చేసిన చట్ట సవరణ అంశాన్ని బుధవారం సుప్రీంకోర్టు విచారించింది. 70 శాతం మంది యజమానులు అంగీకరిస్తే ప్రభుత్వం ప్రైవేటు ఆస్తులను స్వాధీనం చేసుకొని పునరుద్ధరించవచ్చని ప్రభుత్వం ఈ చట్ట సవరణ చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ ముంబైలోని ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్(పీఓఏ) హైకోర్టును ఆశ్రయించగా 1991 డిసెంబరులో బాంబే హైకోర్టు ఈ పిటిషన్ను కొట్టేసింది. దీంతో పీఓఏ సుప్రీంకోర్టుకు వెళ్లింది.
విచారణ సందర్భంగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రైవేటు ఆస్తి సంపూర్ణంగా ప్రైవేటుదే అని చెప్పేది పూర్తిగా పెట్టుబడిదారీ భావన అవుతుంది. అలాగే ఏ ఆస్తి కూడా వ్యక్తులకు మాత్రమే పరిమితమైనదని కాదని, ఆస్తులన్నీ సమాజానివని చెప్పేది పూర్తిగా సామ్యవాద దృక్పథం. మన దేశానిది పూర్తిగా సామ్యవాద పద్ధతి కాదు. ప్రైవేటు ఆస్తి అనేది ఉంటుంది. అయితే, సమాజ వనరులు అంటే కేవలం ప్రభుత్వ వనరులే అని, వ్యక్తులకు సంబంధించిన ప్రైవేటు ఆస్తులు సమాజ వనరులు కావని చెప్పడం కూడా సరికాదు. ఇలాంటి ఆలోచన ప్రమాదకరం’ అని వ్యాఖ్యానించారు. ప్రైవేటు ఆస్తిపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ దుమారం నెలకొన్న నేపథ్యంలో సుప్రీం వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.