Union Govt : ద్విచక్ర వాహన అంబులెన్సుల (Two Wheeler Ambulances) కు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం (Union Govt) నిర్ణయించింది. ఇందుకోసం ‘కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు-1989’ కి సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర రహదారులు, రవాణాశాఖ ముసాయిదా నోటిఫికేషన్ (Draft Notification) జారీచేసింది. గ్రామీణ, మారుమూల, కొండ ప్రాంతాల్లోని పల్లెలకు వేగవంతమైన వైద్య సేవలు అందించడం కోసం ఈ విధానాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్రం తెలిపింది.
ఇప్పటివరకు కేంద్ర మోటారు వాహనాల నిబంధనల పరిధిలో ద్విచక్ర అంబులెన్సులు లేవు. దానివల్ల వాటి రూపురేఖలు, నిర్వహణ, రోగులను హ్యాండ్లింగ్ చేసే విధానం, రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ తనిఖీలకు అవసరమైన నిబంధనలు ఖరారు చేయడానికి వీల్లేకుండా పోయింది. నిబంధనలను సవరించడంవల్ల ఈ అంబులెన్సులు ప్రభుత్వ నియంత్రణ పరిధిలోకి రానున్నాయి. ఎల్2 కేటగిరీ ద్విచక్ర వాహనాలను అంబులెన్సులుగా ఉపయోగించడానికి అనుమతిస్తారు.
రాష్ట్రాలు నిర్దేశించిన ప్రాంతాల్లోనే ఇవి సేవలు అందించడానికి వీలుంటుంది. ఈ ముసాయిదా నోటిఫికేషన్పై అభ్యంతరాలు ఉన్నవారు 30 రోజుల్లోగా కేంద్ర రహదారులు, రవాణాశాఖకు పంపాల్సి ఉంటుంది. వాటిని పరిశీలించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్ను జారీచేయనుంది.