Pakistan : పాకిస్తాన్ సైన్యంతోపాటు ఐఎస్ఐలో కీలక మార్పులు జరిగాయి. అనేక విభాగాలకు చెందిన ఉన్నతాధికారుల్ని మార్చేశారు. డీజీ-ఎస్ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద స్పెషల్ ఆపరేషన్స్ డైరెక్టరేట్)గా మేజర్ జనరల్ ముహమ్మద్ షమ్రైజ్ ఖాన్ను ఆర్మీ నియమించింది. ఇది ఐఎస్ఐలో కీలక విభాగం. ప్రధానంగా ఇండియాకు వ్యతిరేకంగా పాక్ సైనిక కార్యకలాపాల్ని, ఉగ్ర కార్యకలాపల్ని కూడా పర్యవేక్షిస్తుంటుంది.
రెండు రోజుల క్రితం.. అంటే గత శుక్రవారమే సైన్యంలో ఇలా అనేక మార్పులు జరిగినట్లు భారత నిఘా విభాగం గుర్తించింది. మరోవైపు మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న మేజర్ జనరల్ వాజిద్ అజీజ్ను తొలగించినట్లు తెలుస్తోంది. అతడి స్థానంలో
మేజర్ జనరల్ అదిల్ వారియాచ్ను నియమించారు. అలాగే, ఐఎస్ఐ కౌంటర్ టెర్రరిజం డైరెక్టరేట్గా ఉన్న మేజర్ జనరల్ ఖుర్రం షబ్బిర్ను కూడా తొలగించారు. అతడిని జీఓసీ 17 డివిజన్, ఖైరాన్కు బదిలీ చేశారు. మేజర్ జనరల్ సాజిద్ అమిన్ అవాన్ను డీజీ-జడ్కు అధిపతిగా నియమించారు.
ఇటీవల పాక్ ఆర్మీలో అంతర్గత బదిలీలు జరిగిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఉన్నత విభాగాల అధికారులను మరో స్థానంలోకి మారుస్తున్నారు. అన్నింటిలోకి కీలకమైంది ఐఎస్ఐ డీజీఎస్గా మేజర్ జనరల్ ముహమ్మద్ షమ్రైజ్ ఖాన్ను నియమించడం. ఐఎస్ఐ అంటే, పాక్ ఇంటెలిజెన్స్ విభాగం. అయితే, ప్రస్తుతం నియామకమైన ముహమ్మద్ షమ్రైజ్ ఖాన్కు ఎలాంటి ఇంటెలిజెన్స్ అనుభవం లేదు. అయితే, ఇండియా సరిహద్దులో కార్యకలాపాల నిర్వహణలో మాత్రం అతడికి అనుభవం ఉంది.