జూలూరుపాడు : సెలవు దినం.. ఆ ఇంట అంతా సందడిగా ఉంది. ఆడుకుంటూ అటూఇటూ తిరుగుతున్న ఆ నాలుగేళ్ల చిన్నారికి కారు రూపంలో మృత్యువు ( Death strikes) పొంచి ఉందన్న విషయం ఎవరూ ఊహించలేకపోయారు. ప్రమాదవశాత్తు కారులో ఇరుక్కుపోయి, ఊపిరాడక ఆ పసిప్రాణం అనంతలోకాలకు చేరింది.
భద్రాద్రి కొత్తగూడెం ( Badradri Kottagudem) జిల్లా జూలూరుపాడు మండలం వినోబానగర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వినోబానగర్ గ్రామ సర్పంచ్ గంగావత్ నవీన్ ( Sarpanch Naveen ), ఐశ్వర్య దంపతుల పెద్ద కుమార్తె తన్వితశ్రీ (4) ఆదివారం ఆడుకుంటూ ఇంటి వద్ద నిలిచిన కారు ( Car ) లో ఎక్కింది. ప్రమాదవశాత్తు కారు డోర్ లాక్ కావడంతో ఊపిరాడక చనిపోయింది.
ఆ సమయంలో తండ్రి నవీన్ వైరా ఎమ్మెల్యేను కలిసేందుకు సర్పంచులతో కలిసి ఉదయం కొత్తగూడెం వెళ్లారు. తల్లి ఐశ్వర్య ఇంటి పనుల్లో నిమగ్నమయ్యారు. చిన్నారి కనిపించకపోవడంతో తల్లి ఐశ్వర్య ఆందోళనకు గురయై కుటుంబ సభ్యులతో కలిసి ఇల్లు, పరిసర ప్రాంతాలతో పాటు గ్రామంలో వెతికారు. ఎక్కడా ఆచూకీ దొరక్కపోవడంతో కారులో తన్వితశ్రీ అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారిని తొలుత జూలూరుపాడులోని ఓ గ్రామీణ వైద్యుడి వద్దకు అక్కడి నుంచి కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు. పాపను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. విషయం తెలుసుకున్న వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, నాయకులు లేళ్ల వెంకటరెడ్డితో పాటు పలువురు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నవీన్ దంపతులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.