‘వ్యయము చేసి దేవుని సహాయం కోరేదే వ్యవసాయం’ అని మా నాన్న చెప్పిన మాట. కానీ, రాష్ట్రంలో ప్రస్తుత వ్యవసాయాన్ని పరిశీలిస్తే వైకుంఠపాళి ఆట గుర్తుకొస్తున్నది. 130 రోజుల యాసంగి వరి పంట కాలం.. 142 రోజుల కాంగ్రెస్ పాలన.. 143 గడులున్న పరమపద సోపాన పఠము అన్నీ ఒకేలాగ కనిపిస్తున్నాయి. వైకుంఠపాళి ఆటలో 10 నిచ్చెనలు, 13 పాములుంటాయి. కేసీఆర్ పదేండ్ల పాలనలో వ్యవసాయం పండుగైంది. రైతు బంధు వంటి సంక్షేమ పథకాలతో రైతులకు అన్నీ నిచ్చెనలే వచ్చాయి. కాంగ్రెస్ పాలనలో మాత్రం అడుగుకొక పాము గండం ఎదురవుతున్నది.
Congress | ఆరు గ్యారెంటీల్లో భాగంగా వరంగల్లో కాంగ్రెస్ యువరాజు రాహుల్గాంధీ సమక్షంలో రైతు డిక్లరేషన్ ప్రకటించారు. ఇందులో రైతులకు అరచేతిలో వైకుంఠం చూపించి హస్తం పార్టీ అధికార పీఠమెక్కింది. వైకుంఠపాళిలో ప్రతి పది గడులకు ఒక పాము ఎదురైనట్టు.. కాంగ్రెస్ పాలనలో రైతులకు ప్రతి పదిహేను రోజులకు ఒక కష్టం ఎదురైతున్నది. ‘మేమొస్తే రైతుబంధు ఏడాదికి రూ.15 వేలు ఇస్తాం’ అని చెప్పిన పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి యాసంగి పంటలు కోతలు చేస్తున్నా ఇంకా పూర్తి పెట్టుబడి సాయం ఇవ్వనే లేదు. ఇక కౌలు రైతులకు ఏడాదికి రూ.12 వేల హామీపై ఉలుకు, పలుకు లేదు. కోటి ఆశలతో యాసంగి సాగు ప్రారంభించిన రైతులు ప్రతి దశలోనూ పుట్టెడు కష్టాలు పడుతున్నారు. మొగులుకు ముఖం చూడకుండా వ్యవసాయం చేసుకుందామన్న కేసీఆర్ను కాదని మార్పు కోసం కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారు. కానీ, కాంగ్రెస్ వచ్చీ రావడంతోనే రైతులకు కరెంటు కష్టాలు మొదలయ్యాయి. 24 గంటల ఉచిత కరెంటు నుంచి అర్ధరాత్రి దొంగ కరెంటుకు పరిస్థితి మారింది. మిణుగురు పురుగులా వచ్చీపోయే కరెంటుతో మోటర్లు కాలిపోతున్నాయి. ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నా యి. ప్రాజెక్టుల్లో నీటి ప్రణాళిక లేక పంటలకు సాగునీళ్లు కరువయ్యాయి. రైతులు పంటలను కాపాడుకోవడానికి ట్యాంకర్లను అద్దెకు తీసుకున్నారు. కిలోమీటర్ల కొద్దీ పైపులైన్లను పరుచుకున్నారు. పొట్టకొచ్చిన పంటను కాపాడుకోవడానికి అప్పులు తెచ్చి మరీ బోర్లు వేశారు.
ఒక బోరు ఫెయిలైతే.. రెండో బోరు.. అది ఫెయిలైతే.. మూడో బోరు.. ఇలా ఎకరం పొలంలోనే 11 బోర్లు వేసిన రైతులూ ఉన్నారు. బొట్టు బొట్టు ఒడిసిపట్టి పంటను కోసుకొచ్చిన రైతుకు కనీస ‘మద్దతు’ దక్కలేదు. పాలకులకు పార్లమెంట్ ఎన్నికల కసరత్తుపై ఉన్న ధ్యాస ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై లేకపోయింది. కోడ్ సాకుతో కాగితాలపైనే అధికారులు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 7,104 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని చెప్తున్న పౌరసరఫరాల శాఖ, ఇప్పటివరకు 2,480 కేంద్రాల్లో మాత్రమే కొనుగోళ్లు ప్రారంభించింది. ఇంకా 4,720 కేంద్రాలు అంటే దాదాపు 70 శాతానికిపైగా కేంద్రాల్లో ఒక్క గింజ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయలేదు. మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ.500 బోనస్ వస్తుందని నమ్మి కొనుగోలు కేంద్రాలకు వడ్లను తెచ్చిన రైతులకు నిరాశే ఎదురైంది. కొనుగోలు కేంద్రాల్లోని కొర్రీలను చూసి వెర్రెక్కిపోయింది. రోజులు గడుస్తున్నా.. పడిగాపులే తప్ప కాంటా కావడం లేదు. తన వంతు కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్నారు.
పగలనకా, రాత్రనకా కొనుగోలు కేంద్రాల్లోనే వరి కుప్పలకు కాపలా ఉన్నారు. నడినెత్తిన సూర్యుడు భగ్గుమంటున్నా వడ్లను పొద్దంతా రెక్కలు ముక్కలు చేసుకొని ఎండబోశారు. ఆకలి బాధను.. కూలీల భారాన్నీ భరించారు. ఎన్నిసార్లు ఎండపోసినా ఏ గ్రేడ్కు మాత్రం నోచుకోలేదు. మాయిశ్చర్ ఉందని మాయమాటలు… ధాన్యంలో పొల్లు ఉందని సొల్లు కబుర్లూ విన్నారు. ఇన్నిచేసినా ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో కాంటా కావడమే కష్టం. కాంటా అయినప్పటికీ గన్నీ సంచులు దొరకవు.
గన్నీ సంచులు దొరికినా లారీలు రావు. లారీల్లో ధాన్యం లోడ్ ఎక్కినా అవి మిల్లు వరకు చేరుతాయనేది అనుమానమే. మిల్లర్లు కొర్రీలు లేకుండా ధాన్యాన్ని దించుకునేవరకూ రైతులు బిక్కు బిక్కుమనాల్సిందే. మిల్లులో లోడ్ దిగి, బ్యాంకు ఖాతాలో డబ్బులు జమయ్యేవరకు ఎదురు చూడాల్సిందే. రైతులను ఇబ్బంది పెట్టొద్దు… వారికి అన్యాయం చేయొద్దు అని కొనుగోలు కేంద్రంలో కలెక్టర్ చెప్పినా ధాన్యం లోడ్ను మిల్లర్లు తిప్పిపంపారు.
గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు వ్యాపారులకు ధాన్యం అమ్ముకుంటున్నారు. కల్లాల వద్దే కాంటాలు పెడుతున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు క్వింటాలు ధాన్యానికి రూ.200 నుంచి రూ.400 వరకు తక్కువ ధర చెల్లిస్తున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చెప్పినా మద్దతు ధరపై చేతులెత్తేశారు. ఇది చాలదన్నట్టుగా 40 కిలోల సంచికి 42 కిలోలు తూకం వేస్తున్నారు. దీనివల్ల రైతులు క్వింటాలుకు 5 కిలోల ధాన్యం దగా పడుతున్నారు. ఇవికాకుండా కూలీల ఖర్చుల కింద బస్తాకు రూ.10, అమ్ముకున్న వెంటనే డబ్బులు కావాలంటే నూటికి రూ. 2 చొప్పున కమీషన్ తీసుకుంటున్నారు.
పాలకుల నిర్లక్ష్యంతోపాటు వ్యాపారుల వంచనకు గురైన రైతుపై ప్రకృతి కూడా పగబట్టింది. వడగండ్ల వానతో పొట్టకొచ్చిన పంటంతా నేలపాలైంది. అకాల వర్షాలు కొనుగోలు కేంద్రాలను ముంచెత్తాయి. వాన నీటిలో ధాన్యం కొట్టుకుపోయింది. కండ్లముందే కొట్టుకుపోతున్న ధాన్యాన్ని చూసి రైతులు కన్నీరు కార్చారు. ధాన్యం తడవకుండా కాపాడుకోవడానికి ముప్పుతిప్పలు పడ్డారు. బస్తాలకు సరిపడా టార్పాలిన్లు లేక ఇబ్బందులు పడ్డారు. ఇలా చెప్పుకుంటూ పోతే రైతుల కష్టాలకు, కన్నీళ్లకు అంతే ఉండదు. యాసంగి సాగులో రైతులకు అడుగడుగునా పాము గండాలే. కనీసం రోజుకొకరు, ఇద్దరు అన్నట్టుగా వంద రోజుల్లోనే రెండొందల మంది రైతులు బలిపీఠమెక్కారు. అన్నదాతలు ఉరికొయ్యలకు వేలాడుతున్నా.. రైతు కుటుంబాలు అరిగోస పడుతున్నా కాంగ్రెస్ పాలకులు మాత్రం అటు వైపు కన్నెత్తి చూడలేదు. ఇప్పటివరకు పంట నష్టం లెక్కలు తీయలేదు. తడిసిన ధాన్యం కొంటామని భరోసా ఇవ్వలేదు. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పక్క రాష్ర్టాల్లో ప్రచారానికి వెళ్లారు గానీ, రాష్ట్రంలోని రైతులను మాత్రం పరామర్శించలేదు. పైపెచ్చు భద్రాద్రి రాముడి మీద ఒట్టు.. ఏడుపాయల దుర్గమ్మ మీద ఒట్టు.. యాదగిరి నరసింహుడి మీద ఒట్టు.. బాసర అమ్మవారి మీద ఒట్టు అంటూ పంద్రాగస్టు డెడ్లైన్లు పెడుతున్నారు. మత గ్రంథాల కన్నా పవిత్రమైన మ్యానిఫెస్టోపైనే మాట తప్పి ఎన్ని ఒట్లు పెడితే ఏం లాభం? కన్నతల్లికి అన్నం పెట్టకుండా పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నట్టు.. రైతుబంధు ఇవ్వని నేతలు రుణమాఫీ చేస్తామంటే నమ్మాలా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. బోనస్పై బోగస్ మాటలను కట్టిపెట్టాలని మండిపడుతున్నారు. తెల్వక కయ్యల పడ్డం.. మళ్లీ మోసపోతే గోస పడుతమని తెలివికొచ్చి మాట్లాడుతున్నరు.
వైకుంఠపాళిలో పాములను తప్పించుకొని, నిచ్చెనలను ఎక్కినవారే విజేతలు. ఆటలో గెలవాలంటే ‘అష్ట’ పడాల్సిందే. ఇప్పుడు రాష్ట్రంలో రైతులు కూడా పాముల నుంచి తప్పించుకోవాలి. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు కనీసం 8 సీట్లు ఇవ్వాలి. కేసీఆర్కు 10 సీట్లు వస్తే వైకుంఠపాళిలో 10 నిచ్చెనల్లాగే రైతులకు ఉపయోగం ఉంటుంది. గులాబీ నిచ్చెనలను తయారుచేసుకోవాల్సిన బాధ్యత కూడా రైతులదే.
– మారెడ్డి సంజీవ్కుమార్
91827 77465