లక్నో: కుమార్తె ప్రేమ వ్యవహారంపై గొడవ నేపథ్యంలో భర్తకు మత్తుమందు ఇచ్చి రాయితో తలపై కొట్టి భార్య హత్య చేసింది. కూతురు, ఆమె ప్రియుడు దీనికి సహకరించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. చాలా కాలం తర్వాత ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. (Woman Kills Husband) ఉత్తరప్రదేశ్లోని మథుర జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జైసింగ్పురాలో నివసించే 42 ఏళ్ల మనోజ్ సోని, తన చిన్న కుమార్తె ఆమె ప్రియుడితో కలిసి ఉండటాన్ని చూశాడు. ఈ విషయంపై భార్యతో గొడవ జరిగిన తర్వాత ఏప్రిల్ 18న అతడు అదృశ్యమయ్యాడు. భార్య అయిన 40 ఏళ్ల నైనా ఏప్రిల్ 21న స్థానిక పోలీస్ స్టేషన్లో భర్త మిస్సింగ్పై ఫిర్యాదు చేసింది. అయితే ఆ మరునాడు ఎలాంటి కారణం చెప్పకుండా ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకున్నది.
కాగా, నైనా తన కుమార్తెను తీసుకుని హత్రాస్లోని తన పుట్టింటికి వెళ్లింది. అయితే భర్త అదృశ్యం పట్ల ఆమెలో ఎలాంటి ఆందోళన లేకపోవడాన్ని నైనా తండ్రి బ్రజ్మోహన్ గమనించాడు. దీనిపై కుమార్తెను గట్టిగా నిలదీయగా తన భర్త మనోజ్ను చంపినట్లు తెలిపింది. మత్తుమందు కలిపిన పాలను భర్తకు తాగించినట్లు చెప్పింది. స్పృహ కోల్పోయాక రాయితో తలపై మోది హత్య చేసినట్లు వివరించింది. తన కుమార్తె, ఆమె ప్రియుడైన 22 ఏళ్ల విమల్ చౌదరి దీనికి సహకరించారని తెలిపింది. భర్త మృతదేహాన్ని అటవీ ప్రాంతానికి తరలించి దహనం చేసి, అవశేషాలను అక్కడ పాతిపెట్టినట్లు వెల్లడించింది.
మరోవైపు ఇది తెలుసుకున్న నైనా తండ్రి బ్రజ్మోహన్ షాక్ అయ్యాడు. మనోజ్ సోదరుడు రాంబాబుకు ఈ విషయం చెప్పడంతో మే 9న అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చాలా కాలం గడిచినా పోలీసులు శ్రద్ధ వహించకపోవడంతో ముఖ్యమంత్రి పోర్టల్ ద్వారా మళ్లీ ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఎస్ఎస్పీ ఆదేశాల మేరకు జూలై 11న కేసు నమోదు చేశారు. చివరకు ఆగస్ట్ 7న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
అయితే మనోజ్ మృతదేహాన్ని ఎక్కడ పాతిపెట్టారో నిందితులు ఖచ్చితంగా గుర్తించలేకపోయినట్లు పోలీస్ అధికారి తెలిపారు. గత మూడు రోజులుగా అటవీ ప్రాంతంలో పలు చోట్ల తవ్వకాలు జరిపినప్పటికీ మృతదేహం ఆనవాళ్లు లభించలేదని చెప్పారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఈ ప్రక్రియ కష్టంగా మారిందని వివరించారు.