కారేపల్లి : ఖమ్మం జిల్లా(సింగరేణి) కారేపల్లి మండలంలో రాజకీయ పార్టీల నాయకులు , ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ( World Tribal Day ) ఘనంగా నిర్వహించారు.అంతకు ముందు ఆదివాసీ గ్రామ పుర వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించి ఆదివాసీల హక్కుల సాధనకు పోరాటాలే మార్గమని పిలుపునిచ్చారు. వివిధ గ్రామాలలో గల కొమరం భీమ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ హక్కులను విస్మరిస్తూ ఏజెన్సీలో ఉన్న వనరులను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడం కోసం కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఆదివాసులు సాగుచేసుకుంటున్న భూములపై అటవీశాఖ అధికారులు నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తూ విధ్వంసానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. అనేక గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు లేక ఆదివాసీలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అడవులు,ప్రకృతి వనరులను కాపాడుతూ పర్యావరణ పరిరక్షణలో ఆదివాసీలు పోషిస్తున్న పాత్రను ప్రభుత్వాలు గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుగ్గి కృష్ణ, తుడుం దెబ్బ రాష్ట్ర కోశాధికారి కల్తీ రాంప్రసాద్, ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం శివరాం, ఆదివాసి సంక్షేమ పరిషత్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి వట్టం నాగేశశ్వరరావు, కామపల్లి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఎట్టి శ్రీనివాస్, సర్పంచులు మోతే వీరస్వామి,గుమ్మడి సందీప్,పొడుగు పెంటయ్య , కురుసం సత్యనారాయణ, మాజీ సర్పంచ్ ఎట్టి కోటేశ్వరావు,ఈసం నరసయ్య,ఎదలపల్లి శ్రీనివాస్,జబ్బ శివరాం, బొర్రా స్వామి తదితరులు పాల్గొన్నారు.