ఖమ్మం : ఆదివాసీ గిరిజనుల ( Adivasis Tribals) దశాబ్దాల కలలను, ఆకాంక్షలను సాకారం చేసిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ( KCR ) కే దక్కుతుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ (Former Minister Puvvada ) పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు.
ఆదివాసీ గిరిజనుల దశాబ్దాల డిమాండ్లను నెరవేర్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుందని అన్నారు. స్వయంపాలన, రిజర్వేషన్ల పెంపు, పోడు భూములకు పట్టాల పంపిణీ వంటి కార్యక్రమాలను అమలు చేసి గిరిజనుల హక్కులను పరిరక్షించామని తెలిపారు. ‘మా తండాలో మా రాజ్యం’ అనే ప్రజాస్వామిక ఆకాంక్షను సాకారం చేస్తూ అనేక గూడేలు, తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారని వెల్లడించారు.
అటవీ భూములపై గిరిజనులకు హక్కులు కల్పిస్తూ హక్కు పత్రాలను అందజేశామని పేర్కొన్నారు. విద్య, ఉద్యోగ రంగాల్లో గిరిజనుల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు 10 శాతం రిజర్వేషన్లను అమలు చేసి తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపామని చెప్పారు. అటవీ ఉత్పత్తులకు ‘గిరి’బ్రాండ్ను ప్రోత్సహిస్తూ వాటి విక్రయాలకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించి గిరిజనుల ఆర్థికాభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం తోడ్పాటు అందించిందని పేర్కొన్నారు.