కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 25 : క్రికెట్ బెట్టింగ్.. ఆన్లైన్ రమ్మీ గేమ్తో పాటు మద్యానికి అలవాటు పడి, డబ్బుల కోసం దొంగతనాలు చేస్తున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. గురువారం కేపీహెచ్బీ కాలనీ పీఎస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాస్ రావు, ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ రావు, డీఐ మధుసూదన్ వివరాలను వెల్లడించారు. భువనగిరి జిల్లాకు చెందిన బానోతు భాస్కర్ అలియాస్ శంకర్ (21) బిల్డింగ్ మెటీరియల్ సరఫరా చేస్తాడు.
క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ రమ్మీ గేమ్ ఆడుతూ.. మద్యానికి అలవాటు పడి, డబ్బుల కోసం దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ఈ నెల 3న కేపీహెచ్బీ కాలనీలోని లలితా జువెల్లరీ దుకాణానికి బంగారు గొలుసు కొనుగోలు చేసేందుకు కస్టమర్గా వెళ్లాడు. సేల్స్గర్ల్ నాగలక్ష్మిని కలిసి ఓ గొలుసు నచ్చిందని, ధర ఎంతని అడిగి.. తన మాయమాటలతో ఆమెను బురిడీ కొట్టించి, ఆ దుకాణంలోని 28.405 గ్రాముల బంగారు గొలుసును తస్కరించి, పారిపోయాడు.
కేపీహెచ్బీ కాలనీ పీఎస్ పరిధిలో రెండు చోట్ల, పంజాగుట్ట, మహంకాళి, నిర్మల్, మిర్యాలగూడ, మక్తల్, చైతన్యపురి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎనిమిది దొంగతనాలకు పాల్పడి, తప్పించుకుని తిరుగుతూ.. చివరకు పోలీసులకు చిక్కాడు. కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగిలించిన 28.405 గ్రాముల బంగారు గొలుసుతో పాటు 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగిలించిన 151.83 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. గతంలో కూడా నిందితుడు శంకర్ రెండు చోరీలకు పాల్పడి పోలీసులకు చిక్కాడు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన క్రైం బృందాన్ని ఏసీపీ అభినందించాడు.