కాల్వశ్రీరాంపూర్, ఏప్రిల్ 25: ‘కాంగ్రెస్ అంటే బడా ఝూటా పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి, అసత్య ప్రచారం చేసింది. ఆరు గ్యారెంటీలంటూ ప్రజలను మోసం చేసి అబద్ధాల పునాదులపై గద్దెనెక్కింది. మళ్లీ నమ్మితే మోసపోతరు. జాగ్రత్తగా ఉండాలి’ అని ప్రజలకు పెద్దపల్లి లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని మాటిచ్చి మోసం చేశారని మండిపడ్డారు. ఓట్ల కోసం వచ్చే ఆ పార్టీ నేతలను నిలదీయాలని సూచించారు. గురువారం ఆయన ధర్మపురి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డితో కలిసి ఓదెల, కాల్వశ్రీరాంపూర్లో కార్నర్ మీటింగ్లు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయాచోట్ల మాట్లాడారు. రైతుబంధు అందరికీ ఎందుకు ఇవ్వలేదు? రూ.2లక్షల రుణమాఫీ ఎందుకు చేయలేదో? రేవంత్ సర్కారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఓటరు దేవుళ్లు కాంగ్రెస్కు కర్రుకాల్చి వాతపెట్టబోతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత తొలి తెలంగాణ సీఎం కేసీఆర్దేనని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు.
మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి మాట్లాడుతూ, తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గ ప్రాంత రైతులకు రెండు పంటలకు సాగునీరందించినట్లు చెప్పారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సాగునీరందక పంటలు ఎండిపోయాయని, రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన చెందా రు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరా రు. సమావేశంలో ఎంపీపీ నూనేటి సంపత్, కూనారం సహకార సంఘం చైర్మన్ గజవెళ్లి పురుషోత్తం, నాయకులు గొడుగు రాజకొమురయ్య, వెంకట్రెడ్డి, శిలారపు మల్లయ్య, నిదానపురం దేవయ్య, నూనేటి కుమార్, మాదాసి రాంచంద్రం, రానవేన మానస పాల్గొన్నారు.
నేను ఈ పార్లమెంట్ నియోజకవర్గంలోనే పుట్టి పెరిగిన. 26 ఏండ్లు సింగరేణిలో కార్మికుడిగా పనిచేసిన. నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు. ప్రజా సేవే నా లక్ష్యం. మీ కష్టసుఖాలు తెలిసిన మనిషిగా మీ మధ్యనే ఉన్న. అభివృద్ధే లక్ష్యంగా పనిచేసిన. ఇప్పుడు ఈ ఎన్నికల్లో నాకు అవకాశమివ్వండి. అభివృద్ధి చేసి చూపిస్త.
– గొల్లపల్లిలో పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్