Omicron variant updates | హమ్మయ్యా ! కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది.. మునుపటి పరిస్థితులు వచ్చేస్తున్నాయని అంతా రిలాక్స్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా ఉప్పెన. ఒమిక్రాన్ వేరియంట్గా రూపం మార్చుకున్న కొవిడ్ ప్రపంచ దేశాలను మళ్లీ వణికిస్తోంది. ఎక్కడో దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఈ వేరియంట్.. ఇప్పడు ప్రపంచ దేశాలకు విస్తరిస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉన్నాయి? మన దేశంలోకి కూడా ఒమిక్రాన్ ప్రవేశించడంతో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నది వంటి పూర్తి సమాచారం ఒకసారి చూద్దాం..
గత కొద్ది రోజులుగా దక్షిణాఫ్రికాలో రోజూవారి సగటు కరోనా కేసులు 200కు పైగా కేసులు నమోదవుతున్నాయి. నవంబర్ 24 న ఒక్కరోజే 1200 కేసులు నమోదయ్యాయి. ఆ మరుసటి రోజు దానికి రెట్టింపు అంటే 2465 కేసులు రికార్డయ్యాయి. మరణాలు కూడా అనూహ్యంగా ఆరు రెట్లు పెరిగాయి. దీంతో రంగంలోకి దిగిన శాస్త్రవేత్తలు మూలాలను వెతికే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే వారు బి.1.1.529 కొత్త వేరియంట్ను గుర్తించారు. దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్వో ) ఒమిక్రాన్ అని నామకరణం చేసింది. దీన్ని ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’గా ప్రకటించింది. ఈ కొత్త వేరియంట్కు పెద్ద సంఖ్యలో మ్యుటేషన్లు ఉన్నాయని.. దీనివల్ల రీఇన్ఫెక్షన్ ప్రమాదం పెరిగినట్లు హెచ్చరించింది.
యూకే నుంచి వచ్చిన ప్రయాణికులకు శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. 35 ఏండ్ల మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. దీంతో ఆమెను వెంటనే గచ్చిబౌలిలోని టిమ్స్కు తరలించారు. ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధరణ కోసం శాంపిల్స్ను పంపించినట్లు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. రెండు రోజుల్లో స్పష్టమైన ఫలితం వస్తుందని ఆయన చెప్పారు. పూర్తి వివరాలు..
కానీ డాక్టర్ శ్రీనివాస్ రావు వ్యాఖ్యలను వక్రీకరిస్తూ.. తెలంగాణ రాష్ట్రంలోకి ఒమిక్రాన్ వేరియంట్ ప్రవేశించినట్లు వదంతులు మొదలయ్యాయి. ఈ మేరకు పలు వెబ్సైట్లు, సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ స్పందించారు. అదంతా ఫేక్ న్యూస్ అని స్పష్టం చేశారు. ఫేక్ మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పూర్తి వివరాలు..
యూకే నుంచి వచ్చిన మహిళకు కరోనా నిర్ధరణ అయిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని.. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు సూచించారు. ఎవరైనా మాస్కులు ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. మాస్క్ ధరించడంతో పాటు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. పూర్తి వివరాలు..
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నెలాఖరులోగా రాష్ట్రంలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. పూర్తి వివరాలు..
కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వ్యక్తులు కచ్చితంగా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ను దగ్గర ఉంచుకోవాలి. మార్కెట్లు, రద్దీ ఉండే ప్రదేశాల్లో ఎప్పుడైనా సరే డిస్ట్రిక్ట్ సర్వైలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తారు. అప్పుడు కచ్చితంగా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుంది.
విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు ముందుగా శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తారు. దాని రిజల్ట్ వచ్చే వరకు సదరు ప్రయాణికులు ఎయిర్పోర్ట్ ప్రాంగణంలోనే ఉండాలి. ఒకవేళ పాజిటివ్ వస్తే వారిని చికిత్స కోసం గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)కు తరలిస్తారు. నెగెటివ్ వచ్చిన తర్వాత వారిని డిశ్చార్జి చేసిన హోం క్వారంటైన్ ఉండాలని సూచిస్తారు. ఏడు రోజుల క్వారంటైన్ తర్వాత జిల్లా వైద్యాధికారులు వచ్చి మరోసారి ఆర్టీపీసీఆర్ టెస్ట్ నిర్వహిస్తారు. అప్పుడు నెగెటివ్ వస్తే మరో ఏడు రోజులు క్వారంటైన్ ఉండాల్సి ఉంటుంది.
జీనోమ్ టెస్ట్ కోసం రెండు నుంచి మూడు రోజుల సమయం పడుతుందని హైదరాబాద్ వైద్యాధికారులు తెలిపారు. డెల్టా లేదా ఒమిక్రాన్ వేరియంట్ను గుర్తించేందుకు ప్రస్తుతం గాంధీ ఆస్పత్రి, సీసీఎంబీ, సీడీఎఫ్డీలో జీనోమ్ పరీక్షలను నిర్వహిస్తున్నారు.
కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నంత మాత్రాన ఒమిక్రాన్ వేరియంట్ సోకదని చెప్పలేం. దక్షిణాఫ్రికాతో పాటు ఇతర దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించిన చాలామంది రెండు డోసులు తీసుకున్నవారే ఉన్నారు. వారిలో కొందరు బూస్టర్ డోస్ తీసుకున్న వారు కూడా ఉండటం గమనార్హం. బి.1.1.529 ఉత్పరివర్తనంలో 50 మ్యుటేషన్లు ఉన్నాయి. వాటిలో కేవలం స్పైక్ ప్రోటీన్లోనే 30 మ్యుటేషన్లు ఉండటంతో రోగనిరోధకశక్తిని ఈ వేరియంట్ ఏమారుస్తుంది. ఏదేమైనా ఒమిక్రాన్ వేరియంట్ గురించి పూర్తి సమాచారం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సి ఉంటుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి