జోహన్నెస్బర్గ్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు దక్షిణాఫ్రికాలో వేగంగా పెరుగుతున్నాయి. ఒక్క రోజులోనే రెట్టింపు కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఆ దేశంలో 4,373 పాజిటివ్ కేసులు రిపోర్ట్ కాగా, బుధవారం నాటికి రోజువారీ కేసుల నమోదు 8,561కి పెరిగింది. ఒమిక్రాన్ ప్రొఫైల్, ప్రారంభ ఎపిడెమియోలాజికల్ డేటా మేరకు అది రోగనిరోధక శక్తిని తప్పించుకోగలదని దక్షిణాఫ్రికా నేషనల్ ఇన్స్ట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్ఐసీడీ) సూచించింది. అయితే ఇప్పటికే అందుబాటులో ఉన్న కోవిడ్ టీకాలు కొత్త వేరియంట్ తీవ్రత, మరణాల నుంచి రక్షించగలవని అభిప్రాయపడింది.
మరోవైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బారిన పడిన దేశాల సంఖ్య 25కు చేరింది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జపాన్, డెన్మార్క్, ఘనా, నైజీరియా, నార్వే, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, హాంగ్ కాంగ్ వంటి దేశాల్లో కొత్త వేరియంట్ కరోనా కేసులు నమోదయ్యాయి.