బెంగళూరు: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కర్ణాటకలోని బెంగళూరులో ఇద్దరికి సోకినట్లు నిర్ధారణ అయ్యింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం అధికారికంగా ఈ విషయం ప్రకటించింది. మరోవైపు ఒమిక్రాన్ సోకిన ఒక రోగిని కాంటాక్ట్ అయిన వ్యక్తుల్లో ఇప్పటి వరకు ఐదుగురికి కరోనా పాజిటివ్గా తేలిందని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. వీరిని ఐసొలేషన్లో ఉంచినట్లు పేర్కొంది.
ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ అయిన ఇద్దరిలో ఒకరు బెంగళూరుకు చెందిన 46 ఏండ్ల వైద్యుడని అధికారులు తెలిపారు. నవంబర్ 21న జ్వరం, వంటి నొప్పులు వంటి లక్షణాలు ఆయనలో కనిపించాయని చెప్పారు. మరునాడు కరోనా పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్గా తేలిందన్నారు. అదే రోజున అతడు ఆసుపత్రిలో చేరాడని, మూడు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయినట్లు వివరించారు.
కాగా, ఆ వైద్యుడి నమూనాను నవంబర్ 22న జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపగా ఒమిక్రాన్ వేరియంట్గా గురువారం గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఆయన ఇటీవల ఏ విదేశాలకు ప్రయాణించలేదన్నారు.