న్యూఢిల్లీ: ట్రంప్ సర్కారుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. చట్టవిరుద్ధంగా వసూలు చేసినట్లు సుప్రీంకోర్టు గత నెలలో తీర్పు చెప్పిన సుంకాలను దిగుమతిదారులకు రిఫండ్ చేయాల్సిందేనని అమెరికన్ వాణిజ్య కోర్టు బుధవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. 13,000 కోట్ల డాలర్లను (రూ.11,90,531 కోట్లు) వాపసు చేసే ప్రక్రియను ప్రారంభించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
లక్షలాది షిప్మెంట్లను అమెరికాకు తీసుకురావడానికి అయ్చే ఖర్చును అంచనా వేయకుండానే ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని మాన్హట్టన్లోని అమెరికా యూఎస్ కోర్టు ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ న్యాయమూర్తి రిచర్డ్ ఈటన్ ఆదేశించారు. వడ్డీతోసహా వసూలు చేసిన సుంకాన్ని వాపసు చేయాలని ఆయన ఆదేశించారు. అమెరికాలోకి వస్తువులను తీసుకువచ్చినపుడు దిగుమతిదారుడు ప్రవేశ సమయంలో అంచనా వేసిన మొత్తాన్ని చెల్లిస్తాడు. ఇది దాదాపు 314 రోజుల తర్వాత ఖరారు అవుతుంది.
ఈ ప్రక్రియను లిక్విడేషన్ అంటారు. సుంకం అంచనా వేయకుండానే షిప్మెంట్లపై ప్రవేశ ధరను ఖరారు చేయాలని కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ను న్యాయమూర్తి ఈటన్ ఆదేశించగా ఫలితంగా తిరిగి చెల్లింపు జరుగుతుంది. ఇది ఎలా చేయాలో కస్టమ్స్కు తెలుసునని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అంచనా వేసిన సుంకాన్ని దిగుమతిదారుడు ఎక్కువగా చెల్లించినపుడు క్రమం తప్పకుండా రిఫండ్లు జారీచేసేందుకు ఏజెన్సీ తన వ్యవస్థను ప్రోగ్రామ్ చేయగలగాలని ఆయన చెప్పారు.