– నల్లగొండ జిల్లా ఎల్పీజీ అసోసియేషన్ అధ్యక్షుడు పగిడి గోవర్ధన్ రెడ్డి
నల్లగొండ రూరల్, ఏప్రిల్ 01 : వంట గ్యాస్ సరఫరా చాలావరకు మెరుగుపడిందని, త్వరలో పరిస్థితి యథాస్థితిలోకి రానుందని, గ్యాస్ వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని నల్లగొండ జిల్లా ఎల్పీజీ అసోసియేషన్ అధ్యక్షుడు పగిడి గోవర్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవసరం లేకున్నా గ్యాస్ బుకింగ్ చేయవద్దని వినియోగదారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. గ్యాస్ డెలివరీ బాయ్ సిలిండర్ డెలివరీ చేయడానికి వచ్చిన సమయంలో సిలిండర్ సీలు, బరువు, లీకేజీ లేని విషయాన్ని నిర్ధారించుకుని డెలివరీ తీసుకోవాలని సూచించారు. ఏమైనా అధిక మొత్తం డిమాండ్ చేసిన పక్షంలో సదరు గ్యాస్ ఏజెన్సీ వారికి వెంటనే తెలియజేయాలన్నారు. దయచేసి గృహోపకర వంటగ్యాస్ను హోటళ్లు మొదలైన వాణిజ్యపరమైన అవసరాలకు ఉపయోగించవద్దన్నారు.
ఎవరైనా వాణిజ్యపరమైన అవసరాలకు ఉపయోగించినట్లు దృష్టికి వచ్చినట్టయితే వెంటనే పౌరసరఫరాల శాఖ అధికారులకు, సదరు గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యానికి వెంటనే తెలపాలని కోరారు. వంట గ్యాస్ బుకింగ్ చేసిన సీనియార్టీ ప్రకారమే సరఫరా చేయబడుతుందన్నారు. సిలిండర్ డెలివరీ సమయంలో మీ రిజిస్టర్డ్ ఫోన్ కు వచ్చిన ఓటిపి, డీఎస్సీ నీ గ్యాస్ డెలివరీ బాయ్ కి తెలియపరచి తద్వారా గ్యాస్ సిలిండర్ సరైన వినియోగదారునికి చేరిన విషయం నిర్ధారణలో సహకరించాలన్నారు. గ్యాస్ రికార్డుల ప్రకారం మీ ఇంటి చిరునామా, ఫోన్ నెంబర్ సరిగ్గా ఉన్నది నిర్ధారణ చేసుకోగలరని కోరారు. లేనిపక్షంలో వెంటనే మీ గ్యాస్ ఏజెన్సీ వారిని సంప్రదించి సరి చేసుకోగలరని, ఈ కేవైసీ చేసుకొని వారు వెంటనే చేయించుకోవాలని కోరారు.