Bombay High Court : పరారీలో ఉన్న పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా (Vijay Mallya), బ్యాంకుల (Banks) మధ్య ఆస్తుల వివాదానికి ఇక స్వస్తి పలకాలని బాంబే హైకోర్టు (Bomabay High Court) సూచించింది. దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్న ఈ వ్యవహారానికి ఒక ముగింపు తీసుకురావాలని తెలిపింది. వివాదాన్ని ఇలాగే కొనసాగిస్తే దేశ ఆర్థికవ్యవస్థ (Indian Economy) పై ప్రతికూల ప్రభావం పడుతుందని వ్యాఖ్యానించింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం తన ఆస్తులను వినియోగించుకునేందుకు ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు ఇచ్చిన అనుమతిని తప్పుబడుతూ విజయ్ మాల్యా 2020లో సవాల్ చేశారు. ఈ పిటిషన్ను జస్టిస్ మిలింద్ జాదవ్ విచారించారు. ఈడీ జప్తు చేసిన ఆస్తుల ప్రస్తుత పరిస్థితి, దర్యాప్తు పురోగతిపై వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. ఇంకా దీనిని పట్టుకుని కూర్చోకుండా ముందుకు సాగాలని జడ్జి స్పష్టంచేశారు. ఇరుపక్షాలు కూర్చుని ఆచరణాత్మకమైన పరిష్కారం వైపు అడుగులు వేయాలని సూచించారు.
కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ (Kingfisher Airlines) కోసం పలు బ్యాంకుల నుంచి మాల్యా దాదాపు రూ.9,000 కోట్ల రుణం తీసుకున్నారు. ఆ రుణాలను చెల్లించకపోవడంతో ఆయనపై కేసులు నమోదయ్యాయి. 2016 మార్చిలో ఆయన భారత్ నుంచి విదేశాలకు పరారయ్యారు. దాంతో 2019లో ఆయనను ‘పరారైన ఆర్థిక నేరస్థుడి (fugitive Economic Offender)’ గా ప్రకటించారు. చట్ట ప్రకారం మాల్యా ఆస్తులను జప్తుచేసి రుణాల రికవరీకి చర్యలు చేపట్టారు. దాంతో ఆయన హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు.
పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించడాన్ని, 2018 ఎఫ్ఈఓ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును తన పిటిషన్లలో ప్రశ్నించారు. ఈ రెండు పిటిషన్లను విచారించాలంటే మాల్యా ముందుగా భారత న్యాయవ్యవస్థ పరిధిలోకి రావాలని కోర్టు సూచించింది. అయితే బ్రిటన్ కోర్టుల ఆంక్షల కారణంగా మాల్యా భారత్కు ఎప్పుడు వస్తారో చెప్పలేమని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. మరోవైపు మాల్యాను భారత్కు అప్పగించేందుకు వీలుగా బ్రిటన్తో కేంద్రం సంప్రదింపులు కొనసాగిస్తోంది.