– పాలిటెక్నిక్ కళాశాలల విలీన ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి
– నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సిబ్బంది ఏకగ్రీవ తీర్మానం
రామగిరి, ఆగస్టు 13 : రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలను ‘శక్తి’ శాఖలో విలీనం చేసే ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది డిమాండ్ చేశారు. గురువారం కళాశాల ఆవరణలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు వారు ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించారు. ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులు మాట్లాడుతూ.. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఉద్యోగుల అభిప్రాయాలను తీసుకోకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. సాంకేతిక విద్యాభివృద్ధికి మూలస్తంభమైన పాలిటెక్నిక్ వ్యవస్థను శక్తి శాఖలో విలీనం చేస్తే విద్యా ప్రమాణాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విలీనం వల్ల ఉద్యోగుల సేవా నిబంధనలు, పదోన్నతులు, బదిలీలు, ఉద్యోగ భద్రత తీవ్రంగా దెబ్బతింటాయని పేర్కొన్నారు. AICTE గుర్తింపు ఉన్న పాలిటెక్నిక్ విద్య ద్వారా వేలాది మంది పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు తక్కువ ఖర్చుతో ఇంజనీరింగ్ కోర్సులు అభ్యసిస్తున్నారని గుర్తుచేశారు.
పాలిటెక్నిక్ కళాశాలల స్వతంత్ర గుర్తింపు, విద్యార్థుల ప్రయోజనాలకు భంగం కలగకుండా ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలని, ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని కోరారు. పాలిటెక్నిక్ కళాశాలలను సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు