CC Cameras | రాయపోల్, ఏప్రిల్ 1: ప్రజలతో పోలీసుల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ‘మన పోలీస్ – మన ఊరు’ కార్యక్రమం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం తిమ్మక్కపల్లి గ్రామంలో పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. సీపీ రష్మి పెరుమాళ్ కు గ్రామస్తులు బ్యాండ్ మేలా, మంగళ హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో 16 సీసీ కెమెరాలు, పెద్దమ్మ దేవాలయంలో మొక్కలు నాటారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలో క్రీడా పోటీలు ప్రారంభించారు. అలాగే విద్యార్థులకు నోట్ బుక్స్, పరీక్ష ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో జరుగుతున్న చిన్నపాటి ఘటనలను కూడా గుర్తించి నివారించడంలో సీసీ కెమెరాలు కీలకంగా ఉంటాయని తెలిపారు. ప్రజల ఆస్తి, ప్రాణ భద్రత కోసం ఈ చర్యలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. తదుపరి యువతలో క్రీడా చైతన్యాన్ని పెంపొందించేందుకు వివిధ క్రీడా పోటీలు ఉపయోగపడుతాయన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతోపాటు క్రమశిక్షణ, ఐకమత్యాన్ని పెంపొందిస్తాయన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడల్లో రాణించాలని సూచించారు.
ఇక పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటి, హరిత వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా ముఖ్యమని సూచించారు. పోలీస్ వ్యవస్థ ప్రజల కోసం ఉందని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు. గ్రామాల్లో శాంతి భద్రతలను కాపాడడంలో గ్రామస్తుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. ఎలాంటి అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అనంతం విద్యార్థులు నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్ రెడ్డి, ఉపసర్పంచ్ కుమ్మరి ప్రవీణ్, అడిషనల్ సిపి లు కుషాల్ కర్, సుభాష్ చంద్రబోస్, ఆయేషా, గజ్వేల్ ఏసీపీ నర్సింలు,
తొగుట సిఐ లతీఫ్, ఎస్ఐ మానసా, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.