Puvvada ajaykumar | కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్రంలోని ఆటో డ్రైవర్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రఘునాథపాలెం మండలం మంచుకొండ గ్రామంలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్- బీఆర్టీయూ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నేటికీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, ప్రతి ఆటో డ్రైవర్కు సంవత్సరానికి రూ.12,000 ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చినా, అధికారంలోకి వచ్చి 30 నెలలు గడిచినా ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఆరోపించారు.
ఆటో డ్రైవర్లు నిత్యం పెరుగుతున్న డీజిల్, పెట్రోల్, సీఎన్జీ ధరలు, విడిభాగాల ధరలు, వాహన నిర్వహణ ఖర్చులు, ఫైనాన్స్ ఈఎంఐలు, కుటుంబ పోషణ భారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం వారికి భరోసా కల్పించాల్సిన సమయంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో అనేక మందికి ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఈ పరిస్థితికి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని, ఆటో డ్రైవర్ల కుటుంబాలకు తక్షణ సహాయం అందించడంతో పాటు శాశ్వత సంక్షేమ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ నాయకత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటో కార్మికుల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేసిందని గుర్తు చేశారు. ప్రమాద బీమా పథకం ద్వారా ప్రమాదవశాత్తు మరణించిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా అందించి ఆర్థిక భరోసా కల్పించిందని తెలిపారు. కార్మిక వర్గాల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పనిచేసిందన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆటో డ్రైవర్లు కీలక పాత్ర పోషించారని, ఉద్యమంలో ముందుండి పోరాడిన వారిని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. అధికారంలోకి రావడానికి ఆటో డ్రైవర్లను ఓట్ల కోసం ఉపయోగించుకుని ఇప్పుడు వారి సమస్యలను పట్టించుకోకపోవడం దారుణమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
