Kulgam : జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) రాష్ట్రం కుల్గాం జిల్లా (Kulgam district) లోని కేలంలో ఉగ్రవాదులు (Terrorists) కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఛత్తీస్గఢ్ (Chattishgarh) కు చెందిన ఇద్దరు వలస కార్మికులు 24 ఏళ్ల దీపక్ రాత్రే (Dipak Ratre), 28 ఏళ్ల భూపేంద్ర బైనా (Bhupendra Bhaina) మరణించారు. మెరుగైన జీవనం కోసం ఉపాధిని వెతుక్కుంటూ ఛత్తీస్గఢ్ నుంచి జమ్మూ కశ్మీర్ వెళ్లిన వారు మృత్యువాత పడ్డారని తెలిసి రెండు కుటుంబాల సభ్యులు బోరున విలపించారు. దీపక్కు నాలుగు నెలల కుమారుడు ఉన్నాడని తెలిపారు. ఉపాధి కోసం ఏడెనిమిది నెలల క్రితమే దీపక్ తన భార్యతో కలిసి శక్తి జిల్లాలోని బుందేలి గ్రామం నుంచి జమ్మూ కశ్మీర్ వెళ్లారని అతడి మామయ్య హల్దర్ రాత్రే వెల్లడించారు.
అలాగే అతడికి దివ్యాంగ సోదరుడితోపాటు వృద్ధాప్యంలో ఉన్న తల్లి కూడా ఉందని చెప్పారు. దీపక్ తండ్రి గతంలోనే మరణించారని తెలిపారు. దీపక్ మరణంతో ఆ కుటుంబం కష్టాల్లోకి బలవంతంగా నెట్టివేయబడిదని అన్నారు. అతడి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్నామని జిల్లా ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. ఇక భూపేంద్ర భైనా స్వస్థలం సారంగఢ్ బిలాయిగఢ్ జిల్లాలోని చుయియా గ్రామం. మూడు నెలల క్రితమే భార్యతో కలిసి ఉపాధి కోసం జమ్ముకాశ్మీర్ వెళ్లాడని అతడి కుటుంబసభ్యులు చెప్పారు. అతడి తల్లిదండ్రులు ప్రస్తుతం హిమాచల్ప్రదేశ్లో వలస కార్మికులుగా జీవనం సాగిస్తున్నారని తెలిపారు.
భూపేంద్ర మృతిపై అతడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామన్నారు. అతడికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడని, ఆ బాలుడిని అమ్మమ్మ వద్ద వదిలి వీరు జమ్మూ కశ్మీర్ వెళ్లారని వివరించారు. అతడి పార్థీవ దేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు జమ్ముకశ్మీర్ అధికారులతో సమన్వయం చేసుకుని చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ సునీల్ శర్మ వెల్లడించారు. ఈ ఉగ్రవాదుల కాల్పులను ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి ఖండించారు. ఇది పిరికిపంద చర్య అని వ్యాఖ్యానించారు. కేలం ప్రాంతంలో ఇసుక బట్టీల్లో వీరు కార్మికులుగా పని చేస్తున్నారు. అక్కడికి వచ్చి ఉగ్రవాదులు వారి కులాలు, మతాలను ప్రశ్నించారు. ఆ తర్వాత వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటనలో దీపక్ కుప్పకూలి మరణించారు. భూపేంద్ర మాత్రం సౌరాలోని స్కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.