– డీవైఎఫ్ఐ భద్రాద్రి కొత్తూడెం జిల్లా కార్యదర్శి కాళంగి హరికృష్ణ
జూలూరుపాడు, సెప్టెంబర్ 18 : యువత ఎదుర్కొంటున్న విద్య, ఉపాధి సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా డీవైఎఫ్ఐ నిరంతర పోరాటాలు సాగిస్తుందని ఆ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కాళంగి హరికృష్ణ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామంలో శుక్రవారం నిర్వహించిన డీవైఎఫ్ఐ 10వ మండల మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశ భవిష్యత్కు వెన్నెముకైన యువతకు నాణ్యమైన విద్య, గౌరవప్రదమైన ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. అందరికీ విద్య.. అందరికీ ఉద్యోగాలు సాధనే లక్ష్యంగా యువతను పెద్దఎత్తున సమీకరించి, ప్రభుత్వాలపై నిరంతరం ప్రజా ఉద్యమాలు నిర్మించాల్సిన ఆవశ్యకతను వెల్లడించారు.
విద్యా అవకాశాలు, ఉద్యోగ నియామకాలు, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై యువత ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో యువత ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం దిశగా మండలంలో ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని నూతనంగా ఎన్నికైన కమిటీకి దిశానిర్దేశం చేశారు. యువత హక్కుల సాధన కోసం డీవైఎఫ్ఐ అహర్నిశలు ప్రజల పక్షాన నిలబడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మహాసభలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాసరావు, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు లిక్కీ బాలరాజు, మాజీ నాయకుడు యాసా నరేష్, జిల్లా ఉపాధ్యక్షులు వల్లమల్ల చందర్రావు, జల్లిక రాధాకృష్ణ, మండల నాయకులు చిమట సర్వేశ్, రాచబంటి తరుణ్, వెలగల సుందర్ రెడ్డి, బోయిన దర్సు, ఇల్లంగి ప్రవీణ్, జమ్మి యశ్వంత్, పెరుమాళ్ల పవన్, తిరుమల నాగరాజు, గోపు మల్లయ్య, లింగాల రాధాకృష్ణ, దేవరకొండ పృథ్వీ, యాస రాకేష్, చీమలపాటి విజయ్, వల్లమల్ల సంతోష్, రాచబంటి వెంకట్రావు పాల్గొన్నారు.