Dengue | వాతావరణ పరిస్థితుల్లో చోటుచేసుకుంటున్న అనూహ్య మార్పులు భారత్లో డెంగ్యూ, మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులతోపాటు వేడి సంబంధిత అనారోగ్యాల ముప్పును కూడా పెంచుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఎల్ నినో ప్రభావంతో సాధారణానికి భిన్నమైన ఉష్ణోగ్రతలు, ఎక్కువ కాలం కొనసాగే పొడి వాతావరణం, అకస్మాత్తుగా కురిసే భారీ వర్షాలు నమోదవుతున్నాయి. దీంతో వర్షాకాల వ్యాధులు, తీవ్రమైన వేడి కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు ఒకేసారి పెరిగే పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికే ఢిల్లీలో ఆగస్టు నెలలో 90 కొత్త డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సీజన్లో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 311కి చేరింది. అదే సమయంలో మలేరియా కేసులు జూలైలో 17 నుంచి ఆగస్టులో 53కి పెరిగాయి.
ఎల్ నినో కారణంగా ఏర్పడే వాతావరణ మార్పులు దోమల వృద్ధి, వ్యాధుల వ్యాప్తిపై ప్రభావం చూపుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏడిస్ ఈజిప్టై దోమలో డెంగ్యూ వైరస్ అభివృద్ధి చెందే వేగం పెరుగుతుంది. మరోవైపు అసమాన వర్షపాతం కారణంగా ఇళ్లలోని నీటి నిల్వలు, కూలర్ల ట్రేలు, పూల కుండీల కింద ఉండే పాత్రలు, నిర్మాణ ప్రాంతాలు, కాలువల్లో నీరు నిలిచిపోతుంది. ఇవి దోమల పెరుగుదలకు అనుకూల ప్రాంతాలుగా మారుతాయి. అధిక ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం కలిసినప్పుడు వడదెబ్బ, శరీరంలో నీరు తగ్గిపోవడం, తీవ్రమైన వేడి కారణంగా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
వేడి కారణంగా వచ్చే అనారోగ్యాలు, డెంగ్యూ లక్షణాలు కొన్ని సందర్భాల్లో ఒకేలా కనిపిస్తాయి. తీవ్రమైన వేడి వల్ల అలసట, తల తిరగడం, వేగంగా గుండె కొట్టుకోవడం, కండరాల్లో తీవ్రమైన నొప్పులు, గందరగోళం, శరీర ఉష్ణోగ్రత పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. డెంగ్యూ విషయంలో అధిక జ్వరం, కళ్ల వెనుక తీవ్రమైన నొప్పి, కీళ్లు, కండరాల్లో నొప్పులు, చర్మంపై దద్దుర్లు, వాంతులు లేదా వికారం, రక్తంలోని ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. లక్షణాలు కనిపించినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సలహా తీసుకోవడం అవసరం.
డెంగ్యూ, వేడి సంబంధిత అనారోగ్యాల నుంచి రక్షణ పొందేందుకు ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వారానికి కనీసం ఒకసారి నీటి నిల్వ పాత్రలు, కూలర్ల ట్రేలు, పూల కుండీల కింద ఉండే పాత్రలను ఖాళీ చేసి శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. దోమల నివారణకు తగిన దోమల వికర్షకాలను ఉపయోగించడం, కిటికీలు, తలుపులకు మెష్ ఏర్పాటు చేసుకోవడం, పూర్తిగా శరీరాన్ని కప్పే పలుచని దుస్తులు ధరించడం ఉపయోగకరంగా ఉంటుంది. వేడి ఎక్కువగా ఉండే మధ్యాహ్న సమయంలో బయట శారీరక శ్రమను తగ్గించి, తగినంత నీరు, ఓఆర్ఎస్, కొబ్బరి నీరు లేదా ఎలక్ట్రోలైట్ ద్రవాలు తీసుకోవాలి. అలాగే బహిరంగ కాలువలు, నీరు పొంగిపొర్లే ట్యాంకులు, పేరుకుపోయిన చెత్త వంటి వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా దోమల పెరుగుదలను అరికట్టవచ్చు.