నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య ( Student Suicide) పట్ల విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. విద్యార్థి మృతికి ఉపాధ్యాయులే కారణమం టూ విద్యార్థులు రాస్తారోకో నిర్వహించడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీపురం గ్రామ శివారు మహాత్మ జ్యోతిబాపూలే కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి భరత్ ( Bharath ) స్వగ్రామంలోని ఇంటిలో ఆత్మహత్య చేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈనెల 12న స్వగ్రామానికి వెళ్లిన విద్యార్థి 15న కళాశాలకు తిరిగి రాకపోవడంతో కళాశాల సిబ్బంది ఫోన్ చేసి విషయాన్ని కనుగొన్నారు. అయితే తాను కళాశాలకు వెళ్లబోనని తల్లికి చెప్పడంతో వారు సరేనన్నారు. అసలు విషయం తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో భరత్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
శుక్రవారం భరత్ తల్లిదండ్రులు కళాశాలకు వచ్చి విద్యార్థికి సంబంధించిన పెట్టే వస్తువులు తీసుకెళ్లేందుకు రాగా భరత్ చనిపోయిన విషయం తెలియడంతో తోటి విద్యార్థులు అవాక్కయ్యారు. ఉపాధ్యాయులు వేధింపులకు గురి చేయడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం చౌరస్తాలో ధర్నా నిర్వహించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులు ఆటోలు, బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో గురుకుల కళాశాల వద్దకు తరలించారు. అక్కడ కూడా గంట పాటు ప్రిన్సిపాల్ ఎదుట ధర్నా నిర్వహించారు. వేధింపులకు గురిచేస్తున్న ఉపాధ్యాయుడు ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.