ఆత్మకూరు, సెప్టెంబర్ 15 : ప్రియదర్శిని జూరా ల ప్రాజెక్ట్కు ఎగువ నుంచి వరద ఉవ్వెతున్న వస్తున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ల నుంచి నీటి విడుదల కొనసాగుతున్న నేపథ్యంలో లక్షా 72వేల 589 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుండగా, లక్షా 71వేల 786 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతున్నది. ఎడమ కాల్వకు 820 క్యూసెక్కులు, కుడి కాల్వకు 672, సమాంతర కాల్వకు 800, భీమా-2కు 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, విద్యుత్ ఉత్పత్తికి 28,384 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాల్లో 11 యూనిట్లలో ఉత్పత్తి జరుగుతుండగా, ఎగువ జూ రాలలో 5 యూనిట్ల ద్వారా 3.612 మి.యూ. ఉ త్పత్తి జరిగింది. మొత్తంగా 169.918 మి.యూ. ఉత్పత్తి అయింది. దిగువ జూరాలలో 6 యూనిట్ల ద్వారా 4.472 మి.యూ ఉత్పత్తి జరుగగా, మొ త్తంగా 187.230 మి.యూ విద్యుదుత్పత్తి జరిగిం ది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా, 8.145 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
టీబీ డ్యాంకు..
అయిజ, సెప్టెంబర్ 15 : కర్ణాటకలోని ఎగువన కురుస్తున్న వర్షాలకు టీబీ డ్యాంకు వరద పోటెత్తుతున్నది. ఎగువ నుంచి వరద చేరుతుండడంతో 12 గేట్లు రెండు అడుగులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం డ్యాంలోకి ఇన్ఫ్లో 50,973 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 52,0 71 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం పూర్తిస్థాయి నీటిమట్టం 100.163 టీఎంసీలు ఉన్నా యి. 1633 అడుగుల నీటిమట్టానికిగానూ 1632.82 అడుగులు ఉన్నట్లు టీబీ బోర్డు కార్యదర్శి నాగమోహన్, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. నదికి వరద ప్రవాహం వస్తుండడంతో నదీ పరీవాహక ప్రాంత ప్రజలు తుంగభద్ర నది సమీపంలోకి వెళ్లరాదని అధికారులు కోరారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు..
ఆర్డీఎస్ ఆనకట్టకు వరద కొనసాగుతున్నది. బుధవారం ఆర్డీఎస్ ఆనకట్టకు 15,419 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, 15వేల క్యూసెక్కుల వరద ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నదని కర్ణాటక ఆర్డీఎస్ ఏఈ డేవిడ్ తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 9.4 అడుగుల మేర నీటిమట్టం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్డీఎస్ ప్రధానకాల్వకు 419 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.