మనం 21వ శతాబ్ది ముంగిట ఉన్నాం. ఇంతకాలం మనం సాధించిందేమిటి, సాధించవలసిందేమిటనేది సమీక్షించుకోవాలి. అనేక అయోమయాలు, అనిశ్చితుల మధ్య భవిష్యత్తు ఎలా ఉంటుందనే ఊహల మధ్య మనం కొత్త శతాబ్దిలోకి అడుగుపెడుతున్నాం. మన ముందున్న అవకాశాలేమిటనేది పరిశీలిద్దాం. కొత్త శతాబ్దాన్ని మన ఆకాంక్షలు తీర్చేదిగా మలచుకుందాం. అనేక సంక్షోభాల మధ్య మనకు ఆశలు కనిపిస్తున్నాయి. ఒక ఉజ్వల భవిష్యత్తులోకి మనం అడుగుపెట్టవలసి ఉన్నది. మన వెనుక ఎంత అనిశ్చిత చరిత్ర ఉన్నప్పటికీ మనం కలవరపడవలసిందేమీ లేదు. ప్రస్తుత శతాబ్దంలో ఆశ్చర్యకరమైన రీతిలో వేగవంతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
విద్య మానవుడి ప్రాథమిక హక్కు. అందరికీ సమాన అవకాశాలు లభించినప్పుడే ఈ హక్కు అర్థవంతమవుతుంది. సార్వత్రిక ప్రాథమిక విద్య, వయోజన విద్య అనే లక్ష్యాలు ఎంతో కాలంగా ఉన్నాయి. దేశాభివృద్ధి సాధించాలంటే ఈ లక్ష్యాలు నెరవేరాలి.
–పీవీ నరసింహారావు
వాస్తవానికి ఎంతో అభివృద్ధి చెందిన వారమని భావించే వారికన్నా పల్లెటూరి వారు తమ మూలాలతో ఎక్కువ అనుబంధం కలిగి ఉంటారు. వారు సంప్రదాయంలో ఒక భాగంగా ఉంటారు. మతం, సంస్కృతి అనేది కొందరి కుట్రలలో సాధనంగా మారినప్పుడు అవి విభజించేవిగా కనిపిస్తాయి. కానీ, సంస్కృతీ మతం అనేవి మనిషికి ఉపశమన కారకాలు. మనలను సామాజిక వాస్తవికతకు దగ్గరగా చేరుస్తాయి.
‘21వ శతాబ్ది సవాళ్లు’ అనే అంశంపై
1991 నవంబర్ 19న ఇందిరా గాంధీ మెమోరియల్
ట్రస్ట్ నిర్వహించిన సదస్సులో ప్రధాని పీవీ నరసింహారావు
రాజకీయాలు శాస్త్ర, సాంకేతికాభివృద్ధి, సామాజిక, ఆర్థిక, పునర్నిర్మాణం, అతివేగంగా సాగుతున్నాయి. నిన్నటి ప్రశ్నలు నేడు సత్యాలుగా కనిపిస్తున్నాయి. నేటి సత్యాలు రేపటి ప్రశ్నలుగా మారవ చ్చు. మనం ఎదుర్కొంటున్న అయోమయం మరింత లోతైనది. అయినా ఆ అయోమయాలు మన ల్ని ముంచెత్తకుండా జాగ్రత్తపడాలి. అదే మనం ఎదుర్కొంటున్న మౌలిక సవాలు. అనేక అనిశ్చితుల మధ్య మనం, శాశ్వత విలువల కోసం అన్వేషించాలి. భవిష్యత్తులో ప్రయాణించడానికి ఒక కొత్త వంతెన నిర్మించేందుకు అవసరమయ్యే భావాలను, పోకడలను, వ్యవస్థలను మనం ఎంచుకోగలగాలి. ప్రతి ఒక్క టి సాపేక్షమైనదనేది అంగీకరించినప్పటికీ మన అనుభవాలు, విజ్ఞానాలను ప్రాతిపదికగా చేసుకోవలసిందే.
మనం గతంలోకి తొంగి చూస్తే మానవాళి ఎంతో ప్రగతి సాధించిందనేది అర్థమవుతుంది. అయితే మన భవిష్యత్తు భద్రంగా, నాణ్యమైనదిగా ఉండాలంటే మనం ఆ దిశగా ఆరంభంలోనే ఉన్నాము. వెయ్యేండ్లకు పైగా మన పూర్వీకులు మన జీవనాన్ని సులభతరం చేయడానికి ఎంతో కృషిచేశారు. భవిష్యత్ తరాల కోసం ఎంతో ఆలోచించారు. సంచారాలు నిలిపివేసి, స్థిరజీవనం మొదలు పెట్టారు. వ్యవసాయాన్ని ప్రారంభించారు. నాగలి తయారుచేసి, కొత్త భవిష్యత్తును ఇచ్చారు. ఒక్కొక్క కచ్చు పేర్చుకుంటూ మనకు నివాసాలు కల్పించారు. ఆ క్రమంలోనే మనం భూ మాత దగ్గర మొదలై ఆకాశహర్మ్యాలను నిర్మించుకున్నాం. మనం చక్రాన్ని కనిపెట్టాం. దానిపై కొత్త ప్రపంచంలోకి ప్రయాణించాం. రాయడం నేర్చుకున్నాం. విశ్వంలోకి తొంగిచూశాం. రాతను కనిపెట్టడానికి ముందే ఎంతో విజ్ఞానాన్ని సంపాదించుకున్నాం. శాస్త్ర, సాంకేతికరంగంలో విజయాలు సామాజిక ప్రగతికి దారితీశాయి. ఈ క్రమంలో విధ్వంసం చేసే శక్తిని కూడా మానవుడు సమకూర్చుకున్నాడు. దీనితో సామాజిక లక్ష్యం నుంచి మానవుడు దూరంగా జరిగాడు. అయినప్పటికీ విజ్ఞానం, వికాసానికి దారితీసింది. జీవన నాణ్యత పెరిగింది. శాస్త్ర, సాంకేతికత ప్రపంచాన్ని దగ్గరగా కుదింపజేసింది. మనం కోరుకుంటే ప్రపంచమంతా ఒక కుటుంబంగా మారిపోగలదు.
వ్యక్తి సమాజం నుంచి ఎంత దూరంగా జరిగితే శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం అంతగా పక్కదారి పట్టిపోతుంది. సమాజ శ్రేయస్సు కేంద్రంగా విజ్ఞానశాస్త్రం ఉండలేదు. విజ్ఞాన శాస్త్రం తన స్వార్థం కోసమే అని మనిషి భావిస్తే ఇక సమాజం అనేది లెక్కలోకి రాదు. అది దురదృష్టకరమైన పరిస్థితి. అపరిమిత శక్తి గల విజ్ఞానశాస్ర్తాన్ని సమాజ శ్రేయస్సు కోసం మనం వినియోగించుకోలేకపోతే క్షమార్హం కాదు.
విజ్ఞానం సమాజ శ్రేయస్సు అనే లక్ష్యం నుంచి విడివడిపోవడమే పెద్ద ప్రమాదం. ఆయుధ పోటీ ఇందుకు ఉదాహరణ. విజ్ఞానశాస్త్రమే ఈ పోటీకి మూలం. ఇది క్రమంగా స్మార్ట్ బాంబులు, ఇంటెలిజెంట్ బాంబులు తయారుచేసే స్థితికి దిగజారింది. కొత్తకొత్త ఆయుధాల తయారీ ఒక పోటీగా మారింది.
1947లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్, 34వ సదస్సులో మాట్లాడుతూ నెహ్రూ ఇదే అభిప్రా యం వెల్లడించారు. విజ్ఞానశాస్త్రం, ఒక వ్యక్తి సత్యాన్వేషణగా మారకూడదు. సమాజం ఎదుర్కొంటున్న జాడ్యాలకు పరిష్కారాలు చూపగలగాలని బోధించారు. శాస్త్ర విజ్ఞానం పల్లెల్లోని పేద ప్రజలను చేరుకోగలగాలి. సామాజిక మూలాల నుంచి ఎదగాలి. అప్పుడే శాస్త్ర విజ్ఞానానికి ఒక దృక్కోణం ఏర్పడుతుంది. దానిని ఎలా సాధించాలనేదే మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రశ్న.
వ్యక్తి గానీ, శాస్త్ర సాంకేతికత గానీ సమాజం నుంచి దూరం కాకూడదనేదే దృఢ అభిప్రాయం. ఆదర్శ రాజ్యమనేది ఎవరూ పట్టించుకోకపోతే చుక్కాని లేని నావగా మారిపోతుంది. ఒక వ్యక్తికి చరిత్ర సంస్కృతి, వారసత్వం మూలాల పట్ల ఎంత అనుబంధం ఉందనేదానిపైనే అతడు ఎం తగా సామాజిక వాస్తవికతతో మమేకవుతాడనేది ఆధారపడి ఉంటుంది. ఇందుకు సంబంధించిన లోతైన సిద్ధాంతాలు అందరికీ అర్థం కాకపోవచ్చు. కానీ, ఒక వ్యక్తి జానపద గేయాన్ని ఆస్వాదించగలుగుతాడు. వాస్తవానికి ఎంతో అభివృద్ధి చెందిన వారమని భావించే వారికన్నా పల్లెటూరి వారు తమ మూలాలతో ఎక్కువ అనుబంధం కలిగి ఉంటారు. వారు సంప్రదాయంలో ఒక భాగంగా ఉంటారు. మతం, సంస్కృతి అనేవి కొందరి కుట్రలలో సాధనంగా మారినప్పుడు అవి విభజించేవిగా కనిపిస్తాయి. కానీ, సంస్కృతీ మతం అనేవి మనిషికి ఉపశమన కారకాలు. మనలను సామాజిక వాస్తవికతకు దగ్గరగా చేరుస్తాయి. ఒక వ్యక్తి ఇతరుల నుంచి- సమాజం నుంచి ఒంటరిగా మారిపోయి అతడు తన సంస్కృతిని నిలుపుకోలేడు. అందువల్ల మితిమీరిన వ్యక్తి శ్రేయోవాదానికి విరుగుడుగా సమాజ భావన ముందుకువస్తుంది. బుద్ధుడి కాలంలోనూ ఇదే జరిగింది.
బుద్ధం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
సంఘం శరణం గచ్ఛామి
సంఘం ప్రధానమైందిగా ముందుకువచ్చినప్పుడు మనకు మొత్తం మానవాళి లక్ష్యంగా కనిపిస్తుంది. ఇతర జాతుల్లేకుండా మానవుడి మనుగడ సాధ్యం కాదు కనుక, మొత్తం విశ్వం సకల సృష్టి వైపుగా చూడగలుగుతాము. ఈ క్రమంలో ఎవరు ఏ రీతిలో ఊహించినప్పటికీ ఆ సృష్టికర్త తిరుగులేని మేధస్సును దర్శించగలుగుతాం. 21వ శతాబ్దిలో మానవుడి లక్ష్యం, ఆ సృష్టికర్త కృషిని భగ్నం చేయకపోవడమే.