‘తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం’ అనేది రాష్ట్ర సాధన ఉద్యమంలో అత్యంత కీలకమైనది. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వమంటే 90 శాతం అట్టడుగు కులాలు, వర్గాల అస్తిత్వం అన్న వాస్తవాన్ని కనుమరుగు చేస్తున్న రాజకీయ పార్టీలు.. వాటి ప్రతాపాలు, పంథాలు, అధికారాల చుట్టే రాజకీయాలను తిప్పేస్తున్నాయి. అధికారాలను, రాజకీయాలను కోడిపందాల ఆటగా ఆధిపత్యం వర్గం మార్చేసింది. పాలించే లక్షణాలు తమ కులానికే ఉన్నాయని చెప్పుకొంటూ ప్రజాస్వామ్య సూత్రాలను దిగజార్చారు. బహుజనుల గుండెలు మండేలా చేశారు. నీళ్లు, నిధులు, భూములు, నియామకాలు.. ఇలా అన్నింటిలో 90 శాతం జనాభా కలిగి ఉన్న అట్టడుగు కులాలు తలెత్తుకుని నిలవటమే తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం అన్నదాన్ని రాజకీయ పార్టీలు కుట్రపూరితంగానే విస్మరిస్తున్నాయన్న విషయాన్ని నేటి తెలంగాణ గమనిస్తున్నది.
Telangana | దూసుకొస్తున్న బహుజన చైతన్యాన్ని తమ వైపునకు తిప్పుకొనేందుకు కొన్ని పార్టీలు బహుజన నాయకత్వమని చెప్తూ ఓట్లు దండుకునే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టాయి. సమాజంలో సగభాగమైన బీసీలకు చట్టసభల్లోకి పోయే అవకాశాలు లేవు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆధిపత్య వర్గాలే ఇంకా అధికారం చెలాయిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అన్నింటిలో బీసీలకు సమవాటా దక్కాలన్నదే బహుజనుల ప్రధాన లక్ష్యం. అదే కర్తవ్యం కూడా. అవే రేపటి తెలంగాణను తీర్చిదిద్దగల బీసీ సూర్యోదయాలవుతాయి. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని ఏ రాజకీయ పార్టీ అయితే ఆకళింపు చేసుకుని, బహుజనులను తమలో ఇముడ్చుకుని నిలువగలదో ఆ పార్టీయే రేపటి తెలంగాణలో నిలువగలుగుతుంది.
తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వమంటే బహుజన రాజకీయ అస్తిత్వమన్న విషయాన్ని బీఆర్ఎస్ బలంగా విశ్వసిస్తున్నది. అందుకే పార్లమెంటు ఎన్నికల్లో 6 సీట్లను బీసీలకు కేటాయించింది. ఇది బీసీ వర్గాలకు ఊరట కలిగించింది. గుండె ధైర్యాన్నిచ్చింది. బహుజన రాజకీయ అస్తిత్వాన్ని బీఆర్ఎస్ తనలో ఇముడ్చుకుని భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్నది. ఇది శుభపరిణామం. తెలంగాణ అస్తిత్వాన్ని గెలిపించి నిలిచిన బీఆర్ఎస్.. తెలంగాణ పునర్నిర్మాణంలో బహుజన రాజకీయ అస్తిత్వాన్ని ఎగరేసే జెండాగా నిలవడం ఆధిపత్య రాజకీయాలకు చరమగీతం పాడటమే అవుతుంది. అదే తెలంగాణ సమాజానికి రక్షణ కవచంగా మారుతుంది.
దశాబ్దాల పాటు దేశాన్నేలిన రెండు జాతీయ పార్టీలు 77 ఏండ్లుగా బీసీలను మోసగిస్తూనే ఉన్నాయి. కులగణన చేయబోనని బీజేపీ తెగేసి చెప్పింది. బీసీల గురించి చాలా మాట్లాడుతున్న కేంద్ర పాలకులు బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయాలంటే మాత్రం ఒప్పుకోవడం లేదు. ఇన్నేండ్లు ఏమీ చేయని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని ఎన్నికల ముందు మరోసారి బీసీ రాగం అందుకున్నది. తెలంగాణలో అధికారం కోసం పెనుగులాడే పెత్తందార్లు బీసీలను ఎప్పుడు పట్టించుకున్నారు? ఎన్నడు మాట్లాడిండ్రు? గోరటి వెంకన్న రాసిన ‘పల్లెకన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల’ పాట అస్తవ్యస్తమైన బీసీల బతుకులపై రాసిందే. రెండు దశాబ్దాల కిందట ఈ పాట బీసీల బాధలు తడిమింది. బీసీలకు సంబంధించి ఏదో ఒక మేరకు కొంత కదలిక వచ్చింది, కొంత సత్తువనిచ్చింది, కొంత బతుకుపై నమ్మకాన్నిచ్చింది మాత్రం స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలోనేనన్నది వాస్తవం.
తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా బీసీలకు జరిగిన మేలును బీసీ బిడ్డలు గమనిస్తూనే ఉన్నారు. దేశంలో ఎక్కడాలేనన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి బీసీల అభ్యున్నతి కోసం కృషిచేసిన కేసీఆర్ తపనను తెలంగాణ సమాజం ఎప్పటికీ మరిచిపోదు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో పదేండ్లలో 1,000కి పైగా గురుకులాలు నెలకొల్పటం, ఐదున్నర లక్షల మంది విద్యార్థులు కార్పొరేట్ స్థాయి విద్యనందుకోవటం విప్లవాత్మకమైన చర్యగానే చెప్పాలి. తెలంగాణ రాకముందు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల బిడ్డలకు పురుగులన్నం పెట్టిన నాయకులు.. ఇప్పుడు బీసీలకు మేలు చేస్తామని వాగ్దానాలు చేస్తున్నారు. ఎన్నికల సంగ్రామం కాబట్టి ఓట్ల కోసం వారు ఏమైనా మాట్లాడవచ్చు. కానీ, అసలు వాస్తవాలను ప్రజలు గ్రహించాలి.
తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం గొంతెత్తి గర్జించి తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చిన కేసీఆరే ఇప్పుడు తెలంగాణ బీసీ రాజకీయ అస్తిత్వ సాధన కోసం ముందుకు వస్తున్నారు. ఆ దిశగా బీఆర్ఎస్ను నడిపించేందుకే ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఆరు స్థానాలను బీసీలకు కేటాయించారు. స్వాతంత్య్రం వచ్చాక బహుజనులకు ఏం చేస్తారో చెప్పాలని ఫూలే వేసిన ప్రశ్నకు నేటికీ కేంద్ర పాలకుల వద్ద సమాధానం లేదు. ఆ సమాధానాన్ని వెతికే దిశగా కేసీఆర్ అడుగులు పడుతున్నాయి. ఆ అడుగు తెలంగాణ నుంచే మొదలవ్వాలి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో, ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం బీసీలకు సీట్లు ఇవ్వని పార్టీలకు బీసీల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది? 77 ఏండ్లుగా బీసీలను ఓట్లేసే యంత్రాలుగా, చప్పట్లు కొట్టే చేతులుగా మార్చిన కాంగ్రెస్, బీజేపీల కుటిల, కుట్ర రాజకీయ తంత్రాలను బీసీలు తెలుసుకోవాలి. బీసీ డిక్లరేషన్లు ప్రకటించి చేతులు దులిపేసుకుంటున్న కాంగ్రెస్, బీజేపీ రాజకీయ ముసుగులను తొలగించాలి. సామాజిక బహుజన ప్రజాస్వామ్యాన్ని తెలంగాణలో నెలకొల్పుకోవాలి. కులగణన చేయాలని అడిగితే దేశసమగ్రత దెబ్బతింటుందని చెప్పే బీజేపీ వాదనను ఓట్ల ద్వారా తిప్పికొట్టాలి. ఎంతోకాలంగా బీసీలను దగా చేస్తున్న కాంగ్రెస్ అసలు నైజాన్ని బయటపెట్టాలి. బీసీ కులగణనను, రిజర్వేషన్లను తొక్కిపెట్టిన, అణచివేసిన కాంగ్రెస్, బీజేపీలను తరిమికొట్టాలి.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా స్వతంత్రం రానివాళ్లు బీసీలే. దేశలో సగానికి పైగా జనాభా ఉన్న బీసీలకు రాజ్యాంగబద్ధ రిజర్వేషన్లు లేకపోవడం విచారకరం. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం గొంతెత్తి గర్జించి తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చిన కేసీఆరే ఇప్పుడు తెలంగాణ బీసీ రాజకీయ అస్తిత్వ సాధన కోసం ముందుకు వస్తున్నారు. ఆ దిశగా బీఆర్ఎస్ను నడిపించేందుకే ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఆరు స్థానాలను బీసీలకు కేటాయించారు. స్వాతంత్య్రం వచ్చాక బహుజనులకు ఏం చేస్తారో చెప్పాలని ఫూలే వేసిన ప్రశ్నకు నేటికీ కేంద్ర పాలకుల వద్ద సమాధానం లేదు. ఆ సమాధానాన్ని వెతికే దిశగా కేసీఆర్ అడుగులు పడుతున్నాయి. ఆ అడుగు తెలంగాణ నుంచే మొదలవ్వాలి.
బీసీలకు చట్టబద్ధంగా దక్కాల్సిన స్థానాల కోసం స్థానిక సంస్థల్లో బీసీలకు సగం సీట్లు ఇచ్చే దిశగా బీఆర్ఎస్ భవిష్యత్తు కార్యాచరణను రచిస్తున్నది. వీపీ సింగ్లాగా బీసీల హక్కుల సాధన కోసం కేసీఆర్ వస్తారన్న నమ్మకం నాకుంది. తెలంగాణలో జరగాల్సిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం జరిగే ఉద్యమానికి బీఆర్ఎస్ మాత్రమే గొంతుకగా నిలువగలదు. డీఎంకేలాగా చెక్కుచెదరని తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని నిలిపే పార్టీగా ముందుకువచ్చి నిలువగలిగింది బీఆర్ఎస్ ఒక్కటే. భవిష్యత్తు తెలంగాణకు బీఆర్ఎస్సే కొత్తదారిని చూపుతుంది.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు అన్నిరంగాల్లో ఎదగాలి. సంపదలన్నీ సంపద సృష్టికర్తలకు మొదటగా అందాలి. నిధులు, నియామకాల్లో బహుజనుల వాటా వారికే దక్కేలా చట్టాలు తేవాలి. అన్నిరంగాల్లో బీసీలు శిరస్సు ఎత్తుకుని నిలిచే విధంగా రాజకీయ రూపకల్పన జరిగినప్పుడే అది తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వంగా నిలువగలుగుతుందని బీఆర్ఎస్ బలంగా నమ్ముతున్నది. బీసీల అస్తిత్వం పెరిగితేనే బహుజన తెలంగాణ అస్తిత్వం పెరుగుతుంది. అప్పుడు మాత్రమే బహుజనులు స్వతంత్రంగా వ్యవహరించగలుగుతారు. బహుజనులకు ఉత్పత్తి సాధనాలంటే ప్రాణం. అలాంటి ఉత్పత్తి సాధనాల విషయంలో బీసీలే యజమానులుగా మారాలి. బీసీల వాటా బీసీలకే దక్కాలి. చదువుల్లో ఎదగాలి. సంపదలు పొందాలి.
చదువుల్లోనైనా, సంపదలోనైనా, పాలనలోనైనా, అధికారంలోనైనా బీసీలు తమ వాటా తాము పొందాలన్న లక్ష్యం వైపుగా బీఆర్ఎస్ దారులు వేస్తున్నది. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో ఆరు సీట్లను కేటాయించింది. ఇప్పుడు వారిని గెలిపించుకోకపోతే భవిష్యత్తులో ఏ పార్టీ కూడా బీసీలకు టికెట్లు ఇవ్వదు. కాబట్టి బీసీ స్వీయ రాజకీయ అస్తిత్వం దిశగా అడుగులు వేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. అదే తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వానికి ప్రాణంగా నిలుస్తుంది.