21వ శతాబ్దంలోనూ బీసీలు, మహిళలు, ఇతర వర్గాలు చట్టసభల్లో ప్రాతినిధ్యం కోసం కొట్లాడుతున్నాయి. ఆర్థిక, సామాజిక అసమానతలపై ఇప్పటికీ అనేకచోట్ల పోరాటాలు జరుగుతున్నాయి. కానీ, ఎప్పుడో శతాబ్దాల కిందటే కుల, మత, వర్గ, వర్ణ వ్యవస్థలను, అసమానతలను రూపుమాపేందుకు సమరభేరి మోగించిన గొప్ప సంఘసంస్కర్త బసవేశ్వరుడు.
Basaveshwara | నేటి కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లా బాగేవాడిలో క్రీ.శ.1134లో ఆనందనామ సంవత్సరంలో జన్మించిన బసవేశ్వరుడు వీరశైవ సంప్రదాయాన్ని మహోజ్వలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన గొప్ప భక్తుడు. లింగాయత ధర్మ సృష్టికర్త, విశ్వగురువు, మహా మానవతావాది. స్త్రీ, పురుష అసమానతలను తొలగించడానికి కృషి చేసిన అభ్యుదయవాది బసవేశ్వరుడు. బాల్య వివాహాలు, సతీ సహగమనం వంటి దురాచారాలను రూపుమాపేందుకు ఆయన ఆనాడే కృషి చేశారు. దురాచారాలు స్వార్థపరుల సృష్టి అంటూ వాటిపై సమరభేరి మోగించారు. తద్వారా సర్వసమానత్వమే శాంతికి మూలమని ఉపదేశించారు.
జాతి, వర్గ భేదం లేకుండా అందరూ దీక్షా సంస్కారం పొందవచ్చునని చెప్పిందే లింగాయత ధర్మం. దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలని ఘోషించిన అపూర్వ ప్రగతిశీలి, మొట్టమొదటి కులాంతర వివాహం చేసిన గొప్ప సంఘసంస్కర్త ఆయన. మనుషులు శాంతి సామరస్యాలతో సహజీవనం గడపాలని బోధించారు. సుఖసంతోషాలకు కష్టపడి పనిచేయాలని నిరాడంబర జీవితం గడపాలని ఉపదేశించారు.
వ్యక్తుల జీవితాలను సమాజ గమనాన్ని ప్రభావితం చేసే విధంగా బసవన్న తన సొంత ఒరవడిలో కొత్త ధర్మాన్ని సృష్టించారు. అదే లింగాయత ధర్మం. అనాదిగా వస్తున్న మూఢ నమ్మకాలను, ఆచారాలను బసవణ్ణ తీవ్రంగా ఖండించారు. ఆయనకు పూర్వం స్త్రీలకు, పంచములకు ధార్మిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులు ఉండేవి కావు. బసవణ్ణ ఆగమనంతో అందరూ అన్ని బంధాల నుంచి విముక్తి పొందారు. సమాజ నిర్మాణంలో ఆయన దార్శనికత, నాయకత్వం ఇప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. బసవణ్ణకు పూర్వపు యుగంలో పంచములకు, వెనుకబడిన కులాల వారికి దేవాలయంలోకి ప్రవేశం ఉండేది కాదు. దాన్ని రూపుమాపే ఉద్దేశంతో సమ సమాజ స్థాపన కోసం దేవుడినే భక్తుడి వద్దకు తీసుకురావడానికి ఇష్టలింగాన్ని బసవేశ్వరుడు కనిపెట్టారు. పరమ శివునికి ప్రతిరూపమైన ఇష్టలింగాన్ని చేతికిచ్చి గుడి సంస్కృతిని, కుల వ్యవస్థను అంతమొందించారు. ఆచార పారాయణులు పంచములను గుడిలోపలకి రానివ్వనపుడు ఆ గుడిలోని లింగాన్ని తెచ్చి వారి ఒడిలో ఉంచిన మహనీయుడు బసవణ్ణ. మాంసాహారాన్ని త్యజించి శాకాహారాన్ని స్వీకరించడం ఇష్టలింగాదరణ, ఇష్టలింగ పూజ. ఇదే బసవణ్ణ సూచించిన భక్తి మార్గం. మనుషుల మధ్య, మతాల మధ్య సామరస్యం ఉండాలని ఆకాంక్షించిన ఆయన మొట్టమొదటి కులాంతర వివాహం చేసి సమాజ గమనాన్ని ప్రభావితం చేశారు.
‘జ్ఞానమే గురువు. ఆచారమే లింగం. దేహమే దేవాలయం. స్త్రీ, పురుష భేదం లేదు. శ్రమకు మించిన సౌందర్యం లేదు. పనిని మించిన దైవం లేదు. కష్టాన్ని మించిన భక్తి లేదు. భక్తి కన్న సత్ప్రవర్తనే ముఖ్యం’ అని చేసే పనిలో దేవుడిని చూసే మార్గాన్ని చూపించి కాయకష్టమే కైలాసం అనే కొత్త ఒరవడికి నాంది పలికారు బసవేశ్వరుడు.
బీసీలు, మహిళలు, ఇతర వర్గాలు చట్టసభల్లో ప్రాతినిధ్యం కోసం ఇప్పటికీ కొట్లాడుతున్నాయి. నేటి మన పార్లమెంటరీ వ్యవస్థతో సమానమైన అభినవ మంటపాన్ని బసవేశ్వరులు ఆనాడే స్థాపించారు. అందులో జాతి, కుల, వర్గ, వర్ణ భేదాలు లేకుండా అందరికి సమాన అవకాశం కల్పించిన అపూర్వ ప్రజాస్వామ్యవాది బసవణ్ణ. నేటి ప్రభుత్వాలు, పాలకులు బసవేశ్వరుడిని ఆదర్శంగా తీసుకోవాలి. బీసీలు, మహిళలు, బలహీనవర్గాలకు చట్టసభల్లో అడుగుపెట్టేందుకు అవకాశం కల్పించాలి.