కృతయుగంలో ధర్మం అన్నింటికంటే తీపి.. త్రేతాయుగంలో నిజాయితీ, బాధ్యత అన్నింటినీ మించినవి.. ద్వాపరయుగంలో పై రెండు యుగాల కంటే చెడు పెరిగింది కాబట్టి, చెడ్డవారి నిర్మూలనే ధ్యేయం. మరి కలియుగంలో ధర్మం, నిజాయితీ, బాధ్యత, మంచి ప్రవర్తన అన్నింటినీ మించి డబ్బే ముఖ్యం, డబ్బే అమృతం! డబ్బు కోసం, ముఖ్యంగా తేలికగా సంపాదించటం కోసం ఈ కాలంలో మనిషి చేయని అకృత్యమేమైనా ఉందా?
BJP-Congress | త్రేతాయుగపు శ్రీరాముడు స్వయంగా ధర్మ స్వరూపుడిగా నిలిచి చూపిస్తే, ద్వాపరయుగపు శ్రీకృష్ణుడు ప్రవచించి చెప్పాడు. ఇక కలియుగంలో నేరాలు ఎక్కువగా ఆర్థిక అసమానతల వల్ల జరుగుతాయని కార్ల్మార్క్స్ చెప్పాడు. కానీ, ప్రస్తుత రాజకీయ, సామాజిక రంగాలను పరిశీలిస్తే, మార్క్స్ సిద్ధాంతం కూడా పూర్తిగా సరైనదని అనిపించటం లేదు. ఎందుకో పరిశీలిద్దాం!
ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నదంటే ఉన్నవాడికి తృప్తి లేదు. ఇంకా సంపాదించాలనే యావ. ఇది అవసరాలు తీరక కాదు. నీతి, నిజాయితీ తక్కువై, స్వార్థం పెరిగిపోయి ఈ పరిస్థితి దాపురించింది. జనాభా అధికంగా ఉన్న భారతదేశంలో అందరూ బాగుండాలంటే ప్రతిరంగంలోనూ కొన్ని నిబంధనలుండాలి. ఉదాహరణకు ఒక వ్యాపారస్థుడికి ఒకటి, రెండు రంగాల్లో- అదీ ఒక స్థాయివరకే ఉండాలి. ఆడవారి బిందీ బొట్ల నుంచి, విమానాశ్రయాలు, ఓడరేవులు, గ్యాస్ వ్యాపారాలు, బొగ్గు ఇతర గనులు ఒకడికో, కొందరికో కట్టబెట్టే వీలుండకూడదు. ప్రస్తుత రాజకీయ పరిస్థితి చూస్తుంటే దేశ భవిష్యత్తు గురించి ఆందోళన కలుగుతున్నది. మోదీ మళ్లీ ప్రధానమంత్రి అవ్వాలని, బీజేపీ గెలవాలని ప్రచారం చేస్తున్నవారు ముఖ్యంగా చెప్తున్న మాట ఒకటి ఉన్నది. నెహ్రూ కుటుంబం దేశాన్ని దోచుకుంది, ఏ రకమైన ప్రగతి లేదు, మమ్మల్ని గెలిపిస్తే ఉద్ధరిస్తామంటున్నారు. దూరదృష్టి కొరవడిన నెహ్రూ ఐఐటీలు, ఐఐఎంలు స్థాపించి మేధోవలసలకు తలుపులు తెరిచాడు, కాంగ్రెస్ నాయకులు దోచుకుతిన్నారు రెండూ నిజమే! మరి బీజేపీ గత పదేండ్లుగా చేస్తున్న నిర్వాకమేమిటి?
మోదీ ఒంటరిగా జీవిస్తాడు, కుటుంబం, పిల్లలు లేరు కాబట్టి సన్యాసిగా బతుకుతూ దేశ ప్రజలకు సేవ చేస్తాడన్నది మోదీ భక్తులు చెప్పే ముఖ్యమైన మాట. మరి జరుగుతున్నదేమిటి? లేమిలో పుట్టి, లేమిలో పెరిగాడు కాబట్టి పది లక్షల ఖరీదు చేసే సూట్లు వేసుకొని విదేశాల్లో తిరిగితే ‘పోనీలే పాపం!’ అనుకున్నాం. కానీ, ఇప్పటి పరిస్థితిలో మోదీజీకే ఎక్కువ ధనం అవసరం అవుతున్నది.
ప్రధానమంత్రి స్థానం అధిష్టించినప్పటి నుంచీ, కొందరు గుజరాతీ వ్యాపారస్థులను ప్రోత్సహించి దేశ సంపద కట్టబెట్టడంలో మోదీకి ఉత్సాహ మెందుకు? ఎందుకంటే ప్రస్తుతం దేశంలో అందరికంటే డబ్బు అవసరం ఒంటరిగా జీవించే ప్రధాని పార్టీకే ఉంది. విమానమో, ఒక నౌకో కొనాలంటే కొద్దిగా ఎక్కువ ధనమే అవసరం. మరి మనుష్యులను కొనాలంటే? శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు చౌకగా దొరుకుతారా? దొరకరు కదా! రేపు ఎన్నికల ఫలితాల తర్వాత వందో, రెండొందల సభ్యులో బీజేపీ తీర్థం పుచ్చుకోవాలంటే చాలా పెద్ద మొత్తం ప్రసాదం ఇవ్వాలి కదా!
కనుక భార్య, పిల్లలు లేనివాళ్లందరూ వాజపేయిలాగా ఉంటారనుకోకండి. వారి కోరికలు, ఆశలను బట్టి వారికే ధనం అవసరమవుతుంది. శ్రీలంక దేశం మొత్తం అదానీ విద్యుత్తు వాడుతోందంటే, అందులో ఎవరి వాటా ఎంత ఉంటుందో ఊహించండి. అబద్ధాల ప్రచారాలు, డంబాలు చెప్పే నాయకుల మాటలు నమ్మకుండా జరుగుతున్న భాగోతాలు చూసి, గమనించి, అర్థం చేసుకొని ఓటేయండి. ఎదుటివాడు చెడ్డవాడని చెప్తే చెప్పేవాడు మంచివాడని అర్థం కాదు. కాంగ్రెస్, బీజేపీ ఇద్దరూ ఇద్దరే! దేశ సంపద ఎవడు తింటే ఏం! ఇటలీ వాడైనా, గుజరాతీ వాడైనా, సామాన్య ప్రజల బతుకులు బండలవుతుంటే ఎవడైనా ఒక్కటే. మన దేశం వాళ్లు కుబేరులవుతున్నారని మురిసిపోకండి. ఈ కుబేరులంతా విదేశాలకు పారిపోయి, స్థిరపడి మన సంపదతో అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు. ఈ రెండు జాతీయ పార్టీలు తమ నిజస్వరూపాన్ని చూపాయి కనుక, ఏ రాష్ట్రం వారు ఆ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీకి, ప్రజలను ప్రేమించే నాయకులకు, పార్టీలకు ఓటు వేయండి. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి ఓట్లు పడనీయకండి. సంకీర్ణ ప్రభుత్వం వస్తే అటు కేంద్రానికి, ఇటు అన్ని రాష్ర్టాలకూ ఎంతో కొంత మంచి జరుగుతుంది.