గన్నేరువరం, ఆగస్టు 8: గుండ్లపల్లి మాజీ సర్పంచ్ సమత భర్త రాజేందర్ రెడ్డిది ఆత్మహత్య కాదని, హత్యేనని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. మండలంలోని గుండ్లపల్లిలో రాజేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను శనివారం ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, చెప్పుడు మాటలు నమ్మి కాంగ్రెస్లో చేరిన పాపానికి ప్రాణాలు తీశారని దుయ్యబట్టారు. గ్రామాభివృద్ధిపై రాజేందర్రెడ్డి ప్రశ్నించినందుకే గ్రామానికి చెందిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పీఏ మురళీధర్ రెడ్డి కక్ష గట్టి వడ్లూరు గ్రామానికి చెందిన ఇద్దరిని ఎగదోసి కొట్టించే ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు. తిరిగి రాజేందర్రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించేందుకు ఎమ్మెల్యే పీఏ మురళీధర్ రెడ్డి సీఐ, ఎస్ఐపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.
ఈ అరాచకాల గురించి తెలిపేందుకు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్కు వెళ్లిన రాజేందర్ రెడ్డి అక్కడ ఎవరూ పట్టించుకోకపోవడంతో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నం చేశాడని ఆరోపించారు. అయితే, అది నిజంగా ఆత్మహత్యనా? లేక ఎవరైనా పెట్రోల్ పోసి నిప్పంటించారా? అనే అనుమానాలు ఉన్నాయని పేరొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. రాజేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదన్నారు.
నియోజకవర్గంలో అరాచకాలను ప్రశ్నిస్తే ఇంకా ఎంతమందిని చంపుతావని కవ్వంపల్లిని ప్రశ్నించారు.? మురళీధర్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయించాలని డిమాండ్ చేశారు. మరో వారం రోజులు వేచి చూసిన తర్వాత కూడా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బాధిత కుటుంబానికి న్యాయం చేయకపోతే బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి రూ. కోటి పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం రాజేందర్ రెడ్డి భార్య బేతెల్లి సమత మాట్లాడుతూ, తన భర్త మృతికి కారణమైన ఐదుగురు నిందితులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వారికి సహకరిస్తున్నాడని ఆరోపించారు.
క్యాంపు కార్యాలయం ఎదుట ఆత్మహత్యా యత్నం చేసిన అనంతరం దవాఖానలో చికిత్స పొందుతున్న సమయంలో కూడా ఎమ్మెల్యే కనీసం పరామర్శించలేదని మెరుగైన వైద్యం కోసం శ్రద్ధ చూపలేదని ఆరోపించారు. అంతేకాకుండా తన భర్తను అవహేళన చేస్తూ మాట్లాడారని, నిందితులకు అనుకూలంగా పోలీసులు ఉండేలా ఎమ్మెల్యే ఒత్తిడి చేశారని, తన భర్త పై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఐదుగురు ప్రస్తుతం బయట తిరుగుతున్నారని, వారి నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ మాజీ జడ్పీటీసీలు మాడుగుల రవీందర్ రెడ్డి, సిద్ధం వేణు, తాళ్లపల్లి శేఖర్ గౌడ్, నాయకులు పుల్లల లక్ష్మణ్, న్యాత సుధాకర్, మహేందర్ రెడ్డి, అటికంశ్రీనివాస్ గౌడ్, రవి, శంకర్ గౌడ్, బద్ధం తిరుపతిరెడ్డి, తదితరులున్నారు.