మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమైన జడ్చర్ల
పదేండ్ల తర్వాత మున్సిపాలిటీకి ఎన్నికలు
ఆశావహుల్లో ఉత్సాహం
జడ్చర్ల, ఏప్రిల్ 11: మున్సిపల్ ఎన్నికలకు జడ్చర్ల సిద్ధమైంది. బాదేపల్లి మేజర్ గ్రామ పంచాయతీ 2011లో మున్సిపాలిటీగా మారింది. పదేండ్ల తర్వాత జడ్చర్ల మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తం అవుతున్నది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈనెలాఖరులోగా ఎన్నికలు నోటిఫికేషన్ విడుదలకు చేసేందుకు కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే వార్డుల విభజన పూర్తికాగా ఓటరు జాబితాను ప్రకటించిన అధికారులు వార్డుల రిజర్వేషన్లు కూడా ఖరారు చేయడంతో ఆశావహుల్లో ఉత్సాహం నెలకొన్నది.
జడ్చర్ల మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు జడ్చర్ల సిద్ధమైనది. బాదేపల్లి మేజర్ గ్రామ పంచాయతీ 2011లో మున్సిపాలిటీగా మారింది. అయితే మున్సిపాలిటీ అయిన సమయంలో బాదేపల్లి, జడ్చర్ల, కావేరమ్మపేటను కలిపి మున్సిపాలిటీగా చేశారు. ఈ సమయంలో జడ్చర్లకు చెందిన కొందరు కోర్టుకు వెళ్లడంతో 2014లో జడ్చర్ల గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ నుంచి వేరుచేశారు. దాంతో 2015 ఫిబ్రవరిలో బాదేపల్లి నగరపంచాయతీగా ఏర్పడింది. అప్పటినుంచి 2018 వరకు బాదేపల్లి నగరపంచాయతీగా కొనసాగింది. ఆ తర్వాత 2018లో జడ్చర్ల, బాదేపల్లి, బూరెడ్డిపల్లి, నాగసాల గ్రామపంచాయతీలను కలిపి మళ్లీ బాదేపల్లి మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. అయితే ఆ సమయంలో జడ్చర్ల గ్రామ పంచాయతీకి పాలకవర్గం ఉండటంతో మున్సిపాలిటీలో విలీనం చేయలేదు. అనంతరం 2019 అక్టోబర్లో బాదేపల్లి మున్సిపాలిటీని జడ్చర్ల మున్సిపాలిటీగా గెజిట్లో పేర్కొన్నారు. అప్పటి నుంచి జడ్చర్ల మున్సిపాలిటీగా కొనసాగుతున్నది. జడ్చర్ల గ్రామ పంచాయతీకి 2020 డిసెంబర్లో పాలకవర్గం పదవీకాలం ముగియడంతో జడ్చర్ల, కావేరమ్మపేట జడ్చర్ల మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. అదేవిధంగా శంకరాయపల్లితండా కూడా జడ్చర్ల మున్సిపాలిటీలో విలీనమైనది. అయితే 2011లో బాదేపల్లి మున్సిపాలిటీగా ఏర్పడిన నాటి నుంచి 2021వరకు ఎన్నికలు నిర్వహించలేదు. దాదాపు దశాబ్దం పాటు ఎన్నికలు జరుగలేదు. ఎట్టకేలకు ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
పదేండ్ల తర్వాత ఎన్నికలు
జడ్చర్ల మున్సిపాలిటీకి పదేండ్ల తర్వాత ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. బాదేపల్లి మున్సిపాలిటీగా ఏర్పడిన నాటి నుంచి నేటివరకు ఎన్నికలు నిర్వహించలేదు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈనెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నది. అందుకు అనుగుణంగా అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే వార్డుల విభజన పూర్తై ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించిన అధికారులు వార్డుల రిజర్వేషన్లు కూడా ఖరారు చేశారు.
వార్డుల వారీగా రిజర్వేషన్లు ఇలా..
జడ్చర్ల మున్సిపాలిటీలో మొత్తం 27వార్డులు ఉండగా అందులో బీసీ జనరల్ 5, బీసీ మహిళ 4, జనరల్కు 6, జనరల్ మహిళ 8, ఎస్సీ జనరల్ 2, ఎస్సీ మహిళ 1, ఎస్టీ జనరల్ 1 చొప్పున రిజర్వేషన్లను ఖరారు చేశారు. అయితే ఈ నెల 14న తుది ఓటరు జాబితా తర్వాత వార్డుల రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో చేపట్టనున్నారు. ఈ నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండడంతో అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. జడ్చర్ల మున్సిపాలిటీలో మొత్తం 41,511మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 20,746, మహిళలు 20,749మంది ఉన్నారు.
ఆశావహుల్లో ఉత్సాహం
జడ్చర్ల మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతుండడంతో ఇన్నాళ్లు ఎన్నికలపై ఆశలు పెట్టుకున్న ఆశావహుల్లో ఉత్సాహం నెలకొన్నది. పదేండ్లుగా ఎదురుచూస్తున్న వారికి ఈ ఎన్నికలు ఆశలు రేపుతున్నాయి. దశాబ్దం తర్వాత ఎన్నికలు జరుగుతుండడంతో పట్టణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు వార్డుల్లో తిరగని వారు కూడా ఎన్నికలు వస్తున్నాయని దర్శనమిస్తున్నారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇంతకు ముందు నుంచే వార్డుల వారీగా తిరుగుతూ ప్రజాసమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జడ్చర్ల మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించనున్నారనే విషయం తెలిసిన ఆశావహుల్లో ఉత్సాహం నెలకొన్నది. కౌన్సిలర్ టికెట్ ఎవరికి వస్తుందోనన్న ఆత్రుత మొదలైంది. అయితే అధికార పార్టీలో మాత్రం పోటీ ఎక్కువగా కనిపిస్తున్నది.
ఇవి కూడా చదవండి
పెన్షన్ రంగంలో 74 శాతం ఎఫ్డీఐ పెంపునకు కేంద్రం యోచన
ధోనీపై ద్రవిడ్ ఆగ్రహించిన వేళ
రోజూ తినే ఆహారంలో ఇవి ఉంటే ఆరోగ్యం మీ వెంటే