దేవరుప్పుల, ఏప్రిల్ 26: పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్లో మరోసారి గులాబీ జెండా ఎగురవేస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా దేవరుప్పులలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యమ నేత కేసీఆర్ పాలన స్వర్ణయుగాన్ని తలపించిందన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలుచేయకపోవడంతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. ఓవైపు సాగునీరందక పంటలు ఎండిపోయాయని, ధాన్యం కొనుగోళ్లు లేక రైతులు ఇబ్బందిపడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే క్వింటాల్ ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్రెడ్డి హామీ నెరవేరలేదని మహాలక్ష్మీ పథకంలో పేద మహిళలకు నెలకు రూ. 2500 చొప్పున ఇస్తామని చెప్పి మోసం చేశారని ఎర్రబెల్లి మండిపడ్డారు. కనీసం కర్షకులకు రైతుబంధు సాయం అందలేదని, రూ.2లక్షల రుణమాఫీపై అనేక వాయిదాలు పెడుతున్నారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి రైతులను మభ్యపెట్టేందుకు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని రేవంత్రెడ్డి దేవుళ్లపై ప్రమాణాలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఘన విజయం చేకూరుస్తారని ఎర్రబెల్లి తెలిపారు.
కారు గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచిన అధికార దాహంతో కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరి చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని ఎర్రబెల్లి విమర్శించారు. పదేళ్లలో బీఆర్ఎస్లో ఎన్నో పదవులు అనుభవించిన శ్రీహరికి ఉద్యమ నేత కేసీఆర్ ఎంతగానో గౌరవం ఇస్తే మోసం చేశాడని అన్నారు. కడియం కావ్యకు కాంగ్రెస్లో ఆదరణ లేకపోగా, శ్రీహరి చేసిన నమ్మకద్రోహానికి ఆ కుటుంబంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, ఇదే ఆమె ఓటమికి కారణమవుతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలను చూసి ప్రజలు నమ్మారని, కానీ నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ మోసాలను గమనించారని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో నియోజకవర్గంలో తమ ఓటుతో తీర్పు ఇస్తారని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తీగల దయాకర్, నాయకులు పల్లా సుందరరాంరెడ్డి, చింత రవి, కొల్లూరు సోమయ్య, కారుపోతుల భిక్షపతి, ధరావత్ రాంసింగ్ పాల్గొన్నారు.