Yadadri Temple | నరసింహస్వామి ఉగ్రమూర్తి కదా ఇంట్లో పూజించవచ్చా? సింహరూపం కాబట్టి నైవేద్యం ఏం పెట్టాలి? పూజలు భారీగా చేయాల్సి ఉంటుందా? సామాన్య భక్తుడి మదిలో ఉదయించే ప్రశ్నలివి. మంత్రం, తంత్రం తెలియకున్నా.. నిర్మలమైన మనసుతో స్వామిని ఆరాధించవచ్చు. శుచిని, శుభ్రతను పాటిస్తూ.. ఇంటినే యాదాద్రిగా మలుచుకోవచ్చు.
ఏ దేవుడైనా భక్త సులభుడే! నరసింహస్వామీ అంతే!! ప్రహ్లాదుడు తలచిన వెంటనే ప్రత్యక్షమయ్యాడు. ఇలవేల్పుగా నిలిచాడు. స్వామి అవతార విశేషాల గురించి భాగవతం, అగ్ని, బ్రహ్మాండ, వాయు, బ్రహ్మ, విష్ణుధర్మోత్తర, కూర్మ, మత్స్య, పద్మ, శివ, లింగ, స్కంద, నృసింహ తదితర పురాణాల్లో విస్తృతంగా పేర్కొన్నారు. ఏ పురాణాన్ని పరిశీలించినా నరసింహస్వామి అవతరించింది.. తన భక్తుడైన ప్రహ్లాదుడి మాటను నిజం చేయడం కోసం. తనను ఆరాధించే భక్తులను అనుగ్రహిచడం కోసమే. అధర్మం పట్ల ఉగ్రత్వాన్ని కనబరిచే స్వామి, తన భక్తుల విషయంలో చల్లని తండ్రి, శాంతమూర్తి.
ఈ నేలపై స్వామివారు స్వయంభువుగా ఆవిర్భవించిన ప్రదేశాలు అత్యంత శక్తిమంతమైన క్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి. ఆ క్షేత్రాల్లో స్వామివారు కొలువుదీరిన తీరు, వాటిని దర్శించిన భక్తులు పొందుతున్న అనుభవాలు అలౌకిక ఆనందాన్ని పంచుతాయి. ఆయా క్షేత్రాలను దర్శించి, స్వామి సన్నిధిలో నిద్రచేయడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయని విశ్వాసం. తరచూ క్షేత్రాలకు వెళ్లి స్వామిని దర్శించుకోవడం అందరికీ సాధ్యమయ్యేదా! అందుకే, ఇంటినే మందిరంగా మార్చి ఆ భక్తవరదుణ్ని ఆరాధించవచ్చు. నరసింహస్వామి విగ్రహాన్ని గానీ, చిత్రపటాన్ని గానీ పెట్టుకొని నిత్యం ఆరాధించవచ్చు.
విగ్రహ రూపంలో స్వామిని పూజించాలనుకుంటే.. ఎత్తు మూడు నుంచి తొమ్మిది అంగుళాలు మించకుండా చూసుకోవాలి. మంత్రం కన్నా మనసు ప్రధానం. శక్తి, ఆసక్తి ఉన్నవాళ్లు షోడశోపచార విధానంతో గానీ, పంచోపచార విధానంతో గానీ నిత్య పూజ చేయాలి. మంత్ర విధానంతో స్వామిని సేవించలేం అని భావించేవాళ్లు.. నిండైన మనసుతో అర్చన చేయాలి. స్వామి నామాన్ని మననం చేస్తూ నీళ్లతో అభిషేకించాలి. అవకాశం ఉన్న రోజు ఆవుపాలతో అభిషేకం చేయాలి. పూజలో భాగంగా
నమస్తే దేవదేవేశ నమస్తే ధరణీధర
నమస్తే కమలాకాంత గృహాణార్ఘ్యం నమోస్తుతే॥
అంటూ పళ్లెంలో అర్ఘ్యం వదలాలి (నీళ్లు వదిలిపెట్టాలి). గంధంతో తిలకం దిద్ది, కుంకుమ అద్ది, పూలు పెట్టి, దీపాన్ని చూపించాలి. అగరొత్తులు వెలిగించి మనస్ఫూర్తిగా వేడుకోవాలి. స్వామివారికి బెల్లంతో చేసిన పానకం, వడపప్పు ప్రీతి. వాటిని నివేదనగా సమర్పించాలి. పండ్లు కూడా నివేదించవచ్చు. శక్తికొద్ది ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. మనసా, వాచా, కర్మణా ఏకాగ్ర చిత్తంతో ఆత్మ నివేదన చేస్తే స్వామి తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఇవి కూడా చేయలేం అనుకునేవాళ్లు.. స్వామివారి పటానికి నిత్యం రెండు పుష్పాలు పెట్టి, అగరొత్తులు వెలిగించి వేడుకుంటే చాలు.
ఉగ్రం వీరం మహావిష్ణుం
జ్వలంతం సర్వతో ముఖం
నృసింహం భీషణం భద్రం
మృత్యోర్మృత్యుం నమామ్యహం॥
మంత్రాన్ని నిత్యం పఠించడం వల్ల సర్వ గ్రహబాధలు, భూత బాధలు తొలగిపోతాయి. నరసింహస్వామిని భక్తిశ్రద్ధలతో నిత్యం పూజించడం వల్ల చేపట్టిన పనులలో విజయం చేకూరుతుంది. తలపెట్టిన కార్యాలు సఫలీకృతమై సిరిసంపదలు చేకూరతాయి.
– అప్పాల శ్యాంప్రణీత్ శర్మ, అవధాని, వేదపండితుడు
యాదాద్రిలో లడ్డూ ప్రసాదం తయారీకి వాడుతున్న మెషినరీ గురించి ఈ విషయాలు తెలుసా
బ్రహ్మోత్సవాల వేళ యాదాద్రి లక్ష్మీనరసింహుడు ఏ అలంకరణల్లో కనువిందు చేస్తాడు?
Yadadri | తరతరాలుగా స్వామివారి సేవలో తరిస్తున్న ఈ కుటుంబం గురించి తెలుసా
నవ వైకుంఠం మన యాదాద్రి.. ఇక్కడి విగ్రహాలు, గోపురాల ప్రత్యేకత ఏంటంటే..