Yadadri Temple |యాదాద్రీశుడి దర్శనంతో జన్మధన్యమైన అనుభూతి కలుగుతుంది. నిరంతరం ఈ దివ్యక్షేత్రంలోనే ఉంటూ, స్వామివారి కైంకర్యాలను పరిశీలించే అవకాశం రావడం అంటే మాటలా! తరతరాలుగా స్వామి సేవలో తరించడం పూర్వజన్మ సుకృతం అంటున్నారు యాదాద్రి ఆలయ ఆనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి. నరసింహుడి అనుగ్రహంతోనే తనకు యాదాద్రి ఆలయం పునర్ నిర్మాణంలో భాగమయ్యే అవకాశం లభించిందని చెబుతున్నారు. యాదాద్రీశుడి కోవెల పునః ప్రారంభోత్సవం సందర్భంగా నరసింహమూర్తి ‘బతుకమ్మ’తో పంచుకున్న అనుభవాలు ..
శతాబ్దాల చరిత్ర ఉన్న యాదాద్రి క్షేత్రం.. భక్తులపాలిట కొంగుబంగారమై అలరారుతున్నది. 1859 నుంచి ఆనువంశికత్వం ప్రారంభమైంది. మా పూర్వికులు రాంభట్టు వెంకటరామయ్య, తర్వాత రామయ్య, రాంబాయమ్మ ఆనువంశిక ధర్మకర్తలుగా కొనసాగుతూ వచ్చారు. తర్వాత ఆ గురుతర బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను.
ఆలయంలో సబ్ ఆర్డినేటర్ నుంచి కార్యనిర్వాహకం వరకు పూర్తి బాధ్యతలు ధర్మకర్తలుగా మేం పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఆలయ ఈవో, అర్చకులు, అధికారులు వంటి వివిధ విభాగాల అధికారులకు ధర్మకర్తగా వ్యవహరిస్తూ ఉంటాం. ఆలయంలో జరిగే అన్ని కార్యక్రమాలు, వేడుకలు, బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో పర్యవేక్షిస్తుంటాం. ప్రతి సేవనూ స్వామి ఆజ్ఞగా భావించి నిర్వహిస్తాం. మొత్తంగా రాష్ట్ర దేవాదాయ శాఖకు, ఆలయానికి మధ్యవర్తులుగా ఉంటాం. 1996లో దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి యాదాద్రి దేవాలయం వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత యాదాద్రికి కొత్త కళ వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలయ పునర్ నిర్మాణం చేపట్టడం గొప్ప విషయం. అంతేకాదు, ఆనువంశిక ధర్మకర్తృత్వానికి కూడా సముచిత స్థానం కల్పించారు. యాదాద్రీశుడి సన్నిధిలోనే ధర్మకర్తకూ ప్రత్యేకమైన భవనాన్ని నిర్మింపజేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో దేవాలయ అభివృద్ధికి రూ.1,200 కోట్ల వరకు వెచ్చించారు. యాదాద్రి క్షేత్రం గొప్పదనాన్ని ప్రపంచానికి చాటే ఉద్దేశంతో ఈ మహాక్రతువుకు పూనుకున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆలయాన్ని ఇల వైకుంఠంగా తీర్చిదిద్దారు. మరో వెయ్యేండ్లకు కూడా చెక్కు చెదరని విధంగా సంపూర్ణంగా అభివృద్ధి చేశారు. స్వామివారి ఆలయంతోపాటు శివాలయ నిర్మాణం, ఆలయ పరిసరాలను అందంగా తీర్చిదిద్దడం, నూతన సత్యనారాయణ స్వామి వ్రత మంటప నిర్మాణం ఇవన్నీ యాదాద్రి శోభను ఇనుమడింపజేస్తున్నాయి. ఆలయ అభివృద్ధిలో వాస్తు నిపుణులు, శిల్పులు, ఆగమ శాస్త్ర పర్యవేక్షకులు ఎందరో భాగమయ్యారు. మా సూచనలు కూడా పరిగణనలోకి తీసుకోవడం మరింత సంతోషాన్నిచ్చింది. ఈ బృహత్ కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా ఆనువంశిక ధర్మకర్తల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.