Yadadri Temple | విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. హరి అవతారమైన నరసింహుడికీ అలంకారాలంటే ఇష్టమే! బ్రహ్మోత్సవ వేళ పరంధాముడు రకరకాల అలంకారాల్లో మనోహరంగా దర్శనమిస్తాడు. ఒక్కో అలంకారం వెనుక ఓ పౌరాణిక ప్రశస్తి ఉంటుంది. వటపత్రశాయిగా వరహాల లాలి అందుకుంటాడు. జగన్మోహినిగా సమ్మోహన పరుస్తాడు. కన్నయ్యగా కనువిందు చేస్తాడు. ఆ అలంకారాల వివరాలివి..
వటపత్రశాయిగా..
మర్రి ఆకుపై పవళించిన విష్ణుమూర్తి వటపత్రశాయి. జగత్ రక్షకుడిగా ఆవిర్భవించిన యాదాద్రీశుడు శేషసాయి రూపంలో భక్తులను అనుగ్రహిస్తాడు. అదేరోజు రాత్రి హంస వాహనంపై
మాడవీధుల్లో దర్శనమిస్తాడు.
జగన్మోహినిగా..
అమృతాన్ని అసురులకు దక్కకుండా చేసిన అవతారం జగన్మోహిని. జగదానంద కారకుడు జగన్మోహిని రూపం కట్టడమే.. దుష్టుల ఆటలు కట్టించడం కోసం, ఇష్టులను కనిపెట్టుకొని
కరుణించడం కోసం. అదే రోజు రాత్రి అశ్వవాహనంపై దర్శనమిస్తాడు.
మురళీ కృష్ణుడిగా
ఉగ్రరూపంతో ఆవిర్భవించినా.. ప్రహ్లాదుడిపై ప్రేమతో కరుణమూర్తిగా మారిపోయాడు స్వామి. సరళమూర్తిని మురళీకృష్ణుడిగా అలంకరిస్తారు. రాత్రి పొన్న వాహనంపై ఊరేగుతూ ‘నేనున్నాన’ని స్వామి అభయమిస్తాడు.
గోవర్ధన గిరిధారిగా
వేలిపై కొండను ఎత్తిన గోవర్ధనుడి అవతారంలో కొండంత వేలుపుగా పగలు దర్శనమిస్తాడు నరహరి. తన నీడలో ఉన్న భక్తులను అనుగ్రహిస్తాడు. రాత్రి సింహ వాహనాన్ని అధిష్ఠించి
నృసింహుడిగా కరుణిస్తాడు.
శ్రీరాముడిగా
కోదండం పట్టుకొన్న రాముడిగా దర్జాగా దర్శనమిస్తాడు. కోటి దండాలు అందుకుంటాడు. అదే రోజు రాత్రి స్వామివారు గజ వాహనాన్ని అధిరోహిస్తాడు. లక్ష్మీదేవిని మనువాడటానికి కల్యాణ ఉత్సవానికి పరివారంతో వైభవంగా తరలి వెళ్తాడు నరసింహుడు.
శ్రీ మహావిష్ణువుగా..
మహావిష్ణువు అలంకారంలో దివ్యవిమాన రథోత్సవంలో ఊరేగుతూ దర్శనమిస్తాడు యాదాద్రీశుడు. కొండకిందికి వచ్చి యాదాద్రి పురవీధుల్లో రథోత్సవం వైభవంగా కొనసాగుతుంది. రథం ముందు భక్తుల కోలాటాలు, భజనలు, మంగళవాద్యాలు, చెక్క భజనలు, నామ సంకీర్తనలు యాదాద్రి క్షేత్రాన్ని ఇల వైకుంఠంగా మార్చేస్తాయి.