Yadadri Temple | భక్త ప్రహ్లాదుడి శరణాగతితో స్తంభంలోంచి నరసింహుడు వెలిస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంలోంచి నృసింహనగరి ఆవిర్భవించింది. యాదాద్రిలో పునర్నిర్మితమైంది గోపురాలో, ప్రాకారాలో మాత్రమే కాదు.. పల్లవ, చోళ, విజయనగర, కాకతీయ శిల్పకళా రీతులకూ పునఃప్రతిష్ఠ జరిగింది. ఐదున్నరేండ్ల పరిమిత కాలంలో శతాబ్దాలనాటి ఓ చిన్న ఆలయ స్వరూపమే మారిపోయింది. అర ఎకరంలోని ప్రాంగణం నాలుగు ఎకరాలకు విస్తరించింది. మూడు గోపురాల గుడి.. సప్త గోపురాలతో సుశోభితమైంది. యాదగిరి గుట్ట.. యాదాద్రి క్షేత్ర నామంతో తెలంగాణ ఆధ్యాత్మిక రాజధానిగా అవతరించింది.
సాలగ్రామ సమూహమైన యాదాద్రిలో అణువణువూ నృసింహ స్వరూపమే. చెట్టు, పుట్ట, గాలి, నీరు.. ‘ఇందుగలడందులేడని సందేహము వలదు’ అంటూ స్వామి అనంతత్వాన్ని చాటి చెబుతాయి. ఘాట్ రోడ్డు మీదుగా నర్సన్న దర్శనానికి విచ్చేసే భక్తులకు తొలుత అంతెత్తు తోరణం స్వాగతం పలికి.. భక్తి సామ్రాజ్య పౌరసత్వాన్ని ప్రసాదిస్తుంది. మరుక్షణం నుంచీ ముక్కోటి దేవతలూ, నారదాది మహర్షులూ.. మన సహ యాత్రికులు అవుతారు. సూక్ష్మ-స్థూల శరీరాలతోనో, దృశ్య-అదృశ్య రూపాలతోనో మనతో కలిసి పరమాత్మను దర్శించుకుంటారు. ప్రధాన ఆలయ ఆవరణలో అడుగుపెట్టిన మరుక్షణం.. వైకుంఠపురిలో ప్రవేశించిన అనుభూతిని పొందుతాం. యాదాద్రి ఇలవైకుంఠమే! ఆలయంలోని ప్రతి శిల్పం.. హరి తత్వాన్ని చాటుతుంది. ప్రతి నిర్మాణం నరహరి లీలలను వినిపిస్తుంది. అడుగడుగునా ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతూ, అణువణువునా శరణాగతిని నింపుకొంటూ.. అడుగుముందుకేయండి. ఆద్యంతరహితుడి కటాక్షం పొందండి.
ఓం నమో నారసింహాయ
* * *
లడ్డూలు. లడ్డూలు. గుట్టలకొద్దీ లడ్డూలు. వరాహావతారంలో పదునైన కోరతో పరమాత్మ నిలబెట్టిన భూగోళాన్ని తలపించే లడ్డూలు. రామావతారంలో సీతా కల్యాణానికి జనక మహారాజు వండి వడ్డించిన లడ్డూలు. కృష్ణావతారంలో యశోదమ్మ తినిపించిన వెన్నముద్దలను గుర్తుకు తెచ్చే లడ్డూలు. యాదాద్రి నరసింహుడి ప్రసాదమైన లడ్డూలు. ఎంతో రుచి! మహా ప్రశస్తి! మానవమాత్రులు తయారుచేసిన లడ్డూ ప్రసాదంలోనే ఇంత రుచి ఉంటే.. పరమాత్మ భక్తిలో ఇంకెంత మాధుర్యం ఉండాలి. ప్రతి భక్తుడిలో ఈ ప్రశ్న ఉదయించాలనే కాబోలు.. మూలవిరాట్టు దర్శనానికి క్యూ లైన్లు లడ్డూ కౌంటర్ ముందునుంచే మొదలవుతాయి. నరహరి దర్శనభాగ్యం కోసం వచ్చే నానా దిక్కుల నరులంతా ఆ వరుసలో కలిసిపోతారు. ఉక్కపోతకూ, తొక్కిసలాటకూ తావులేని ఆధునిక వ్యవస్థ ఇది. నాలుగు అడుగులు వేయగానే.. యాదాద్రి ఆలయ ప్రధాన ఆవరణ! ప్రతి నిర్మాణం ఓ అద్భుతం. ప్రతి శిల్పం సృష్టికర్తకు సవాలే. ఆ వైభోగాన్ని తిలకించడానికి రెండు మాంస నేత్రాలూ సరిపోవు. విశ్వరూప దర్శనాన్ని పార్థుడికి ప్రసాదించినట్టే మనకూ దివ్య చక్షువులను అనుగ్రహించమని స్వామిని వేడుకోవాలి.
ఓం నమో నారసింహాయ
* * *
సారసాకరము.. దివ్యస్వర్ణ శాలాంక గోపుర హర్మ్యావృతమైన తద్భవనమంభోజమ్ము.. ఆహా! అదో మేలైన నగరం. పద్మాల కొలనులు, పసిడి గోపురాలు.. అంటూ పోతనామాత్యుడు తాదాత్మ్యతతో వర్ణించింది వైకుంఠపురినే అయినా.. ఆ పోలికను యథాతథంగా యాదాద్రికి అన్వయించుకోవచ్చు. ఆ కృష్ణశిలా సమూహం వల్ల కావచ్చు జగన్మోహనుడి ఆలయానికి సమ్మోహనమైన రూపం వచ్చింది. నలుపులో ఇదీ అని తెలియని మహత్తు ఉంది. కృష్ణావతారంలో స్వామి నల్లనివాడు, పద్మనయనమ్ములవాడు. నలుపు అనంతత్వానికి సంకేతం. అందుకేనేమో, ఆలయ నిర్మాణానికి ఏరికోరి కృష్ణశిలనే ఎంచుకున్నారు. ఆ శిల్ప రాశుల మధ్య నుంచీ వెళ్తున్నప్పుడు కారుమేఘాల మధ్య హరి నగరికి ప్రయాణిస్తున్న భావన
కలుగుతుంది.
మన వెనుక వందలకొద్దీ భక్తులు. మన ముందూ వందలకొద్దీ భక్తులు. అందరిని దాటుకుని ఆ నరసింహుడిని చేరుకునేదెప్పుడు? కండ్లారా దర్శించుకునేదెప్పుడు? –
అన్న మీమాంస మానవమాత్రులలో సహజమే.
పరమాత్మ చల్లనిచూపు కోసం ఎడతెగని ఎదురుచూపులోనూ నృసింహతత్వం అంతర్లీనం.
మహామహా తాపసులకే దుర్లభమైంది స్వామి దర్శనం. దేవదేవుడు ఓ పట్టాన ఎవరికీ చిక్కడు. చిక్కడు సిరి కౌగిటిలో.. జిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములం.. జిక్కడు శ్రుతిలతికావలి.. ఇల్లాలికి చిక్కనివాడు, ఇహాన్ని గెలిచిన రుషులకు చిక్కనివాడు, ఇహపర రహస్యాలను వెల్లడించే వేదాలకూ చిక్కనివాడు.. ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో.. మనకు చిక్కాడు. మన గడ్డ మీద స్వయంభూ మూర్తిగా అవతరించాడు. చిక్కని ప్రేమతో యశోదమ్మ కిష్టయ్యను రోటికి కట్టేసినట్టు, పరమ భక్తితో పరమాత్మను మన గుండెల్లో బంధించుకుందాం! నారసింహ మంత్రం జపిస్తూ, నారసింహ లీలలు స్మరిస్తూ.. ఈ కొద్ది గంటల సమయాన్ని అయినా హరికే అర్పిద్దాం. పాపాలూ లోపాలూ పరిహరించమని ప్రార్థిద్దాం. పరమాత్మ ప్రాంగణంలో ఆత్మస్తుతి, పరనింద వద్దు. నాలుకను నరహరి కీర్తన అనే జుంటితేనెలో ముంచి తేలుద్దాం.
ఓం నమో నారసింహాయ
* * *
వరుస కదిలినకొద్దీ అడుగు ముందుకు పడుతుంది. తూర్పుదిశలో ఉన్న పంచతల రాజగోపురం ద్వారా మొదటి ప్రాకారంలోకి అడుగుపెడతాం. కుడివైపు తిరిగితే.. ఈశాన్యం దిక్కున త్రితల రాజగోపురం! ఇదే లక్ష్మీ నరసింహుడి ముఖమండపానికి ప్రధాన ముఖ ద్వారం. ఇక్కడే అలంకృత ఐరావతాలు మనకు స్వాగతం పలుకుతాయి. ఆ గజరాజుల యజమాని దేవేంద్రుడని అంటారే! ఇంద్రపురిలో ఉండాల్సిన జోడు ఏనుగులు నరసింహ క్షేత్రంలో కొలువు చేయడం ఏమిటి? నిజమే, యజమాని ఇంద్రుడు కావచ్చు. కానీ, ఆ యజమానికి యజమాని నరసింహుడు. ఇంద్రుడికే ఇంద్రపదవి ఇచ్చిన పరమాత్ముడీతడు. ఐరావతాలేనా? కామధేనువు, కల్పవృక్షమైనా దిగి రావలసిందే?
ఆ ఆవరణలోని శిల్ప కళా సంపదను కండ్లారా దర్శిస్తున్న సమయంలో.. ఓ చోట చూపు ఆగిపోతుంది. ఆ ముగ్గురూ.. విష్ణు భక్తి సామ్రాజ్యానికి త్రిమూర్తులు. ముఖమండపం ప్రవేశంలో.. ఎడమ వైపున స్తంభాలపై హనుమంతుడు, ప్రహ్లాదుడు, యాదర్షి దివ్య శిల్పాలు. పరంధాముడు ఒక్కొక్కరిని ఒక్కోలా కటాక్షించాడు. హనుమ పట్ల యజమానిగా ఆదరణ చూపాడు. ప్రహ్లాదుడిని పితృవాత్సల్యంతో కరుణించాడు. యాదరి ్ష విషయంలో ఇష్టదైవమై కరుణ కురిపించాడు. అకళంక హరిభక్తి.. ఆ ముగ్గురినీ చరితార్థులను చేసింది. ఆస్తులు, అంతస్తులు, హోదాలు.. ఇవేవీ శాశ్వతం కాదు. నృసింహరూపుడైన శ్రీహరి భక్తి మాత్రమే నిక్కమై నిలుస్తుంది. ఈ విషయాన్ని తాళ్లపాక వారు తమ కీర్తనలోనూ ధ్రువీకరించారు…
వెనుకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు
యెనసి బ్రహ్మాండము లేలిరట
పెనకొని వారల పేరులు మరచిరి
మనుజ కీటముల మరెవ్వడెరుగు?
ఎంతోమంది పాలకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ కొన్ని పేర్లనే జనం తలుచుకుంటారు. కొందరి పాలననే విద్యార్థులు చరిత్రగా చదువుకుంటారు. స్వామిని రప్పించిన భక్తుడిగా యాదర్షి పేరే కాదు.. స్వామిని మెప్పించిన భక్తుడిగా, యాదాద్రి క్షేత్రానికి పునర్వైభవం తెచ్చిన కర్మ యోగిగా ముఖ్యమంత్రి కేసీఆర్ పేరూ చిరస్థాయిగా నిలిచిపోతుంది.
ఓం నమో నారసింహాయ
* * *
కొంతముందుకు వెళ్లగానే.. సాధారణ భక్తులకు, వీఐపీలకు వేర్వేరుగా రెండు వరుసల క్యూలైన్లు ఉంటాయి. ఇక్కడే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి తదితర ప్రముఖులకు వేదపండితులు ఆశీర్వచన పూర్వకంగా ఆలయ మర్యాదలు చేస్తారు. అమరశిల్పి జక్కన్న సైతం అబ్బురపడేలా కళాత్మకంగా తీర్చిదిద్దారీ ప్రదేశాన్ని. అల్లంత దూరంలోనే.. క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామి ఆలయం. రామావతారంలో రావణ సంహారానికి వానర సేనను తరలించిన హనుమ.. కృష్ణావతారంలో జెండాపై కపిరాజై నిలిచి కురుక్షేత్ర సంగ్రామంలో పాండవ కృష్ణుడి పక్షాన్ని గెలిపించాడు. ఆ బంధం కలియుగంలోనూ కొనసాగుతున్నది. యాదాద్రి క్షేత్ర పాలకుడిగా కీలక బాధ్యతలు తలకెత్తుకున్నాడు. గండ భేరుండ నారసింహుడు దర్శనమిచ్చే స్థానం కూడా మునుపటిలానే ఉంది. అప్పటిలానే అద్దంలో దర్శించుకోవచ్చు. నరుడిని, నారాయణుడిని బింబ ప్రతిబింబాలతో పోలుస్తుంది ద్వైత సిద్ధాంతం. బింబం స్వామి అయితే, ప్రతిబింబం భక్తుడని అంటారు. బింబ స్వరూపుడైన పరమాత్మ సర్వస్వతంత్రుడు. ప్రతిబింబంలోని మానవుడు అస్వతంత్రుడు, అర్భకుడు. అదిగో అటు చూడండి.. ఎంత ముచ్చటైన జంట!
బాసికము గట్టుకొని బంగారు గద్దె మీద
లాసి కూర్చున్నాడదివో లకిమమ్మతో
సూసకపు వనితలు సోబాన బాడగాను
భాసురమై యొప్పె ప్రహ్లాదవరదుడు
.. జగన్నాథుడు పెండ్లికొడుకైన ఘట్టం. ముజ్జగాల తల్లి పెండ్లి కూతురైన దృశ్యం.
ఆంజనేయస్వామి ఉపాలయం పక్కనే.. గోడలపై తంజావూరు నగిషీలతో రూపొందించిన లక్ష్మీనరసింహుల కల్యాణ ఘట్టాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రతి అవతారంలోనూ శ్రీదేవి పరమాత్మకు తోడై నిలిచింది. నీడై నడిచింది. ఆయనతోపాటు, ఆయన కోసమే పుట్టింది. పుట్టెడు కష్టాలను చిరునవ్వుతో అనుభవించింది. అందులోనూ, లక్ష్మీ నరసింహుల అనుబంధం మరీ ప్రత్యేకం. కోమలాంగి అయిన కొల్హాపురవాసిని కోరల దేవుడిని కోరికోరి వరించింది. మహోగ్రరూపుడిని పరమ శాంతమూర్తిగా మార్చేసిందా కాంతామణి. నరసింహుడు మాత్రం తక్కువ వాడా! చంచల అయిన క్షీరాబ్ధి కన్యకు తన ఒడిలో, హృదిలో స్థానమిచ్చి.. స్థిరత్వాన్ని ప్రసాదించాడు. లక్ష్మీ నరసింహులు ఒకరి కోసం ఒకరు సహజ స్వభావాన్నే మార్చుకున్నారు. స్వామి దర్శనానికొచ్చే కొత్తదంపతులకు ఆ పటం ఓ అనుబంధ పాఠం. ఆంజనేయస్వామి ఉపాలయాన్ని దాటి ముఖ మండపంలోకి అడుగుపెట్టగానే అలనాటి రాజప్రాసాదం సాక్షాత్కరిస్తుంది. తూర్పు ద్వారం గుండా భక్తులు వచ్చే మార్గంలోనూ.. పడమటి రాజగోపురం నుంచి బయటికి వెళ్లే మార్గంలో గోడలపై ఇరువైపులా.. అనేకానేక ఆధ్యాతిక ఘట్టాలు.
శంఖచక్రాల్లారా మీకు జోడు వందనాలు.
గరుత్మంతా నీకు ఆత్మ ప్రదక్షిణ!
సుదర్శనమూర్తీ శరణు శరణు.
యోగ నారసింహా.. జయము జయము!
ఓం నమో నారసింహాయ
* * *
అదే.. ప్రధాన హుండీ! ఆపద మొక్కుల వాడికి మొక్కులు చెల్లించుకోవచ్చు. లక్ష్మీపతికి సంపదలు సమర్పించుకోవచ్చు. ఏ పేరుతో పిలిచినా.. దేవుడి హుండీలో వేసేది కరెన్సీనోట్లో, బంగారు కాసులో కాదు.. ఐహిక సంపదల కారణంగా మనలో తిష్ఠవేసిన అహంకారాన్ని! అయినా, స్వామి పుచ్చుకునేది మేడలో మిద్దెలో కట్టుకోవడానికి కాదు. అంతకు పదింతలు తిరిగి ఇవ్వడానికే. ఏ పురాణంలో వెదికినా.. ఆయన ఉదారంగా ఇచ్చిన ఘట్టాలే కానీ, పుచ్చుకున్న సంఘటనలు పెద్దగా లేవు. ఇంద్రుడికి ఇంద్రపదవి ఇచ్చాడు. కుబేరుడికి కుబేరత్వం ప్రసాదించాడు. హనుమంతుడి పేరును భవిష్యత్ బ్రహ్మ పదవికి ఖరారు చేశాడు. శుకాది మహర్షులకు ముక్తినిచ్చాడు. విభీషణుడికి రాజ్యం ఇచ్చాడు. దేవతలకు అమృతం ఇచ్చాడు. పరమ రాక్షసుడైన హిరణ్యకశిపుడికి కూడా పెద్ద మనసుతో అమరత్వాన్ని ఇచ్చాడు. మనకు మాత్రం తక్కువ చేశాడా? కష్టపడటానికి శరీరాన్నిచ్చాడు, ఆలోచించడానికి బుద్ధినిఇచ్చాడు. నమస్కరించడానికి చేతులిచ్చాడు. కీర్తించడానికి నాలుక ఇచ్చాడు. వేయి చేతులతో మొక్కండి. వేనోళ్ల కొలవండి. నీరజాక్షుడు నీరుకొలది తామర!
ఓం నమో నారసింహాయ
* * *
ఉగ్ర, గండభేరుండ, జ్వాల, యోగానంద, లక్ష్మీసమేత.. అయిదు రూపాల్లో నరసింహుడు యాదర్షికి దర్శనమిచ్చాడని అంటారు. అందుకే యాదాద్రి పంచ నారసింహ క్షేత్రమైంది. ఆ ఐతిహ్యాన్ని చాటే శిల్పాలు ఆలయ ఆవరణలో అడుగడుగునా మనకు దర్శనమిస్తాయి.
ఎటుచూసినా గోవింద నామ స్మరణే. గర్భాలయానికి ఇరువైపులా జయవిజయుల విగ్రహాలు. స్వామి దర్శనం కోసం కొన్ని గంటలు వేచి ఉండటానికే.. మనం అంత ఇబ్బంది పడిపోతామే. సనక సనందనాదుల శాపం కారణంగా స్వామి సేవకు దూరమైన జయ విజయులు.. మళ్లీ చేరువ కావడానికి ఎన్ని జన్మజన్మలెత్తారు! శత్రువులై పుట్టి ఎన్నిసార్లు స్వామిచేతుల్లో గిట్టారు! అదీ శరణాగతి అంటే! ప్రధాన ఆలయ గోడలపై ప్రహ్లాద చరిత్ర ఘట్టాలను చూస్తున్నప్పుడు.. హరి భక్తుల కథలన్నీ మనసు తెరపై దృశ్యమానం అవుతాయి. హిరణ్యకశిపుణ్ని వధించాక నరసింహుడు ప్రహ్లాదుడికి సౌజన్యమూర్తిగా, భక్తాభయవరదుడిగా దర్శనాన్ని అనుగ్రహించిన దివ్య సన్నిధియే యాదాద్రి క్షేత్రమని పురాణాలు ఘోషిస్తున్నాయి.
గర్భాలయానికి దగ్గరవుతున్నకొద్దీ.. పరమాత్మకు మరింత చేరువ అవుతున్న భావన. వృద్ధాప్యం, యవ్వనం, కౌమారం.. దశలన్నీ దాటుకొని మళ్లీ బాల్యానికి వెళ్లిపోతాం. కలి, ద్వాపర, త్రేత, కృత.. కాల సూత్రాన్ని అధిగమించి సత్య కాలానికి చేరుకుంటాం. ప్రహ్లాద బాలుడిలా మారిపోతాం. అదివో అల్లదివో.. బంగారు తలుపుల వెనక.. సింగారాల శ్రీదేవితో కొలువైన స్వామి. శ్రీనరసింహుడిని, లక్ష్మీ నరసింహుడిని, యాదాద్రి నరసింహుడిని కండ్లారా దర్శించుకుందాం.
ఓం నమో నారసింహాయ
* * *
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో గర్భాలయం ముందున్న ముఖ మండపాన్ని మరింత పెంచారు. ఆండాళ్ అమ్మవారు, ఆంజనేయస్వామి, గరుడాళ్వారు ఆలయాలు, ధ్వజస్తంభం, బలిపీఠాలకు అదనంగా సేవా మండపం, ఆళ్వార్లు, రామానుజుల ఉప ఆలయాలను నిర్మించారు. వైష్ణవ మతప్రచారకులైన పన్నిద్దరు ఆళ్వార్ల విగ్రహాలను ముఖ మండపంలో రెండు వైపులా ఆరుగురి చొప్పున ఏర్పాటు చేశారు. 18 అడుగుల ఎత్తులో ఏకశిలపై కాకతీయ శైలిలోని 12 పిల్లర్లకు 10 అడుగుల ఎత్తులో చెక్కిన ఆళ్వార్ల మూర్తులు ఆకట్టుకుంటాయి. గర్భాలయ ముఖ ద్వారానికి ఎదురుగా గరుడాలయం, పక్కనే ధ్వజ స్తంభం ఉన్నాయి. దీని చెంతనే బలిపీఠం, దర్పణం, దీపకన్యల విగ్రహాలు. 34.6 అడుగుల ఎత్తులోని ధ్వజ స్తంభం, బలిపీఠాలకు బంగారు తాపడం చేయడంతో స్వర్ణకాంతులతో ముఖ మండపానికే కొత్త వన్నె తెస్తున్నాయి.
తూర్పు రాజగోపురం ముందు భాగంలోని మాడ వీధుల్లో బ్రహ్మోత్సవ మండపాన్ని నిర్మించారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఉత్సవ మూర్తులను ఈ మండపంలో అధిష్టింపజేసి ఉత్సవ పర్వాలను నిర్వహిస్తారు. ఇంత పెద్ద బ్రహ్మోత్సవ మండపం దేశంలో ఎక్కడా లేదు. పదివేల మంది కూర్చుని వేడుకలను తిలకించేలా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు.
వేంచేపు మండపంస్వామివారి దర్శనానంతరం ముఖమండపం నుంచి పడమటి రాజగోపురం ద్వారా వచ్చే భక్తులు ఇదే దిక్కున ఉన్న సప్తతల మహా రాజగోపురం నుంచి బయటికి వెళ్తారు. ఇలా బయటికి అడుగు పెట్టగానే మాడ వీధుల్లో వేంచేపు మండపం కనిపిస్తుంది. ఇది తిరుమలలోని గొల్ల మండపాన్ని పోలి ఉంటుంది. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారు తిరు మాడవీధుల్లో ఊరేగిన తర్వాత వేంచేపు మండపం వద్ద కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులను మండపంలో అధిష్ఠింపజేస్తారు.
అష్టభుజ ప్రాకార మండపం
అతికొద్ది ఆలయాల్లో మాత్రమే కనిపించే అష్టభుజ ప్రాకార మండపాలు యాదాద్రిలోనూ ఉన్నాయి. మండప పైభాగంలో సాలహారం ఏర్పాటు చేశారు. కేశవ మూర్తులు, నవ నారసింహులు, ఆళ్వారులు, అష్టదిక్పాలకులు, అష్టలక్షులు, దశావతారాలు, వైష్ణవ ఆచార్యుల విగ్రహాలను ఆ సాలహారాల్లో ప్రతిష్ఠించారు. అష్టభుజ మండపం లోపలి వైపున నలు దిశల్లోనూ నాలుగు మండపాలను నిర్మించారు. ఈశాన్యంలోని కల్యాణ మండపంలో భక్తులు నిత్య కల్యాణం నిర్వహించుకుంటారు. ఆగ్నేయంలోని రామానుజ కూటమిని నివేదన ప్రసాదం తయారీ కోసం తీర్చిదిద్దారు. నైరుతిలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ సుదర్శన నారసింహ హోమం నిర్వహిస్తారు. ఇక వాయవ్యంలోని అద్దాల మండపంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక సేవలు, అమ్మవారికి ఊంజల్ సేవ నిర్వహిస్తారు.
శ్రీలక్ష్మీ నరసింహుడి ప్రధాన ఆలయాన్ని రెండు ప్రాకారాలలో నిర్మించారు. రెండో ప్రాకారం లోపలి వైపున ఉన్న మండపాల్లో 58 యాలీ పిల్లర్లను, తిరుమాడ వీధుల వైపు మరో 158 యాలీ పిల్లర్లను ఏర్పాటు చేశారు. సింహం తన కింది భాగంలో ఉన్న ఏనుగు తొండాన్ని అదిమిపెట్టినట్లుగా కనబడే ఈ పిల్లర్లు ద్రావిడ శైలిని ప్రతిబింబిస్తాయి. రెండో ప్రాకారం వెలుపలి వైపున 28 అష్టభుజ మండపాలను, 153 బాలపాదాల పిల్లర్లను ఆధ్యాత్మిక భక్తి భావం పెంపొందించేలా రూపొందించారు. అష్టభుజ మండప ప్రాకారాల్లోని స్తూపాలపై పురాణ ఘట్టాలు, పంచనారసింహ రూపాలు కనువిందు చేస్తాయి. దేవేంద్రుడు, వరుణ దేవుడు తదితర దిక్పాలకులు దర్శనమిస్తారు. బాలపాదం ప్రతి స్తంభంపై నవనారసింహ అవతారాలు, సింహం, ఏనుగులు, హంసలు, పుష్పాలు.. ఇలా రకరకాల శిల్పాకృతులతో అష్టభుజ మండపాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. బాలపాదం కింద సింహం నోట్లో రాతి గుండు ఉండేలా చాకచక్యంగా శిల్పాలను చెక్కారు. మొదటి ప్రాకారం వెలుపల, రెండో ప్రాకారం బాహ్య, అంతర ప్రాకారాల్లో కృష్ణశిలతో ప్రాణంపోసిన దశావతారాలు, ఆళ్వార్లు, అష్టదిక్పాలకులు, విష్ణువు, 108 క్షేత్రాల నరసింహ ప్రతిమలతో కూడిన 243 విగ్రహాలు శోభాయమానంగా సాక్షాత్కరిస్తాయి.
విష్ణుమూర్తి వాహన ప్రియుడు. త్రేతాయుగంలో హనుమద్వాహనంపై లంకకు వెళ్లాడు. సీతా సమేతుడై పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగొచ్చాడు. ద్వాపరలో గరుత్మంతుడినెక్కి ఇంద్రలోకానికి వెళ్లి కల్పవృక్షాన్ని సాధించుకొచ్చాడు. మనోరథాలను నెరవేర్చే స్వామి కోసం యాదాద్రిలో అందమైన రథాన్ని సిద్ధం చేశారు. ప్రధానాలయానికి పడమర, ఉత్తర రాజగోపురాల మధ్యలో వాయవ్య దిశలో 29 అడుగుల ఎత్తులో ఆధ్యాత్మిక హంగులతో రథశాలను నిర్మించారు. ఈ నిర్మాణం కూడా రథాన్ని పోలి ఉంటుంది.
కృష్ణశిలతో నిర్మితమైన సప్త గోపురాలు ఆలయానికి అల్లంత దూరం నుంచే యాత్రికులలో భక్తి భావనలు పెంచుతాయి
ఇంద్ర గోపురం
స్వామివారిని దర్శించుకునే భక్తులు తూర్పున రెండో ప్రాకారంలో నిర్మించిన పంచతల రాజగోపురం నుంచే ఆలయంలోకి ప్రవేశిస్తారు. 55 అడుగుల ఎత్తులో ఐదు అంతస్తులలో దీన్ని నిర్మించారు. ద్వారం వద్ద ఉన్న ఐరావతాలు, ద్వార పాలకుల విగ్రహాలు స్వాగతం పలుకుతాయి. ఈ గోపురాన్ని ఇంద్ర గోపురంగా వ్యవహరిస్తారు.
విమాన గోపురం
శ్రీలక్ష్మీనారసింహుడు కొలువుదీరిన గర్భాలయంపై ఉన్నదే విమాన గోపురం. అయిదు అంతస్తులలో 45 అడుగుల ఎత్తులో నిర్మించిన పంచతల విమాన గోపురం మిగతా గోపురాలతో పోలిస్తే చాలా ప్రత్యేకం. 125 కిలోల బంగారంతో తాపడం చేపట్టారు.
ఈశాన్య గోపురం
తూర్పున పంచతల రాజగోపురం దాటుకుని లోపలికి వెళ్లాక మొదటి ప్రాకారంలో ఈశాన్య దిక్కున త్రితల రాజ గోపురం ఉంటుంది. ఈ గోపుర ద్వారం నుంచే ప్రధాన ఆలయంలోకి భక్తులు అడుగు పెడతారు. మూడు అంతస్తులలో 45 అడుగుల ఎత్తున ఉన్న ఈ నిర్మాణాన్ని ఈశాన్య గోపురంగా వ్యవహరిస్తారు.
వరుణ గోపురం
అయిదు అంతస్తులలో 55 అడుగుల ఎత్తులో పశ్చిమ దిక్కున పంచతల రాజగోపురాన్ని నిర్మించారు. మహా రాజగోపురానికి లోపలి వైపు మొదటి ప్రాకారంలో ఈ గోపురం ఉంటుంది. గోపుర ద్వారానికి ఇరువైపులా ఐరావతాల విగ్రహాలు, జయవిజయుల మూర్తులు ఉంటాయి. దీన్ని వరుణ గోపురంగా వ్యవహరిస్తారు.
మహా రాజగోపురం
మిగతా అన్ని గోపురాల కంటే ఎత్తుగా మహా రాజగోపురాన్ని నిర్మించారు. పశ్చిమాన రెండో ప్రాకారంలోని ఈ సప్తతల రాజగోపురం ఏడు అంతస్తులలో 75 అడుగుల ఎత్తుతో అలరారుతున్నది. గర్భాలయంలోని స్వామి వారికి అభిముఖంగా ఉంది.
కుబేర గోపురం
రెండో ప్రాకారంలో ఉత్తరం వైపున పంచతల రాజగోపురాన్ని 55 అడుగుల ఎత్తులో అయిదు అంతస్తులలో తీర్చిదిద్దారు. గోపురానికి ఇరువైపులా సింహాల ప్రతిమలను ఏర్పాటు చేశారు. ఉత్తర ద్వార దర్శనానికి ఉపయోగించే ఈ గోపురాన్ని కుబేర గోపురంగా వ్యవహరిస్తారు.
యమ గోపురం
రెండో ప్రాకారంలో దక్షిణం దిక్కున ఈ పంచతల రాజగోపురాన్ని నిర్మించారు. అయిదు అంతస్తులలో 55 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ గోపుర ద్వారానికి ఇరు
వైపులా సింహాల ప్రతిమలు ఉంటాయి. దీన్ని యమ గోపురంగా వ్యవహరిస్తారు.