వికారాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ) : సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) విషయంలో మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిర్ణీత గడువులోగా ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి సర్కార్కు అందించాల్సిన మిల్లర్లు నిర్లక్ష్యం చేస్తున్నారు. సీఎంఆర్ను కొందరు ఏండ్ల కొద్ది పెండింగ్లో పెడుతూ ఈ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్నది. ప్రతి ఏడాది రెండు సీజన్లలో రైతులు పండించే ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి, మర ఆడించి బియ్యంగా మార్చి ఇచ్చేందుకు మిల్లర్లకు ధాన్యాన్ని కేటాయిస్తుంది. ప్రభుత్వం మిల్లర్లకు ఇచ్చే ధాన్యంలో 67శాతం మేర బియ్యాన్ని తిరిగి సర్కార్కు ఇవ్వాల్సి ఉంటుం ది. కాగా, కొందరు మిల్లర్లు రెండు, మూడేండ్లు దాటినా సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి అందించకుండా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి.
ప్రభుత్వం ఇచ్చే ధాన్యాన్ని 15రోజుల్లోగా తిరిగి సీఎంఆర్ రైస్గా మిల్లర్లు ఇవ్వాల్సి ఉన్నా రెండు, మూడుసార్లు గడువును పొడిగిస్తూ సమయమిస్తున్నా సీఎం ఆర్ను ఇవ్వకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారు. సీజన్ల వారీగా ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇవ్వాలని షరతు ఉన్నా కాలయాపన చేస్తూ..ఆ రైస్ను పక్కదారి పట్టిస్తూ ప్రభుత్వానికి రూ.కోట్లలో నష్టం కలిగిస్తున్నారు. సీఎంఆర్ రైస్ను తిరిగి ఇవ్వడంలో మిల్లర్లు కావాలనే కాలయాపన చేస్తున్నారని తెలిసినా మళ్లీ ఆ మిల్లర్లకే ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు కేటాయిస్తుండడంతో.. వారు మిల్లర్లతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలున్నాయి. గతేడాది ఖరీఫ్కు సంబంధించి 50,914 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని మిల్లర్లు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు 24, 195 మెట్రిక్ టన్నులు.. అలాగే, గతేడాది రబీకి చెందిన 35,807 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రైస్ను ప్రభుత్వానికి మిల్లర్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం 5,091 మెట్రిక్ టన్నుల రైస్నే అందించారు.
జిల్లాలో సీఎంఆర్ బియ్యం ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఇవ్వాల్సి ఉండగా కొంతమంది మిల్లర్లు మినహా మిగిలిన వారంతా బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ అక్రమంగా ఆర్జిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మిల్లర్లపై పౌరసరఫరాల శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో సర్కార్కే టోకరా పెడుతున్నారు. ధాన్యం ఇచ్చిన 15 రోజుల్లోగా సీఎంఆర్ రైస్ తిరిగివ్వాలని ఉన్నా నిబంధనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఇదే అదునుగా మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సర్కార్ బియ్యాన్ని నల్లబజారుకు తరలిస్తూ..డబ్బును ఆర్జిస్తున్నట్టు ఆరోపణలున్నాయి.
జిల్లాలో గతేడాది రైస్ మిల్లర్లు సీఎంఆర్ రైస్ను ప్రభుత్వానికి ఇవ్వకుండా అవకతవకలకు పాల్పడడంతో దోమ, యాలాల మండలాల్లో రైస్ మిల్లర్లపై కేసు నమోదైంది. దోమ మండలంలో రూ.7 కోట్ల ధాన్యానికి సీఎంఆర్ ఇవ్వకుం డా పక్కదారి పట్టిస్తే, యాలాల మండలంలో రూ.6.80 కోట్ల విలువైన ధాన్యా న్ని దారి మళ్లించడంతో మిల్లర్లపై కేసు నమోదు చేశారు. రైస్ మిల్లర్లు చెల్లించాల్సిన మొత్తాన్ని క్లియర్ చేస్తానని, డిఫాల్ట్ నుంచి తీసేయాల్సిందిగా పౌరసరఫరాల శాఖ అధికారి ద్వారా కలెక్టర్కు విన్నవించడంతో వారికి మళ్లీ అవకాశమివ్వడం గమనార్హం.
రెండేండ్లుగా పెండింగ్లో ఉన్న సీఎంఆర్ బియ్యాన్ని అందించేందుకు గడువిచ్చినా గడువులోగా లెవీని అందజేయని మిల్లర్లపై గతేడాది ప్రభుత్వం పెనాల్టీ విధించింది. లెవీ బియ్యానికి అదనంగా 25% మేర బియ్యం లేదా డబ్బులు చెల్లించేలా మిల్లర్లను ఆదేశించింది. జిల్లాలో 45రైస్ మిల్లర్లకు పెనాల్టీ విధించినా మిల్లర్ల తీరు మా త్రం మారలేదు. ఇటీవల ధాన్యాన్ని వేలం వేయగా పాల్గొని దక్కించుకున్న మిల్లర్లు ప్రభుత్వానికి డబ్బులను చెల్లించడం లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రూ.95కోట్ల విలువైన 45,500 మెట్రిక్ టన్నుల ధాన్యా న్ని వేలంలో దక్కించుకున్న మిల్లర్లు ఇప్పటివరకు రూ.4.50 కోట్లను మాత్రమే ప్రభుత్వానికి చెల్లించారు.