ఖమ్మం : జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. బతుకుదెరువు కోసం పొట్ట చేతపట్టుకొని వలస వచ్చిన వారి జీవితాలు వరద ప్రవాహంలో కలిసిపోయాయి. కాలువలో గల్లంతై ముగ్గురు యువకులు జలసమాధి అయ్యారు. ఈ హృదయవిదారకర సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.
జిల్లాలోని ముదిగొండ మండలంలోని కట్టకూరు గ్రామ సమీపంలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువ (మంగాపురం మేజర్ కెనాల్) లో పడి ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు.
ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..పంజాబ్ రాష్ట్రానికి చెందిన గమి (30), సాజన్(19), మణి(29) అనే ముగ్గురు వ్యక్తులు కట్టకూరులో వరి కోసేందుకు వచ్చారు. వీరు వరి కోత యంత్రం ఆపరేటర్లుగా పని చేస్తున్నారు. సోమవారం రాత్రి ఎన్నెస్పీ కాలువ వద్ద బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి కాలువలో పడగా.. ఆ వ్యక్తిని కాపాడే క్రమంలో మిగిలిన ఇద్దరూ కాలువలో పడి వరద ఉధృతికి ముగ్గురూ గల్లంతు అయినట్లు సమాచారం.
మంగళవారం ఉదయం కాలువ వైపు వెళ్లిన స్థానికులు గట్టుమీద వారి బైకు, చెప్పులు ఉండటం గమనించి ఎవరైనా కాలువలో కొట్టుకుపోయి ఉండవచ్చని ఎన్నెస్పీ అధికారులకు సమాచారం అందించగా అధికారులు కాలువ నీటి ప్రవాహాన్ని తగ్గించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారించగా పంజాబ్ రాష్ర్టానికి చెందిన వరికోత మిషన్ ఆపరేటర్లుగా తెలిసింది. గాలింపు చర్యలు చేపట్టామని ఇప్పటి వరకు మృతదేహాలు లభించలేదన్నారు. పక్క మండలాల అధికారులకు కూడా సమాచారం అందించామని ముదిగొండ ఎస్ఐ తోట నాగరాజు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Tiger attack | జయశంకర్ జిల్లాలో బర్రెల మందపై పులి దాడి..భయాందోళనలో గ్రామస్తులు
అయ్యప్ప మాలధారణతో దొంగతనాలు..దేహశుద్ధి చేసిన గ్రామస్తులు
Crime news | వేటగాళ్ల ఉచ్చుకు తండ్రి, కొడుకు మృతి..మరొకరికి గాయాలు